మంచిర్యాలటౌన్, మార్చి 13: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తాగా పేరు మార్చుతూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. దీంతో పాటు ఇక్కడున్న విగ్రహం స్థానంలో మరింత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, జంక్షన్లో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతమున్న కూరగాయల మార్కెట్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు కేటాయించిన నిధులతో బహుళ అంతస్థుల్లో మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. పట్టణంలోని లక్ష్మీ టాకీసు చౌరస్తా నుంచి రైల్వే లైను మీదుగా గోపాల్వాడ, సున్నంబట్టి వాడ వరకు ఉన్న 100 ఫీట్ల రోడ్డును ఆర్అండ్బీకి అప్పగించి రోడ్డు, ఫ్లైవర్ నిర్మాణాన్ని చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
ఇంజినీరింగ్ విభాగంలో అభివృద్ధి పనులకు రూ. 6 కోట్లు, పారిశుధ్య విభాగం, వాహనాల రిపేర్లు, జీతభత్యాలు, ఇతర కొనుగోళ్లకు రూ. 70 లక్షలు, పరిపాలనా విభాగంలో సిబ్బంది జీతభత్యాలకు రూ. 1.35 కోట్లు చెల్లించేందుకు కౌన్సిల్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గోదావరి దగ్గరలో ఉన్న మాతా శిశు దవాఖాన ఐబీ చౌరస్తాలో ఉన్న ఆర్అండ్ బీ స్థలంలోకి మార్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ సల్ల మహేశ్, కమిషనర్ మారుతీప్రసాద్, మేనేజర్ విజయ్కుమార్, మున్సిపల్ ఇంజినీర్ మధుకర్, ఆర్వో శ్రీనివాస్రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సునీల్రాథోడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.