‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి వల్లే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ను హైదరాబాద్లో కాకుండా ఈసారి రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.” అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ను సోమవారం మంత్రులు ప్రారంభించారు. అనంతరం సోన్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బాల శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారని.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలను ఎమ్మెల్యేలతో కలిసి తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్సీసీ వందన స్వీకారం ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలతోపాటు గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
నిర్మల్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి మేరకే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిర్మల్లోని సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ను సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 280 మంది ఇన్స్పైర్ విజేతలతోపాటు గైడ్ టీచర్లు ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. సీఎం కృషి వల్లనే ప్రస్తుతం కార్పొరేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ బడులు పోటీ పడుతుండడం అందరికీ గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ‘మన ఊరు-మన బడి’ పథకం మన తెలంగాణలో అమలవుతున్నదన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నీ పూర్వ వైభవం సంతరించుకోనున్నాయన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతోపాటు మెరుగైన విద్యనందించేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ను ఎప్పటి మాదిరిగా హైదరాబాద్లో కాకుండా ఈసారి రూరల్ ఏరియాలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారన్నారు. సీఎం సూచన మేరకే ఈసారి నిర్మల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన బాల శాస్త్రవేత్తలు తమ తమ జిల్లాల్లో మంచి ప్రదర్శనలు ఇచ్చి గెలుపొందిన వారేనన్నారు. మీరందరూ కొత్త ఆలోచనలకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాలని విద్యార్థులకు సూచించారు.
మొట్ట మొదటి సారిగా రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి భోజన సదుపాయంతోపాటు వసతి, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ నెల 11 వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కే.విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన, ఎస్సీఈఆర్టీ సంచాలకులు రాధారెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఈవో రవీందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఏఎంసీ రమణ, కొండాపూర్ సర్పంచ్ గంగాధర్, డీఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.