నిర్మల్ అర్బన్, జున్ 10: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈనెల 3వ తేదీన డీఈవో డాక్టర్ రవీందర్ రెడ్డి కుంటాల మండలం ఓల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 వరకు నిర్మల్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ శుక్రవారంతో ముగిసింది. మరోవైపు జూన్ 3 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహిస్తోంది. జిల్లాలోని 19 మండలాల్లో అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామాల్లో ఉపాధ్యాయులు తిరుగుతున్నారు. పిల్లలను సర్కారు స్కూళ్లకే పంపాలని కోరుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా రు. ప్రభుత్వ పాఠశాలలోని సదుపాయాలు, సౌకర్యాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తూ సర్కారు బడిలో చేర్చుకున్నారు. నిర్మల్ జిల్లాలో 834 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, నీట్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు, సన్న బియ్యంతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజు కూ పెరుగుతుండడమే మార్పును సూచిస్తున్నది.
మన ఊరు మన బడితో గణనీయ మార్పు
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలుకల్పిస్తున్నది. అదనపు తరగతి గదులను ని ర్మించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం చదువులను విద్యార్థులకు అందిస్తున్నది. నిర్మల్ జిల్లాలో260 ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మన బడి కింద ఎంపిక చేసి ఆపాఠశాలల రూపురేఖలను అధికారు లు మార్చారు. దీంతో పాటు విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తున్నారు.
3661 మంది విద్యార్థుల చేరిక
నిర్మల్ జిల్లాలో బడిబాట కార్యక్రమం స త్ఫలితాలను ఇచ్చింది. ఈనెల 3వ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు జిల్లాలో 3661 మంది విద్యార్థులు సర్కారు బళ్లలో చేరారు. ఇందులో అంగన్వాడీ నుంచి 1822 మంది చిన్నారులు, 454 మంది నే రుగా అడ్మిషన్లు, 1257 మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అ త్యధికంగా భైంసా మండలంలో 372 మంది, అత్యల్పంగా బాసరలో 80 మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరారు.