కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేస్తున్నారు. కవులు, కళాకారులకు సముచితస్థానం కల్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆడిపాడిన కళాకారులకు స్వరాష్ట్రంలో ఉద్యోగాలిచ్చి గౌరవించారు. సమాజంలో ఉన్నతంగా బతికేలా అవకాశం కల్పించారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించారు. తెలంగాణ, భాషా దినోత్సవాలు, సమైక్య వారోత్సవాలతోపాటు వివిధ సందర్భాల్లో సత్కరించి, పారితోషికాలు కూడా అందించారు. ప్రశంసాపత్రాలు ఇచ్చి గౌరవించారు. కళలపై మక్కువతో కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలను కవులు, కళాకారులు హర్షిస్తున్నారు. తెలంగాణతోపాటు దేశంలోని ప్రముఖ కవులు, కళాకారుల సేవలకు సముచిత స్థానం దక్కాలంటే మంచి విజన్ ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారు కోరుతున్నారు. వస్తే దేశవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు వస్తుందని వారు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ కోసం పనిచేయడానికి సిద్ధం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కళలకు పుట్టినిల్లు తెలంగాణ. కళలను నమ్ముకొని జీవించే వారికి సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. తెలంగాణ రాకముందు తెలంగాణ సంస్కృతిని, కళాకారులను సమైక్యపాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలను ప్రోత్సహించిన సీఎం కేసీఆర్ కళాకారులకూ ప్రత్యేక గుర్తింపునిచ్చారు. తెలంగాణ కళాకారుల కోసం ప్రత్యేకంగా సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఉపాధికి భరోసానిచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది కళాకారులు ఉన్నారు. వీరందరికీ న్యాయం జరుగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ కళాకారులు సీఎం కేసీఆర్ కోసం దేశ వ్యాప్తంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కళలను నమ్ముకొని జీవించే కళాకారులకు సీఎం కేసీఆర్ అండ ఎంతో అవసరం. – పవార్ మోహన్ నాయక్, జానపద కళాకారుడు, జైనూర్
కేసీఆర్ గొప్ప సాహితీ వేత్త
లక్షెట్టిపేట, సెప్టెంబర్ 21 : కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆయన గొప్ప సాహితీ వేత్త కూడా. మన రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన మహనీయుడు. కవులు, కళాకారులు, రచయితలు, సాహితీ వేత్తలకు తగినంత ప్రోత్సాహం అందిస్తున్న గొప్ప వ్యక్తి. తెలుగు సాహితీ వైతాలికులైన ప్రజాకవి కాళోజీ నారాయణరావు, దాసరథి కృష్ణమాచార్యుల పేరిట అవార్డులను నెలకొల్పి సాహితీ రంగంలో ఎనలేని కృషి చేస్తున్న ప్రముఖ సాహితీవేత్తలకు యేటా బిరుదులు అందిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కవులు, కళాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానాలు చేస్తున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతున్న గొప్ప దార్శనికుడు. నీళ్లు, నిధులు, నియామకాలు సబ్బండ వర్గాలకు అందించేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న మహనీయుడు కేసీఆర్. ఇలాంటి గొప్ప వ్యక్తి దక్షణాది నుంచి జాతీయ రాజకీయాల్లోకి వస్తే భారతీయ సాహిత్య వికాసానికి దోహద పడుతారు.
– గోపగాని రవీందర్, కవి, రచయిత. సాహితీ స్రవంతి అధ్యక్షుడు, లక్షెట్టిపేట
కేసీఆర్ ప్రధాని అయితేనే..
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమంలో కళాకారులు చేసిన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ఉపాధి కల్పించి భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారులకు గుర్తింపు రావాలన్నా, ఉపాధి దొరకాలన్నా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశంలోని కళాకారులందరికీ న్యాయం జరుగాలంటే సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి. కళాకారుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్తోనే దేశంలో ఉన్న కళాకారులందరికీ మేలు జరుగుతుంది. మారుమూల పల్లెల్లో కనుమరుగవుతున్న కళలకు జీవం పోసేది సీఎం కేసీఆర్ మాత్రమే. కళలు బతుకాలంటే సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలి. – గోలేటి మారుతి, కళాకారుడు, అగర్గూడ, పెంచికల్పేట్ మండలం
సాహితీ సంపద సుసంపన్నం అవుతుంది..
ఎదులాపురం, సెప్టెంబర్ 21 : స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జానపద కళలకు గుర్తింపునిచ్చారు. కవులు, కళాకారులు, రచయితలకు సముచిత గౌరవం కల్పించారు. ప్రపంచ మహాసభలు, జాతీయ వజ్రోత్సవాలు ఇలా అనేక కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ప్రశంసాపత్రాలు అందించారు. ఇటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కళలకు బాగా గుర్తింపు వస్తుంది. కళాకారులు బాగు పడుతారు. సాహితీ సంపద సుసంపన్నం అవుతుంది.
– కబీర్దాస్, తెలంగాణ సంగీత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, ఆదిలాబాద్.
స్వేచ్ఛా భారతం కోసం
కన్నెపల్లి, సెప్టెంబర్ 21 : కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ వస్తున్నది. రాబోయే తరాల వారికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నది. ప్రత్యక్షంగా, పరోక్షంగా విపరీతంగా పెరిగిన ధరలకు కారణమైంది. మతాల మధ్య చిచ్చు పెట్టే కుహానా రాజకీయాలకు తెరలేపింది. ఇవన్నీ సీఎం కేసీఆర్ విజన్కు వ్యతిరేకమైనవి. సీఎం కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి ప్రధాని అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని గౌరవించే సీఎం కేసీఆర్ కింది వర్గాల వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశముంది. దేశ ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించే ఏర్పాట్లు చేస్తారని సీఎం కేసీఆర్ నైజం తెలిసిన వారందరికీ ఈ విషయం తెలుసు.
– తోకల రాజేశం, ఉపాధ్యాయుడు, కవి, రచయిత