దశాబ్దాలుగా ఆదరణ కరువై.. చేయూత లేక ఆగమైన కులవృత్తులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. సమైక్య పాలనలో పూర్తిగా వివక్ష ఎదుర్కొన్న రజకులు, నాయీబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. లాండ్రీషాపులు, సెలూన్లకు నెలకు 150 యూనిట్లు ఉచితంగా కరంటు ఇస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తున్నది. 2021 ఏప్రిల్ నుంచి ఉచిత కరంటు పథకం అమల్లోకి రాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 5,195 మంది లబ్ధిపొందుతున్నారు. దీనికితోడు లక్ష మందికిపైగా ఎస్సీ, ఎస్టీలకు కూడా కేసీఆర్ సర్కారు సమప్రాధాన్యత ఇస్తున్నది. గృహావసరాలకు 2018 సంవత్సరం నుంచి 101 యూనిట్లు ఇస్తుండగా.. నెలకు దాదాపు రూ.14 కోట్ల వరకు ఖర్చు భరిస్తున్నది. ఉచిత కరంటు ఇస్తుండడంతో రజకులు, నాయీబ్రాహ్మణులు, ఎస్సీ, ఎస్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– మంచిర్యాల, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఒక్క రూపాయి కడుతలే..
నిర్మల్ టౌన్, జనవరి 2 : ఐదేండ్ల సంది బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతున్న. ఇది వరకు బొగ్గుల పెట్టెతో చేసేటోన్ని. జతకు రూ.5 తీసుకునేది. దినం 10 నుంచి 15 జతలు చేసేది. రోజూ రూ.100 నుంచి రూ.150 దొరికేవి. ఇందులో కరంటు బిల్లుకే సగం పైసలు పోయేవి. మిగతా పైకంతో కుటుంబం ఎల్లుడు కట్టమవుతుండే. సర్కారోళ్లు మా అసొంటోళ్లకు 100 యూనిట్లలోపు ఉచితంగా కరంటు ఇస్తమని చెప్పిన్రు. నేను గూడా పోయినేడాది దరఖాస్తు పెట్టుకున్న. సార్లు వచ్చి టేలాకు మీటరు బిగించింన్రు. నెలనెలా 100 యూనిట్లలోపే కరంట్ కాలుతంది. గిప్పటి దాకా గవర్నమెంటోళ్లే బిల్లు కట్టిన్రు. నేను కట్టేదుంటే రూ.1000కిపైగా అయ్యేవి. నేనైతే యేడాది సంది ఒక్క రూపాయి కట్టలేదు. కరంటుకు కటే పైసలు నా పిల్లల సదువులకు వాడుతున్నా. గిది వరకు బొగ్గుల పెట్టెతో ఇస్త్రీ చేస్తే బట్టలపై మిరుగులు పడేయి. వాళ్లు తిట్టేటోళ్లు. గిప్పుడు కరంటు పెట్టెతో ఇస్త్రీ చేస్తున్న. ఏ సమస్యా లేదు. నాలాంటి పేదోడికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంట.
– మెట్పల్లి నాగరాజు, నిర్మల్ పట్టణం
మంచిర్యాల, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పొద్దంతా కష్టపడితే రూ.300 దొరుకుడే గగనం. రెక్కలు ముక్కలు చేసుకొని నెల మొత్తం తీరిక లేకుండా కటింగ్ చేస్తే.. బట్టలు ఉతికి ఐరెన్ చేస్తే.. వచ్చే మొత్తం ఇంటి ఖర్చులకే సరిపోవు. నెలకు రూ.10 వేల నుంచి రూ.12వేలు సంపాదించడమే కష్టమంటే అందులో రూ.2 వేల నుంచి రూ.3వేల కరంట్ బిల్లే వచ్చేది. మిగిలిన పైసలతో పిల్లల చదువులు, ఇంటి అవసరాలు, పండుగలు, పబ్బాలు అన్నీపోనూ అప్పులు చేయకతప్పని పరిస్థితి. కులవృత్తులను నమ్ముకుంటే చివరికి మిగిలేది కష్టాలే అన్నది ఒకప్పటి మాట. కానీ.. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కుల వృత్తులు చేసుకునే వారి బతుకులు బాగుపడేందుకు సీఎం కేసీఆర్ కరంట్ కష్టం లేకుండా చేసిండు. సెలూన్, లాండ్రీషాపులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండు. 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో 5,195 మంది లబ్ధిపొందుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ పవర్..
బడుగు, బలహీనవర్గాలతోపాటు అనాదిగా వెనుకబడిన వర్గాలపై ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ మేరకు వారి గృహావసరాలకు సరఫరా చేసే ఉచిత విద్యుత్ కోటాను 2018 సంవత్సరంలో 51యూనిట్ల నుంచి 101యూనిట్లు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా ఎస్టీ, ఎస్టీలకు ఈ రాయితీ వర్తిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వీరి కోసం సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ప్రతినెలా ఖర్చు చేస్తున్నది. 101 యూనిట్లలోపు వారందరికీ కరంటు బిల్లు ఉండదు. 102వ యూనిట్ నుంచి జమ అవుతుంది. నిరుపేద కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నది.
సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి 150 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఏసీ ఉన్న షాపులకు మాత్రమే బిల్లు వస్తున్నది. లేనిషాపుల్లో నామామాత్రపు బిల్లే వస్తున్నది. ఒక లైటు, ఒక ఫ్యాన్, మూడు ట్రిమ్మర్ల వరకు ఈ 150 యూనిట్లు సరిపోతున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ధోబీఘాట్లకు ఐరన్ బాక్స్ హెవీ హోల్టేజీ ఉంటే మాత్రం బిల్లు వస్తున్నది. లో ఓల్టేజీ వాడిన వారికి ఎలాంటి బిల్లు రావడం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 150 యూనిట్లలో షాపులు నడుపుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది అర్హులు
ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ కరెంట్ సప్లయ్కు సంబంధించి చాలా మంది అర్హులు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు మరో 2 వేల మంది సర్టిఫికేట్లు ఇవ్వని కారణంగా కనెక్షన్లు ఆగిపోయాయి. వారి ధ్రువీకరణ పత్రాలు ఇస్తే వెంటనే కనెక్షన్లు ఇస్తాం. ధోబీఘాట్ల దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరంట్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలనేదే మా ఉద్దేశం.
– శేషారావు, విద్యుత్శాఖ ఎస్ఈ.
బిల్లు కట్టే బాధ తప్పింది
కాసిపేట, జనవరి 2 : మాలాంటి పేదోళ్లను సీఎం కేసీఆర్ సార్ అన్నితీర్ల ఆదుకుంటున్నడు. ఇంటి కరంట్ బిల్లు కట్టి ఆసరైతున్నడు. మేము 100 యూనిట్లు వరకే కరంట్ వాడుతం. మాకు బిల్లు కట్టే బాధ తప్పింది. తెలంగాణ రాకముందు మా ఊరిలో అసలు కరంటే ఉండకపోయేటిది. ఇప్పుడు 24 గంటలూ కరంటిస్తన్రు. గిసొంటి సీఎం ఉంటే అందరి బతుకులు బాగుపడుతయ్.
– చిక్రం నీలాబాయి, చిక్రంగూడ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
తాండూర్, జనవరి 2 : నాకు కటింగ్ షాపు ఉంది. చాలా ఏండ్లసంది గీ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలకు పెండ్లి చేసిన. పెద్ద కొడుకు సాగర్ ఎంఎస్సీ బీఈడీ చదివి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నడు. చిన్న కొడుకు తిరుపతి డిగ్రీ పూర్తి చేసిండు. ఇంటి వద్దే కటింగ్ షాపు పెట్టుకున్నడు. మాకు ప్రతి నెలా కరెంట్ బిల్లు తడిసి మోపెడయ్యేది. పొద్దంతా కష్టపడితే వచ్చే సొమ్ములో కరెంట్ బిల్లులు కట్టడం.. ఇటు ఇంటి ఖర్చులు వెళ్లదీయడం మస్తు ఇబ్బందయ్యేది. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ మాకు అండగా నిలిచిండు. 250 యూనిట్ల వరకు ఉచితంగా కరంట్ ఇస్తున్నడు. ఈ నిర్ణయం బాగుంది.
– చిలివేరి గంగయ్య, నాయీ బ్రాహ్మణుడు, కటింగ్ షాపు, తాండూర్
భారం తగ్గింది
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) :మారుతున్న కాలానికి అనుగుణంగా కటింగ్ షాపుల నిర్వహణలోనూ అనేక మార్పులు వచ్చాయి. గతంలో కత్తెరలు, మంగళి కత్తితో మాత్రమే కటింగ్, గడ్డాలు తీసేటోళ్లం. ఇప్పుడు కొత్తగా పరికరాలు వచ్చాయి. కటింగ్ దుకాణాల్లో సైతం విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఇది వరకు ప్రతి నెలా కరంటు బిల్లు రూ. 500 దాకా వచ్చేది. ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా కరంట్ ఇవ్వడంతో మాపై భారం తగ్గింది. సీఎం కేసీఆర్ చేతి వృత్తులపై ఆధారపడేవారికి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. ఇది గొప్ప విషయం.
– రజనీకాంత్, కటింగ్ షాపు, ఆసిఫాబాద్
గవర్నమెంటోళ్లే బిల్లు కడుతున్నరు
నిర్మల్ టౌన్, జనవరి 2 : మేము ఎవుసం చేస్కుంట బతుకుతం. పొద్దున పోయిందంటే ఏ రాత్రికో ఇంటికొస్తం. సర్కారోళ్లు ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు కరంటు ఫ్రీ అని చెప్పిన్రు. 2018లో దరఖాస్తు చేసుకున్న. కరంటోళ్లు వచ్చి మీటరు పెట్టి పోయిన్రు. అప్పటి నుంచి మేము కరంటు వాడుతున్నం. మాకు 100 యూనిట్ల కంటే ఎక్కువగా కాలదు. ఇప్పటి వరకైతే ఒక్క రూపాయి కట్టింది లేదు. గవర్నమెంటోళ్లే మా బిల్లులు కడుతున్నట్లు రిసీప్టులు ఇస్తున్నరు. గిసొంటి సీఎం ఉన్నంత కాలం మా పేదోళ్ల బతుకులు మంచిగుంటయ్.
– మోస్రం భీంరావు, మున్యాలగొండ, దస్తురాబాద్ మండలం
ఇది వరకు పట్టించుకున్నోళ్లు లేరు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) :మునుపు కటింగ్ షాపుల్లో విద్యుత్ వినియోగం పెద్దగా ఉండేది కాదు. మారుతున్న కాలానికనుగుణంగా విద్యుత్ పరికరాలు వాడాల్సి వస్తోంది. ప్రతి నెలా నాలుగైదు వందల కరంట్ బిల్లు వచ్చేది. ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కాల్చుకునే వెసలుబాటు కల్పించింది. ఈ నిర్ణయం మాకు ఎంతో ఆసరాగా నిలిచింది. విద్యుత్పై ప్రభుత్వం కల్పించిన రాయితీతో మాపై పడుతున్న ఆర్థిక భారం తగ్గింది. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సర్కారు ఏదైనా ఉందంటే టీఆర్ఎస్సే. ఇది వరకు ఉన్న పాలకులెవ్వరూ కులవృత్తుల వారి గురించి పట్టించుకున్నది లేదు.
– సొన్నాయిల నరేశ్, కటింగ్ షాపు, బాబాపూర్, ఆసిఫాబాద్