మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 19 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జంక్షన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తాల వద్ద నిర్మాణ పనులను రూ.4 కోట్లు పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారు. నమూనాలు, డీపీఆర్లు, పరిపాలనా అనుమతులు మంజూరై టెండర్లు కూడా పూర్తవగా.. పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో జంక్షన్ డెవలప్మెంట్కు రూ.ఒక కోటి చొప్పున రూ.4 కోట్లు కేటాయించారు. ప్రతి జంక్షన్ను పెద్ద వృత్తాకారంలో రోడ్డు మధ్యలో ఐలాండ్తో సుందరంగా నిర్మిస్తున్నారు. ఇందులో గ్రీనరీ, శిల్పాలు, లైటింగ్, పౌంటేయిన్ ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు.
పట్టణానికి వన్నె తెచ్చేలా తయారు చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్తో సంబంధం లేకుండా వాహనాలు వెళ్లేలా ఐలాండ్స్ను రూపొందిస్తున్నారు. జంక్షన్లతోపాటు ఐబీ చౌరస్తా నుంచి ఎంసీసీ వరకు సెంట్రల్ మీడియన్తో డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పడిన తరువాత పట్టణంలోని రహదారులను విస్తరించడం, జంక్షన్లను అభివృద్ధి చేయడం, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను సులభతరం చేయడం వంటి చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే దివాకర్రావు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో కలిసి పలుమార్లు చర్చించారు. మున్సిపల్, ఆర్అండ్బీ, ఇతర శాఖల అధికారులతో పట్టణాభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేసి పనులు చేపడుతున్నారు.