ఎదులాపురం, జనవరి 2 : పీహెచ్సీకి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించి వైద్య సేవల్లో రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో ఉంచాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇటీవల ప్రభుత్వం పీహెచ్సీలకు రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్లను కేటాయింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో సోమవారం వారికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందించేందుకు అన్ని రకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. ఇకపై పీహెచ్సీకి వచ్చే రోగులు, గర్భిణులు, చిన్న వ్యాక్సినేషన్ తదితర వాటిని క్రమం తప్పకుండా పరీక్షలు చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు టీహబ్లోనే చేయడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. పీహెచ్సీలల్లో ప్రసవల సంఖ్యను పెంచాలని తెలిపారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి నెలా జిల్లా, రాష్ట్ర అధికారులతో సమీక్షాసమావేశాలు ఉంటాయని తెలిపారు. పీహెచ్సీకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్వో మెట్పెల్లివార్ శ్రీకాంత్, డీఎంవో శ్రీదర్, ప్రోగ్రాం అధికారి విజయసారథి నూతన పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.