జన్నారం, మార్చి 12 : వేసవి నేపథ్యం లో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్ర త్యేక దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా తాగు నీ రందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడ్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేటరేంజ్లలోని అడవుల్లో తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నది. వాగుల్లో చెలిమెలు, ర్యాంప్వెల్స్ వంటివి ఏర్పాటు చేస్తూనే.. సోలార్ పంపుల ద్వారా కుంటలు, చెరువుల్లో నీటిని నింపుతున్నది.
ర్యాంప్ వెల్స్
వన్యప్రాణులు సులువుగా నీరు తాగేలా అడవుల్లో ర్యాంప్వెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఊటలు ఉన్నచోట 10 మీటర్ల వెడెల్పు, 3 మీటర్ల లోతు గుంతలు తవ్వుతున్నారు. జీవాలు అందులోకి దిగి దాహం తీర్చుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఆయాచోట్ల సుమారు 30 ర్యాంప్ వెల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వాగుల్లో చెలిమెలు
టైగర్ రిజర్వుడు ఫారెస్ట్లో ఉన్న వాగుల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చెలిమె కు మధ్యలో 500 మీర్ల దూరంలో ఉండేలా చూస్తున్నారు. వన్యప్రాణులు అందులోకి సు లభంగా నీరు తాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంటలు, చెరువుల్లో నీరు నింపడం
అడవుల్లో సోలార్ పంపుల ద్వారా కుంటలు, చెరువుల్లో నీటిని నింపుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సాసర్ వెల్స్లలో రెండు రోజులకోసారి నీటిని నింపడమేగాక.. అందులోని చెత్తను తొలగిస్తున్నారు.
సహజసిద్ధంగా ఏర్పాట్లు
ఎఫ్డీపీటీ,డీఎఫ్వో ఆదేశాల మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ ఫారెస్ట్లో వన్యప్రాణులకు ఆహారంతో పాటు సహజ సిద్ధంగా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ర్యాంప్ వెల్స్తో పాటు వాగుల్లో 500 మీటర్లకో చెలిమె ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ పంపుల ద్వారా కుంటలు, చెరువులు నింపుతున్నాం. – హఫీసొద్దీన్, జన్నారం రేంజ్ ఆఫీసర్