ఆదిలాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల బంగారుగూడ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లు నిరుపయోగంగా మారాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆగస్టు 17, 2021లో పారిశుధ్య నిర్వహణతోపాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి రూ.2.56 కోట్లతో ఎఫ్ఎస్టీపీని నిర్మించారు.
మలం ద్వారా ఎరువును తయారు చేయడానికి ఎఫ్ఎస్టీపీ ఉయోగపడుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తమ ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులు నిండిపోతే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీ తరలిస్తారు. ఇక్కడ తయారైన ఎరువులను హరితహారంలో నాటిన మొక్కలకు ఉపయోగిస్తారు.
డంపింగ్యార్డులో రూ.82 లక్షలతో ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుక్కల బెడదను నివారించడంతోపాటు వాటి సంతానం నివారణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. గతంలో పట్టణంలోని వీధి కుక్కలను మున్సిపాలిటీ సిబ్బంది బోనుల ద్వారా ఈ కేంద్రానికి తీసుకొచ్చే వారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ టీకాలు వేసి కొన్ని రోజులపాటు రక్షించి తిరిగి వీధుల్లో వదిలేసేవారు.
ఈ కేంద్రం పనిచేయడం లేదు. డంపింగ్ యార్డులో ఎనిమల్ కేర్ సెంటర్, ఎఫ్ఎస్టీపీలు నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. దీంతో రూ.3.38 కోట్లతో నిర్మించిన రెండు కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇందులోని యంత్రాలు పనికిరాకుండా పోయాయి. పట్టణంలోని పారిశుధ్య నివారణతోపాటు వాతావరణ కాలుష్యం, కుక్కల బెడద నివారించడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలు పనికిరాకుండా పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.