నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 26 : ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా కసరత్తు తుది అంకానికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అనర్హుల ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలున్నాయి. జిల్లాలో 6,71,369 మంది ఓటర్లున్నారు. ఇందులో 3,24,990 మంది పురుషులు, 3,46,325 మంది మహిళా ఓటర్లు, 54 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు పెద్దఎత్తున ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో 302, ముథోల్లో 311, ఖానాపూర్లో 305 పోలింగ్ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు బీఎల్వోలుగా ఓటరు నమోదుకు అవకాశం ఇచ్చింది. దీనిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు, కరపత్రాలు, ర్యాలీలు, చిత్రలేఖనం పోటీలు, పరుగుపందెం పోటీలు, మొబైల్, ఈవీఎంలు, వీవీప్యాట్స్ ద్వారా ఉద్యమంలా ప్రచారం నిర్వహించింది. గత నెలలో 24, 25వ తేదీల్లో, ఈ నెల 3, 4వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. దీంతో పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముగించారు.
తుది ఓటరు జాబితాపై కసరత్తు..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఓటరు నమోదు మార్పులు, చేర్పుల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో తుది ఓటరు జాబితాను వచ్చే నెల 4న ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే కలెక్టర్ వరుణ్రెడ్డి నేతృత్వంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో ఫాం నం.6, 7, 8 దరఖాస్తులను పరిశీలించారు. అందులో అభ్యంతరాలుంటే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి జాబితా నుంచి తొలగిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం ఓటరు నమోదుకు 30,553 దరఖాస్తులు రాగా.. ఓటరు జాబితాలో అనర్హులైన వారు 9,283 మంది, జాబితాలో పేర్లు లేని, మార్పులు, చేర్పులకు తదితర దరఖాస్తులు 15,420 వచ్చాయి. దీంతో వీటిని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చర్చించి అనర్హుల ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు అందిస్తున్నారు. అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 28వ తేదీలోపు పూర్తి చేసి ఎలాంటి అభ్యంతరాలు లేని పేర్లను ఓటరు జాబితాలో పొందుపర్చి వచ్చే నెల 4న తుది జాబితాను ప్రకటించేందుకు అవకాశం ఉందని రెవెన్యూశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో అన్ని మండలాల్లో ఈ కసరత్తు ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నారు.
పకడ్బందీగా ప్రచురిస్తాం..
నిర్మల్ జిల్లాలో సమగ్ర ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 4న ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పాత ఓటర్లతో పాటు కొత్త వారి చేరిక, మార్పులు, చేర్పులు, తప్పొప్పులు వచ్చిన దరఖాస్తులు మొత్తం 55,226 వచ్చాయి. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రాజకీయ పార్టీల సమక్షంలో ఎలాంటి అభ్యంతరాలు లేని ఓటరు జాబితాను రూపొందిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం ద్వారా కొత్త ఓటర్ల చేరికపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో జిల్లాలో 30వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.
– కిశోర్కుమార్, అదనపు కలెక్టర్, నిర్మల్