బాసర, జూలై 9 : ఆర్జీయూకేటీ బాసరలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూడో రోజు ఆదివారం 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 66 మంది గైర్హాజరవగా, 338 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మూడో రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పాస్తం శివానికి డైరెక్టర్ సతీశ్ కుమార్ ప్రవేశ పత్రం అందజేసి కౌన్సెలింగ్ను ప్రారంభించారు.
మొత్తంగా 1404 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా, 1251 మంది విద్యార్థులు హాజరైనట్లు డైరెక్టర్ వివరించారు. ఇందులో 153 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. భర్తీ కాని సీట్ల కోసం రెండో విడుత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో కో-ఆర్డినేటర్ డాక్టర్ పావని, డాక్టర్ దత్తు, సభ్యులు ప్రకాశ్, తిరుపతి రావు, అడ్మిషన్స్ కమిటీ సభ్యులు హరికృష్ణ, సునిత, కృష్ణ, సంతోష్రెడ్డి, ఆధ్యాపకులు ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.