చెన్నూర్, అక్టోబర్ 25: చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం నుంచి రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈసారి కూడా భారీ విజయం సాధించేందుకు శ్రేణులతో కలిసి గెలుపు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలుపుపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఆగస్టు 26న: ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు జైపూర్ మండలంలోని ఇందారం వద్ద ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి చెన్నూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన ప్రజా ఆశ్వీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
సెప్టెంబర్ 4న: మందమర్రి పట్టణాకి వచ్చిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి, పట్టణంలోని పుర వీధుల్లో బైక్ ర్యాలీ
సెప్టెంబర్ 7న: మంచిర్యాలలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్తో కలసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యూహాలను వివరించారు.
సెప్టెంబర్ 9న: క్యాతన్పల్లిలోని తన స్వగృహాంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో, మందమర్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మందమర్రి మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్దతులపై దిశా నిర్దేశం చేశారు.
అక్టోబర్ 1న : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీలకు ఆహ్వానించి పెద్ద ఎత్తున చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మందమర్రి పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో, క్యాతన్పల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపించే బాల్క సుమన్ను భారీ మెజార్టీతో మరో సారి గెలిపించాలని ఆయన కోరారు.
అక్టోబర్ 7న: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును చెన్నూర్కు ఆహ్వానించి పెద్ద ఎత్తున చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం చెన్నూర్లో నిర్వహించిన భారీ రోడ్షోలో మంత్రి హరీశ్రావు ప్రసంగించి సీఎం కేసీఆర్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించి, బాల్క సుమన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అక్టోబర్ 13న: మందమర్రి పట్టణంతో పాటు కోటపల్లి, చెన్నూర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 14న: క్యాతన్పల్లిమున్సిపాలిటీ, జైపూర్, భీమారం మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయా చోట్ల సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
అక్టోబర్ 17న: క్యాతన్పల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్తో సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా వినియోగంపై దిశా నిర్దేశం చేశారు. ఇలా ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ను మున్సిపాలిటీల వారీగా గ్రా మాల వారీగా సిద్ధం చేశారు. దీంతో అన్ని పార్టీల కంటే ముందుగానే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇప్పటికే ప్రచార వాహనాలను ప్రారంభించడంతో, అట్టి వాహనాలు పట్టణాలు, గ్రామాలు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన పలు ప్రజా సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పాటల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, తిరిగి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తున్నారు. ఇలా ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందుగా నియోజవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకపోతున్నది.