సహస్ర శీర్షం దేవం
విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవం
అక్షరం పరమం పదం ..
అంటూ ఆలయంలో పూజారి.. భక్తులకు పుష్పాన్ని ఇచ్చి వేదాంతర్గతమైన మంత్రపుష్పం చదివి తీసుకొని గర్భగుడిలోని దైవానికి తిరిగి సమర్పిస్తారు. దీంతో భగవంతుడి ఆశీస్సులు మన వెంటే ఉంటాయని వేదం చెబుతున్నది. నారాయణుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనేది ఆ వేద మంత్ర తాత్పర్యం. వైదిక ధర్మ శాఖలలో ఒకటైన శ్రీ వైష్ణవంలో ఆళ్వారులకు, ఆ ఆళ్వారులు ప్రవచించిన 108 దివ్య దేశాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటిని అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా కొలుస్తారు. వీటిని సందర్శిస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించి పుణ్యఫలం లభించినట్లేనని వైఖాసన ఆగమం చెబుతున్నది అటువంటి దివ్యదేశాలన్నింటినీ మనం ఇపుడు సమతామూర్తి కొలువై నిలిచిన శ్రీ రామానుజ క్షేత్రంలోనే దర్శనం చేసుకునేలా సహస్రాబ్ది వేడుకల్లో సాలగ్రామయుత మూర్తులను ప్రతిష్ఠస్తున్నారు. పన్నెండు మంది ఆళ్వారులు కూడా ఇక్కడే కొలువు దీరనున్నారు.
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్ ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని శ్రీ చినజీయర్స్వామి అన్నారు. సహస్రాబ్ది మూడవరోజు పూజా కార్యక్రమాల్లో ఆయన యాగశాలలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరేళ్లపాటు నిర్విరామంగా శ్రమించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల కట్టడాలను, ప్రతిష్ఠలను, శాస్ర్తోదికాలను పరిశీలించిన తర్వాత శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో 108 దివ్యదేశాలను ప్రతిష్ఠించుకోవడం ఇక్కడ ప్రజల పుణ్యఫలంగా ఆయన అభివర్ణించారు. దక్షిణభారతంలోనే ముచ్చింతల్ ఓ గొప్ప పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక కలికితురాయిగా నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. భక్తులకు అవసరమైన మరిన్ని వసతులు సమకూర్చిన తర్వాత మనోహర దివ్యక్షేత్రమై వెలుగుతుందని చెప్పారు.
సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ను శాశ్వతంగా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్లతో కలిసి ఆయన పర్యటించారు. శ్రీరామనగరంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని ఇకపై శాశ్వతంగా శంషాబాద్ డివిజన్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శంషాబాద్లో పోలీస్ కంట్రోల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించామని ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమంలో శాశ్వతంగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావించి శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నామని సీఎస్ స్పష్టంచేశారు.
నిత్య దీపకాంతులతో వెలుగులీనుతున్న శ్రీరామనగరంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రవచనాల సీడీలు, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేదాలు, ఇతిహాసాలు, శ్రీమద్భగవద్గీత, విష్ణుపురాణం, పద్మ పురాణం, రామాయణం, భాగవతం, హరివంశపర్వము, యజుర్వేద సంహిత, మండకోపనిషత్ వంటి గ్రంథాలన్నీ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభ్యమవుతున్నాయి.
త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యలో వేదపండితులు, రుత్వికులు అత్యంత భక్తి శ్రద్ధలతో మూడోరోజైన శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. యజ్ఞ కుండలాల్లో అష్టాక్షరి జపం పఠిస్తూ యాగం చేశారు. అనంతరం యాగశాలల్లో చిన జీయర్స్వామి పర్యటించారు. జగద్గురు వాసుదేవాచార్య, స్వామి విద్యాభాస్కర్లు భక్తులకు శ్రీరామానుజాచార్యుల వైభవాన్ని వివరించారు. భద్రాచలం నుంచి వచ్చిన శ్రీమాన్ గుడిమోళ్ల మురళీకృష్ణమాచార్య, అథర్వ వేదపండితులతో కలిసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. సప్తస్వర సంగీత అకాడమి వారి ఆధ్వర్యంలో కళాకారులు ప్రజ్ఞ, మనోజ్ఞలు సంగీత ఝరితో ఆకట్టుకున్నారు. సహస్రాబ్ది సమావేశ మందిరంలో సుష్మా, సుస్మిత బృందం గానాలాపన చేశారు. పెద్దబ్రోలు భావన బృందం నృత్యప్రదర్శనలు, శ్రీమాన్ స్థలశాయి యుజుర్వేద పండితుల పుణ్యవచనాలు చేశారు. మానస భజన బృందం స్వామివారి కీర్తనలతో భక్తులను అలరింపచేశారు. రాజమహేంద్రవరం నుంచి విచ్చేసిన రఘునాథ్ భట్టర్ ప్రవచనాలను భక్తులకు వివరించారు. అనంతరం వేదపండితులతో కలిసి త్రిదండి చినజీయర్ స్వామిజీ వెంకన్న స్వామి భజన, విష్ణునామ సహస్ర పారాయణాలు, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి ప్రవచనాలు, వేదాల విశిష్టతను వివరించారు.
దివ్యక్షేత్రంలో శ్రీరామానుజాచార్య విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలను నిర్మించడానికి నిర్వాహకులు భారతదేశం మొత్తం పర్యటించారు. ప్రతి దివ్య క్షేత్రాల్లోని మూల విరాట్టులు, గర్భగుడి నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 12 వేల ఫొటోలు, 800 అధునాతన డ్రాయింగులను క్షుణ్నంగా పరిశీలించారు. దివ్యదేశాల స్తంభాల నిర్మాణం, వాటి ఆకృతి కోసం నల్లపాలరాయిని ఉపయోగించారు. రాజస్థాన్లోని బస్లాలా గ్రామం నుంచి రాయిని తీసుకొచ్చి చెక్కి దివ్య దేశాల కోసం 468 స్తంభాలను ఏర్పాటు చేశారు. కాంచీపురం వాలజ్య నుంచి రాయిని పరిశీలించి, విగ్రహాలను చెక్కడానికి ముందు దాని ధ్వనిని పరీక్షించారు. ఆళ్లగడ్డ, తిరుపతి, మహాబలిపురం, శ్రీరంగం, మధురై నుంచి అనేక మంది శిల్పులు ఇక్కడికి వచ్చి దేవాలయాలను తీర్చిదిద్దారు. లోయస్తంభాలు(చిలకలు) నల్ల పాలరాయితో చైనాలో తయారు చేయించారు.
ఆలయ నిర్మాణానికి ముందు చినజీయర్ స్వామి వేర్వేరు శిల్పులతో కొన్ని వందల నమూనాలను పరిశీలించారు. 3 నెలల పాటు నిర్విరామంగా డిజైన్లు ఖరారు చేసే పనిలో తలమునకలయ్యారు. ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం నియమాలను అనుసరించి త్రీడీ నమూనాలను పరిశీలించారు. మూర్తుల ముఖంలో ఆహ్లాదం, కళ్లల్లో దయ స్పష్టంగా కొట్టొచ్చేలా, విగ్రహాల నఖలు(గోర్లు) కూడా అత్యంత సహజంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ మూర్తిని చూసినా దివ్యత్వం ప్రతిబింబించేలా శ్రద్ధ కనబరిచారు.అలాగే రామానుజాచార్యుల ధ్యాన భంగిమ నిర్మాణంలో కూడా చోళ, చాళుక్య, విజయనగర వాస్తు శిల్ప సూత్రాలను అనుసరించారు. 3 దశల్లో ఉండే 54 అడుగుల ఎైత్తెన భద్రవేది పీఠంలో మొదటి దశ చతురస్ర ఆకారంలో రెండు, మూడు దశలు అష్టభుజ ఆకృతిలో నిర్మించారు.
శ్రీ మద్రామానుజుల పవిత్ర త్రిదండాన్ని శ్రమకోర్చి తీర్చిదిద్దారు. భద్రవేది పీఠం రంగు కోసం బన్సి పహార్పూర్ పింక్ స్టోన్ బలమైన ఇసుకరాయిని ఉపయోగించారు. మౌంట్ అబూ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు దీన్ని నిర్మించారు. భద్రవేది ఎత్తు 54 అడుగులు. వృత్తాకార కమలం 27 అడుగులు. త్రిదండం మొత్తం ఎత్తు 135 అడుగులు. రామానుజ భుజంపై నుంచి ఎత్తు 27 అడుగులు. 6 టన్నుల బరువు(జల పవిత్రం).
శ్రీ వైష్ణవంలో ఆళ్వారులదీ ఆచార్యులదీ విశిష్ట స్థానం. ఆళ్వారు అనే తమిళ శబ్దానికి.. జ్ఞాన సముద్రాన మునిగి లేచిన వాడని అర్థం. మహాజ్ఞానులైన ఆళ్వారులు వైష్ణవానికి మూల స్తంభాలు. వీరి సూక్తులు మోక్షసౌధానికి నిచ్చెనలని భావిస్తారు. విశిష్టాద్వైత మత విశ్వాసాలకు బహుళ వ్యాప్తిని కల్పించిన వీరందరినీ సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి అంశ సంభూతులుగా పరిగణిస్తారు. ఈ 12మంది ఆళ్వారులకు ఒక పరంపర ఏర్పాటై ఉంది. వీరిలో కొందరు ద్వాపర యుగానికి చెందిన వారని, మరికొందరు కలియుగ ప్రారంభానికి చెందిన వారని ‘గురుపరంపరాది’ గ్రంథం పేర్కొంటున్నది. వీరందరూ శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ చేసిన కీర్తనలనే పాశురాలని, వాటి సంచయాన్ని దివ్య ప్రబంధాలని వ్యవహరిస్తారు. ఇవన్నీ శ్రీ మద్రామానుజాచార్యులకు పూర్వమే సంకలనం అయి ఉన్నాయి. 4వేల పాశురాల ఈ సంపుటంలో 108 వైష్ణవ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని ప్రస్తావించారు. వీటినే దివ్యదేశాలుగా పేర్కొంటున్నారు. వీటిలో 105 భారతదేశంలో, 1 నేపాల్లో ఉంది. మరో రెండు దైవ లోకంలో ఉంటాయని భావిస్తారు. 108 దివ్య దేశాలను సందర్శించినా..ముచ్చింతల్లో ప్రతిష్ఠించిన 108 దివ్యదేశాలను దర్శించుకున్నా అంతే పుణ్యం దక్కుతుందని చినజీయర్ స్వామి ఉద్ఘాటించారు.
యజ్ఞశాల ఎదురుగా దీర్ఘాయువు సంస్థ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇందులో గోరసం, మధుహరి, సంది శూల హరి, ఖాస హరి, ఆయుర్వర్థక, దంతపుష్టి చూర్ణం, చర్మరక్షక, గోబామ్, చర్మ వర్ధిని, మేధాఆర్క్, ధాతుపుష్టి ఆర్క్, శుద్ధ జలంతో పాటు పలు రోగాలకు అవసరమైన ఆరోగ్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
ఆయుర్వేద మొక్కల పంపిణీ విశ్వాయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆయుర్వేద మొక్కల పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ నిరంజని తెలిపారు. జాతీయ ఆయుర్వేద మొక్కల పెంపకం బోర్డుతో కలిసి భక్తులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తులసి, తిప్పతీగ, కలబంద, పాలాలము, బోడతరము, గలిజేరు, వాకుడు, కొండపిండి, గుంటగలగర, అడ్డసరము లాంటి ఆయుర్వేద మొక్కల గురించి సందర్శకులకు వివరిస్తున్నారు.
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 4: యాగశాలను, రామానుజ క్షేత్రాన్ని పారిశుధ్య సిబ్బంది రాత్రి పగలూ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎక్కడ చెత్త పడినా వెంటనే వచ్చి తీసుకొని బండిలో తీసుకుపోయి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతిరోజు రెండు విడతల్లో 500మందికి పైగా కార్మికులు సేవలందిస్తున్నారు. వేలాది మంది జనం వాడుతున్న మూత్రశాలలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.
శ్రీరామనగరంలో భక్తుల కోసం ఐసీఐసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమకు అవసరమైన డబ్బులు విత్ డ్రా చేసుకునేలా స్టాల్ ఏర్పాటు చేశామని శంషాబాద్ బ్రాంచ్ మేనేజర్ శంకర్సింగ్ తెలిపారు. భక్తుల విరాళాలు కూడా అక్కడే.. ఆశ్రమ అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించారు.
శ్రీరంగం (తమిళనాడు)
ఉరైయూర్ (తమిళనాడు)
తంజమా మణిక్కోయిల్
(తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
అన్బిల్ (బాణాపురం)
(లాల్గుడి నుండి 8 కి.మీ.)
కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
తిరువెళ్ళరై (శ్వేతగిరి)
తిరుపుళ్ళమ్ పూతంగుడి
(కుంభకోణం 10 కి.మీ.)
తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్)
(లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
తిరువళందూర్ (మాయవరం
12 కి.మీ.) (తేరళందూర్)
శిరుపులియూర్
(తమిళనాడు- కుడందై-సీర్గాళీ)
తిరుచ్చేరై (కుంభకోణం
12 కి.మీ.) (సార క్షేత్రము)
తలైచ్చంగనాణ్మదియమ్ (సీర్గాళీ)
తిరుక్కుడందై (కుంభకోణం)
తిరుక్కండియూర్ (మళప్పురం)
తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.)
(ఉప్పిలి యప్పన్ కోయిల్)
తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
తిరుక్కణ్ణపురం
(నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
తిరునాగై (నాగపట్నం)
తిరునరైయూర
(కుంభకోణం 10 కి.మీ.)
నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం
10 కి.మీ.) (నాదన్ కోయిల్)
తిరువళందూర్ (మాయావరం)
(తిరువళందూర్)
తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
కాంచీరామ విణ్ణగరమ్
(శీయాళి) (సీర్గాళి)
కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.)
(ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.)
(కృష్ణమంగళ క్షేత్రం)
కపి స్థలమ్ (తంజావూరు)
తిరువెళ్ళియంగుడి (తంజావూరు)
మణిమాడక్కోయిల్ (తిరునాగూర్)
(శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
వైకుంఠ విణ్ణగరం (కాంచీపురం)
అరిమేర విణ్ణగరం (నంగూరు)
తిరువత్తేవనార్తొగై (కీళచాలై)
వణ్పుడోత్తమర్ (సీర్గాళీ)
సెంపోన్ కోయిల్ (సీర్గాళీ)
తిరుత్తెట్రియమ్బలమ్ (సీర్గాళీ)
తిరుమణికూడం
(తిరునాంగూర్ తిరుపతి)
తిరుక్కావళంబాడి
(తిరునాంగూర్ తిరుపతి)
తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
తిరుపార్తన్ పళ్ళి (నాగపట్నం)
తిరుమాలిరుం శోలై మలై
(మధుర 20 కి.మీ.) (అళగర్ కోయిల్)
తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
తిరుపుల్లాణి (రామనాథపురం
10 కి.మీ.) (దర్భ శయనం)
తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్)
(శివకాశి 3 కి.మీ.)
తిరుమోగూర్ (మర 10 కి.మీ.)
(మోహనపురము)
తెన్ మధురై (మదురై) (తిరుక్కూడల్)
శ్రీవిల్లి పుత్తూరు
తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
తిరుత్తొల విల్లి మంగలమ్
(ఇరిట్టై తిరుప్పతి)
శిరీవరమంగై (నాంగునేరి)
(వానమామలై)
తిరుపుళ్ళింగుడి
తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
శ్రీ వైకుంఠము
తిరువరగుణమంగై (నత్తం)
తిరుక్కుళందై (తెన్ కుళన్దై)
(పెరుంకుళమ్)
తిరుక్కురుంగుడి
తిరుక్కోళూరు
తిరువనంతపురమ్
తిరువణ్ పరిశారమ్
తిరుక్కాట్కరై
తిరుమూళక్కళమ్
తిరుప్పులియూర్ (కుట్టనాడు)
తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
తిరునావాయ్
శ్రీవల్లభక్షేత్రం (తిరువల్లాయ్)
(శ్రీవల్లభక్షేత్రం)
తిరువణ్ వండూరు
తిరువాట్టార్
తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
తిరుక్కడిత్తానమ్
తిరువాఱన్ విళై (ఆరుముళై)
తిరువయిందిర పురమ్
తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
అష్ట భుజమ్ (కంచి)
తిరుత్తణ్ గా (కంచి)
తిరువేళుక్కై (కంచి)
తిరుప్పాడగమ్ (కంచి)
తిరునీరగమ్ (కంచి)
నిలాత్తింగళ్ తుండత్తాన్ (కంచి)
ఊఱగమ్ (కంచి)
తిరువెంకా (కంచి)
తిరుక్కారగమ్ (కంచి)
తిరుకార్వానమ్ (కంచి)
తిరుక్కళ్వనూర్ (కంచి)
పవళవణ్ణమ్ (కంచి)
పరమేశ్వర విణ్ణగరమ్ (కంచి)
తిరుప్పుళ్ కుళి (కంచి)
తిరునిన్ఱవూర్
తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
తిరువిడవెన్దై
తిరుక్కడల్మలై (మహాబలిపురం)
తిరువల్లిక్కేణి (చెన్నై)
తిరుక్కడిగై (చోళసింహపురము)
తిరువేంగడమ్ (తిరుమలై – తిరుపతి)
శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
తిరువయ్యో
నైమిశారణ్యం
శాళక్కిణామం (సాలగ్రామమ్)
బదరికాశ్రమం (బదరీనాథ్)
కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
తిరుప్పిరిది (నందప్రయాగ)
(జోషిమఠ్)
వడమధురై (ఉత్తరమధుర)
శ్రీ ద్వారక
తిరువాయిప్పాడి (గోకులము)
తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
పరమపదమ్ (తిరునాడు)