తెలంగాణ ఆడబిడ్డ, భారత జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కను బీజేపీ టార్గెట్ చేసింది. ఉద్యమ నాయకుడు, పరిపాలనదక్షత కలిగిన కేసీఆర్ను ఢీకొనే సత్తాలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో అధికారికంగా మద్యం పాలసీని మార్చుకుంటే కవితక్కకు సంబంధమేంటని యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు రాజకీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఈ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండి పడుతున్నారు. విపక్షాల నాయకులపై దాడులు చేయించడం, వారు పార్టీలో చేరగానే కేసులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. కవితక్కను ఏం చేయలేరు. మచ్చలేని నాయకురాలిగా.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. కాగా.. ఏ నాటికైనా కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతిలో కీలకంగా వ్యవహరించిన పలువురు తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
– నిర్మల్(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, మార్చి 21
ఎన్ని కుట్రలు చేసినా.. ఏం చేయలేరు..
విచారణ పేరిట ఎన్ని ఇబ్బం దులు పెట్టినా తెలంగాణ బతుకమ్మ కవితక్కను ఏం చేయలేరు. ఆమె నిర్దోషి అని చెబుతున్నా.. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేకున్నా అనుమానం పేరిట రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినా తెలంగాణలో బీజేపీ ఏం చేయలేదు. దేశంలోనూ బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు. దమ్ముంటే కవిత చేసిన తప్పు ఏందో స్పష్టంగా చెప్పాలి. గతంలో ఈడీ కేసులు ఎదుర్కొన్న ఎంతో మంది నాయకులు బీజేపీలో చేరగానే ఆ కేసులు ఎత్తేశారు. అప్పటి వరకు విచారణ పేరిట వేధించి నోళ్లు, కాషాయ కండువా కప్పుకోగానే తప్పులన్నీ ఒప్పులయ్యాయా. కవితక్కను ఉద్యమం నుంచి చూస్తున్నాం. ప్రజాక్షేత్రంలో పోరాటం తప్ప, ప్రజలను మోసం చేయడం తెలియదు. తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ ఛేదించి ఆమె కడిగిన ముత్యంలా బయటకొస్తారు.
– లింగంపల్లి ప్రేమ్రావు, భారత జాగృతి అధ్యక్షుడు, మంచిర్యాల
తప్పు చేయకున్నా ఈడీ విచారణ పేరిట సహనానికి పరీక్ష
ఎక్కడో ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా మద్యం పాలసీని మార్చుకుంటే.. దానిలోకి తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితను లాగడం ఏంటి..? ఏ తప్పు చేయకున్నా విచారణ పేరిట ఈడీ రాద్ధాంతం చేయడం ఏంటి..? అద్భుతమైన పాలనా దక్షతతో తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి రావడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక.. కేసీఆర్ను ఢీకొట్టే సత్తా లేక రాజకీయ కుట్రలతో కవితను టార్గెట్ చేస్తున్నదని యావత్ తెలంగాణ సమాజం మండి పడుతున్నది.
విచారణ పేరిట పిలిచి గంటల తరబడి ప్రశ్నిస్తూ, మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న ఈడీ.. దానికి ముందు కవితక్క అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమానితురాలు అని చెబుతూ ఇన్ని సార్లు పిలిచి ప్రశ్నించడం వెనుక అరెస్టు చేయాలనే కుట్ర దాగి ఉందని, అదే జరిగితే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కవితపై ఈడీ వ్యవహార శైలిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితతో ఉద్యమంలో కదం తొక్కిన, తెలంగాణ జాగృతిలో కీలకంగా వ్యవహరించిన పలువురు కవితను ఈడీ ప్రశ్నించడంపై తమ అభిప్రాయాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
– నిర్మల్(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, మార్చి 21
మహిళను టార్గెట్ చేయడం సిగ్గుచేటు..
బీజేపీ నాయకులు మహిళా అని చూడకుండా టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటు. ప్రశ్నించే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులకు పాల్పడడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఎన్ని అక్రమాలు చేసినా.. బీజేపీలో చేరితే వారిపై చర్యలు ఉండవు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టడం.. జాతీయ స్థాయిలో మంచి స్పందన వస్తుండడంతో దాడులు జరుగుతున్నాయి. ఎందరు ఎన్ని కుట్రలు పన్నినా.. కవితక్క నూటికి నూరు శాతం నిర్ధోషి అని తేలుతుంది.
– తుమ్మనపెల్లి లక్ష్మణాచారి, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు,నిర్మల్.
విచారణ పేరిట వేధించడం సరికాదు..
ఇన్ని రోజులు బీజేపీ అంటే ప్రజల్లో గౌరవం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. చెప్పిన మాట వినకుంటే కేసులు పెట్టడం, విచారణ పేరిట వేధించడం బీజేపీకి అలవాటైపోయింది. ఇది కరెక్టు కాదు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా లేని బీజేపీ నాయకులు.. కవితపై అక్రమంగా కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు. కేవలం మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయడం తప్పా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి జరుగలేదు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నయ్. పేద, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– కాలేవార్ రాంబాబు, నిర్మల్.
ముమ్మాటికీ కక్ష సాధింపే..
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఈడీపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నది. బీజేపీ విధానాలు మార్చుకోకపోతే.. ప్రజలే భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారు.
– ఎండీ అహ్మద్, ఆసిఫాబాద్.
విచారణ పేరిట వేధిస్తున్నరు..
దేశంలో బీజేపీ అరాచక పాలన కొనసాగు తోంది. కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో మోదీ, అమిత్ షాల్లో భయం మొదలైంది. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ రాకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ కేంద్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. విచారణ పేరిట లికర్ స్కాం లో కవితక్కను ఇరికించి మానసికంగా దెబ్బతీయడం సరికాదు. మహిళ అని చూడకుండా విచారణ పేరిట హింసించడం హేయమైన చర్య.
– సాయి శ్రవణ్, ఆసిఫాబాద్.
బీఆర్ఎస్ను ఎదుర్కొలేకే..
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేకే ఈడీ విచారణ పేరిట సీఎం కేసీఆర్ కూతురును వేధి స్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. లిక్కర్ స్కామ్కు జాగృతి అధ్యక్షురాలికి ఎలాంటి సంబం ధం లేదు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ఇందులో ఏ మార్పు ఉండదు. ఈ విషయం ఇప్పటికే ఈడీకి అర్థమైంది. అందుకే విచారణ పేరిట రాజకీయ ఒత్తిడి పెంచేందు కు కుట్ర చేస్తున్నది. అసలు కవితక్క అడిగే ప్రశ్నలకు ముందు ఈడీ సమాధానం చెప్పాలని యావత్ తెలంగాణ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నా. అధికార మదం, కుట్రలతో ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయపరంగా కవితను ఏం చేయలేరు.
– అక్కల తిరుపతివర్మ, భారత జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు.
మచ్చలేని నాయకురాలు
ఎదులాపురం, మార్చి 21 : దేశంలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. మహిళ నాయకులకు కూడా కనీసం గౌరవించకుండా విచారణ పేరిట వేధింపులకు గుర్తి చేస్తున్నది. ప్రజాసేవే లక్ష్యంగా మచ్చలేని నాయకురాలిగా ఉన్న కవితను ఈడీ విచారణ పేరిట వేధించడం అన్యాయం. కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలి.
– బి. అనసూయ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షురాలు
బీజేపీ తగిన బుద్ధి చెబుతారు..
ప్రతిపక్ష నాయకులపై ఈడీ పేరిట విచారణ చేస్తూ వేధింపులకు గుర్తి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారు. మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. మేధావులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను గమనిస్తున్నారు. సరైన సమయంలో మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
– కస్తాల ప్రేమల, మాజీ ఐసీడీఎస్ ఆర్గనైజర్