నిర్మల్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నది. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. పనులు ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. బ్లాకులవారీగా పూల మొక్కలు నాటించి, పచ్చదనం కనిపించేలా ముస్తాబు చేశారు.
కలెక్టరేట్ భవన నిర్మాణానికి సుమారు 16 ఎకరాలు కేటాయించారు. ఇందులో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ విధానంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల చాంబర్లతోపాటు రెండు వేయిటింగ్ హాల్స్, రెండు వీడియోకాన్ఫరెన్స్ హాళ్లు, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశాన్ని నిర్వహించే విధంగా సువిశాలమైన కాన్ఫరెన్స్ హాల్ను కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించారు. మొదటి అంతస్తులో మంత్రి చాంబర్తోపాటు వివిధ శాఖలకు, రెండో అంతస్తులో మిగతా అన్ని శాఖల కోసం అవసరమైన నిర్మాణాలు చేపట్టారు.
ప్రస్తుత కలెక్టరేట్ను పూర్తి ఆక్సిజన్ జోన్గా మార్చేందుకు అనుకూలమైన రీతిలో నిర్మాణం చేపట్టారు. ఎకో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్(పర్యావరణహిత పరిపాలనా కేంద్రం) మాడల్గా గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత భవన సముదాయం మధ్యలో దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన గ్రీనరీ ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనున్నది. ప్రకృతి పరంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయం అధికారులతోపాటు సామాన్య ప్రజానీకాన్ని కూడా కనువిందు చేయనుంది.
భవన నిర్మాణాలు పూర్తయ్యాయని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. మూడు అంతస్తుల్లో చేపట్టిన భవనం కార్పొరేటు ఆఫీసును మరిపించేలా ముస్తాబైంది. అత్యాధునిక టెక్నాలజీతో రెండు లిఫ్టులు నిర్మించిన చోట గ్రానైట్ పనులు పూర్తికావడంతో సువిశాలమైన కారిడార్లు కనువిందు చేస్తున్నాయి. ప్రహరీతోపాటు ముఖద్వార ఆర్చి, సెక్యూరిటీ గార్డు గది నిర్మాణం పూర్తయింది. అండర్ గ్రౌండ్లో 80 వేల లీటర్ల సామర్థ్యంతో సంప్, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. కలెక్టరేట్ ఎదుట ఆవరణలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సముదాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించేందుకు సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు.