ఆదిలాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 2019 సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 468 పంచాయతీలకు మూడు విడుతలుగా నిర్వహించారు. సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుండగా.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనున్నది. ఈ మేరకు జిల్లా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా రు. ప్రత్యేక అధికారులను నియమించడానికి వివరాల ను సేకరిస్తున్నారు. పంచాయతీ పాలకుల పదవీకాలన్నీ పొడిగిస్తూ.. పర్సన్ ఇన్చార్జిలుగా అవకాశం ఇవ్వాలని సర్పంచ్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం కనిపించలేదు.
అభివృద్ధి పథంలో పల్లెలు
కేసీఆర్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. పదేండ్లపాటు పంచాయతీల్లో ఒకే రిజర్వేషన్ అమలు చేస్తే పల్లెలు ప్రగతి సాధిస్తాయని సూచించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకుపోయాయి. గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసింది. క్రమంగా నిధులు మంజూరు చేయడంతోపాటు ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు. విద్య, వైద్యం, రవాణ, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను మంజూరు చేసింది. పల్లెల్లో రోడ్లు, మురికికాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సిగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, పంచాయతీ భవనాలు, రైతు వేదికల నిర్మాణాలు చేపట్టింది. ఫలితంగా పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేక అధికారులు వీరే..
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, పశు వైద్యాధికారులు, వివిధ శాఖల్లో పనిచేసే ఇంజినీర్లు, ఐసీడీఎస్, హెల్త్ సూపర్వైజర్లు, హార్టికల్చర్ ఏవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు.