దస్తురాబాద్, డిసెంబర్ 18 : అన్నదాతలు యాసంగి సాగులో బిజీబిజీగా గడుపుతున్నారు. నార్లు పోసుకొని, పొలాలను దున్నుకొని సిద్ధం చేస్తున్నారు. యాసంగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నార్లు అలకడం, దుక్కులు దున్నడం వంటి పనుల్లో తీరికలేకుండా ఉంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవత్రతో నారుమడులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినా, చలి తీవ్రత ఎక్కువైనా నారు పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మడుల్లో నారు ఎదకపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వరి నారు పెరుగక ఎర్రబడి ఎండిపోయే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకుంటేనే నారు ఎదుగుతుంది. అధిక దిగుబడి సాధించవచ్చు. నారుమడి ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
యాసంగి సాగులో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని స్వల్ప కాలిక రకాలైన (120-130 రోజుల పంట కాలం) కూనారం సన్నాలు (కేఎన్ఎం-118), బతుకమ్మ (జేజీఎల్-18047), ఎంటీయూ-1010 (కాటర్దొర సన్నాలు), ఐఆర్-64, భద్రకాళి(డబ్ల్యూ జీఎల్-3962), తెల్ల హంస వంటి రకాల విత్తనాలను ఎంచుకోవాలి. వీటి సాగుతో మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
యాసంగిలో నారుమడికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మడిని 10-15 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. నారుమడిలో సేంద్రియ ఎరువులైన కోళ్లు, గొర్రెల మలం, వర్మీ కంపోస్టు ఎరువును రెండు గుంటల నారుమడికి 2 క్వింటాళ్లు వేసుకొని కలియదున్నుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడడంతో వాతావరణంలో నారు త్వరగా ఎదుగుతుంది. రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని (ఒక కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో వి త్తనం 12-14 రోజులకు), 2 కిలోల భాస్వరాన్ని రెట్టిం పు మోతాదులో, కిలో పొటాష్ను వేసుకోవాలి.
వరి నారుపైన చలి ప్రభావం పడకుండా రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో నారు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మంచు ప్రభావంతో నారు చనిపోయే ప్రమాదం ఉన్నది. నారుమడిపై పాలిథిన్ కవర్ను కప్పి ఉంచాలి. నారు ఎదగకపోవడంతో పాటు తెగుళ్లు, నారు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఎప్పటికప్పుడు నీటిని మార్చుతూ ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి నారుమడులను కాపాడుకోవాలి.
– జాడి తిరుపతి, ఏఈవో, దస్తురాబాద్ క్లస్టర్