ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలుచేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, వృద్ధులకు పింఛన్లు, అనేక రకాల సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. ధ్యాన గురువు పూలాజీ బాబా ఆశీస్సులతో పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు. సొంత స్థలం ఉంటే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసే పథకం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు స్వరూపారాణి, మమత తదితరులు పాల్గొన్నారు.