మంచిర్యాల, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయనిది.. సువిశాల భారతదేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం అమలు చేయనిది.. కరోనా కల్లోలంలో కాసుల కోసం కర్షకులు నేలవంక చూస్తున్న టైంలో భరోసా ఇచ్చింది.. వ్యవసాయాన్ని స్వర్ణయుగంగా మార్చి రైతన్నలను రాజుగా మార్చింది..! అదే అదే.. రైతుబాంధవుడు కేసీఆర్ మదిలో మెదిలిన వ్యవసాయానికి అందించే పెట్టుబడి సాయం పథకం రైతుబంధు.. ఈ వినూత్న, విప్లవాత్మక, మహత్తర స్కీం కర్షకలోకాన్ని ఆత్మహత్యల నుంచి ఆత్మైస్థెర్యం వైపు నడిపించింది. కాగా.. ఇప్పటివరకు తొమ్మిది విడుతలుగా అన్నదాతలకు సాయం అందగా.. నేటి(బుధవారం) నుంచి పదో దఫాగా రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి తెలంగాణ సర్కారు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. ఫలితంగా రైతన్న మోములో ఆనందం వెల్లివిరుస్తుండగా.. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది..
ఒకప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటే తెలిసిన షావుకారి దగ్గరో.. ఏ వడ్డీ వ్యాపారి దగ్గరో అప్పు చేసి వ్యవసాయం చేసేవారు. పండిన పంటంతా ఆ షావుకారికే అమ్మాలనే షరతు విధించేవారు. ఇంట్లకు అవసరమయ్యే సరుకులు అన్ని ఆ షావుకారి వద్దే ఉద్దెర రూపంలో తప్పకుండా తీసుకోవాల్సి వచ్చేది. నిరుద్యోగులైన రైతులు సామాను తీసుకచ్చుకోవడమే తెలుసు కానీ.. దుకాణాదారులు ఇష్టమచ్చినట్లు ధరలు రాసి చివరకు వడ్లు అమ్మిన డబ్బులు అన్ని తీసుకునే వారు. చివరకు రైతులకు ఏమి మిగిలేవి కాదు. ప్రతిసారి ఇలానే జరిగేది. వీళ్లని కాదని వేరే వాళ్లకు ధాన్యం అమ్ముకుందామనుకుంటే ఇంకో దఫా పంటకు అప్పు ఇచ్చేటోళ్లు లేకుండే. పెట్టుబడి పెట్టకుండా ఏ పంట వేయలేమనే భయంతో తప్పకుండా ఆ షావుకార్ల వద్దే అప్పు చేయాల్సి వచ్చేది.
కానీ.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ దార్శనికతతో తీసుకొచ్చిన రైతుబంధు పథకం పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదో సారి నేటి నుంచే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. ఎన్నికల కోసమే పథకాన్ని తీసుకువస్తున్నరని విమర్శించిన నోళ్లు మూతపడేలా.. పదో సారి తెలంగాణ రైతాంగం రైతుబంధు సంబురాలకు సిద్ధమవుతున్నది. గడిచిన ఐదేళ్లలో పది విడుతలుగా ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.7,607.17 కోట్లు రైతుబంధు కింద తెలంగాణ సర్కారు అందించింది. ఇందులో ఈ యాసంగికి 6,17,878 మంది రైతుల ఖాతాల్లో రూ.877.42 కోట్లు జమకానున్నాయి. ఈ నేపథ్యంలో పదో సారి రైతుబంధు అందుకుంటున్న రైతులతో మాట్లాడి ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
4.69 లక్షల మందితో మొదలై..6.17 లక్షల మందికి చేరువై..
రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక తొలి విడుతగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4.69 లక్షల మంది రైతులకు చెక్కులు అందజేశారు. అదే యేడాది యాసంగి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా రైతుబంధును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. పథకం ప్రారంభించిన రెండో యేడాది సంస్కరణల్లో భాగంగా విదేశీయులు, 18 ఏండ్ల లోపు వయసున్న వారు, 60 ఏళ్లు పైబడిన వారిని జాబితా నుంచి తొలగిపోయారు. అనంతరం వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో 2019 యాసంగి రైతుల సంఖ్య కాస్త తగ్గింది.
2020 నుంచి రైతుబంధు అందుకుంటున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తున్నది. 2022 వానకాలంలో 5.81 లక్షల మందికి రైతుబంధు ఇవ్వగా.. ప్రస్తుతం పదో దఫాలో 6.17 లక్షల మందికి ఇవ్వనున్నారు. గతంలో నాలుగు ఎకరాలు ఉండి రెండు ఎకరాలే రైతుబంధు వస్తుందని బాధపడుతున్న చాలా మందికి ఈ సారి నాలుగు ఎకరాలకు రైతుబంధు రానుంది. తల్లిదండ్రుల పేరిట ఉన్న భూమి ఇద్దరు లేదా ముగ్గురు కొడుకుల పేరిట మారడంతోనూ రైతుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈసారి చాలా మంది కొత్త వారికి రైతుబంధు రానుండటంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. కాగా.. డిసెంబర్ 20వ తేదీ వరకు కొత్తగా భూములు కొన్న రైతులు జనవరి 7వ తేదీలోపు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే.. ఈ దఫా వారికి కూడా రైతుబంధు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.7.48 లక్షలు అచ్చినయ్..
దహెగాం, డిసెంబర్ 27 : నన్ను రౌతు దుర్గమ్మ గారి రాజన్న అంటరు. నేను దహెగాం మండలంలోని కొంచపెల్లిలో ఉంట. ఎవుసం జేత్త. మా ఊళ్లనే పదిహేడెకరాల జాగుంది. యేటా పంటలు పండిస్తూ, వచ్చిన పైకంతో మా కుటుంబంతో బతుకుత. కేసీఆర్ మంచిపని జేసిండు. గతంల లాగోడికి సాన ఇబ్బంది అవుతుండే. మా బాధలు తెలిసి కేసీఆర్ సారు ఐదేండ్ల సంది పెట్టుబడికి పైసలిస్తుండు. మొదట్ల ఎకరాకు నాలుగు వేలిస్తుండే. తర్వాత సంది ఐదువేలి స్తున్నరు. ప్రతిసారి రూ.85 వేలు నా ఖాతాలో జమైత న్నయ్. తొమ్మిది దఫాలకు రూ.7.48 లక్షలు వచ్చాయ్. నాలుగైదురోజుల్లో మల్ల రూ.85 వేలు పడతాయ్. సీఎం సారును మరచిపోము.
పొలం పనులకు ముందే డబ్బులు పడుతయ్..
నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2018లో రెండు సార్లు ఎకరాకు రూ.4వేల చొప్పున రూ.16వేలు రైతుబంధు కింద పెట్టుబడి డబ్బులను చెక్కుల రూపంలో తెలంగాణ సర్కారు అందించింది. మరుసటి దఫా నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున యేడాదికి రెండు సార్లు డబ్బులు పడుతున్నాయి. పొలం పనులు ప్రారంభించే సమయంలో కరెక్ట్గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయ్. నేను మొన్ననే వడ్లు అమ్మిన. ఈ మధ్యే వరి నారు పోసిన. మరో పది రోజుల్లో నాటు వేద్దామని ట్రాక్టర్తో దున్నిస్తున్నా. ఈ లోగా రైతుబంధు డబ్బులు వస్తాయి. ట్రాక్టర్ కిరాయి, డీజిల్, లేబర్ ఖర్చులు పోనూ విత్తనాలు, ఎరువులు అన్ని రైతుబంధు డబ్బులతోనే కొంటాం. కోతల ప్పుడు మాత్రం కొంత చేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అయినా పర్లేదు. ప్రతిసారి పనులు ప్రారంభించే సమయానికి కచ్చితంగా డబ్బులు పడుతున్నా యి. రైతులకు ఇంతకు మించి ఏం కావాలి. రైతుబంధు అనేది అద్భుతమైన పథకం. నలుగురికి అన్నం పెట్టే రైతులు సీఎం కేసీఆర్ చేస్తున్న మేలును ఎప్పటికీ మరిచిపోరు.
– సాదు వీరభద్రస్వామి, దొనబండ, హాజీపూర్ మండలం.
తొమ్మిది సార్లు డబ్బులు తీసుకున్నా..
దహెగాం, డిసెంబర్ 27 : నా పేరు మోరె ఇస్తారీ. నేను దహెగాం మండలంలోని యేనెగూడలో ఉంట. ఎవుసం జేస్తూ బతుకుత. నాకు పన్నెండెకరాల వ్యవసాయ భూముంది. ప్రతి విడుతకు రూ.60వేలు వస్తయ్. మొదట్ల చెక్కులిచ్చేది. గిప్పుడైతే నా బేంక్ ఖాతాలనే ఏస్తున్నది. గిప్పటివరకైతే ఐదు లచ్చలకు పైగా పైసలు సర్కారోళ్లు ఇచ్చింన్రు. నేటి సంది మళ్ల పైసలత్తయని మా పెద్దమనుషులు చెప్పిండ్రు. అచ్చే పైకంతో ఇత్తనాలు, ఎరువులు, మందులు కొంటా. కూలోళ్లకు గూడా పనిజేత్తయ్.
బాధలైతే తప్పినయ్..
రైతుబంధుతో పంట పెట్టుబడికి అప్పు చేయాల్సిన బాధలైతే తప్పినయ్. ఎవరినీ రూపాయి అడగాల్సిన పని లేదు. పోయి అడిగినట్లే కరెక్టు పనులు ప్రారంభించే సమయానికి డబ్బులు ఖాతాల్లో పడుతాయి. అంతకుముందు భూమి నాన్న పేరిట ఉన్నప్పుడు ఆయన ఖాతాల్లో డబ్బులు పడేవి. పట్టా మార్పించాక రెండేళ్ల నుంచి నా బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. రైతుబంధు అనే కాదు. 24 గంటల ఉచిత కరెంట్ కూడా మాకు ఎంతో మేలు చేస్తున్నది. అంతకుముందు రూ.3వేల నుంచి రూ.4వేల కరంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఎంతలేదన్న రెండు ఎకరాలున్న రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఏటా రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుస్తున్నది.
– జంగ నారాయణ, ముల్కల్ల, హాజీపూర్ మండలం.
రూపాయి అప్పు లేకుండా..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 27 : నా పేరు మీద మూడెకరాల భూమి ఉంది. 2018లో రైతుబంధు కింద ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇచ్చిన్రు. 2019లో సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం రూ. 5 వేలకు పెంచిండు. రాపాయి అప్పులేకుండా యేటా రెండుసార్లు రైతుబంధు డబ్బులు తీసుకొని పంటలేసుకుంటున్న. ఖరీఫ్, రబీ సీజన్ ప్రారంభంలోనే ఖాతాల్లో డబ్బులేస్తన్రు. ఇది వరకు పెట్టుబడి కోసం సావుకార్ల దగ్గరికి పోయేటోళ్లం. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక ఆ బాధల్లేకుంట చేసిండు. ఇగ బుధవారం నుంచి మళ్లీ రైతుబంధు డబ్బులు పడుతయని చెబుతున్రు. మస్తు సంతోషంగా ఉంది. -దనగరి సంతోష్, రైతు, ఓలా
రైతులకు ఢోకా లేదు
నిర్మల్ టౌన్, డిసెంబర్ 27 : నాకు కుంటాల, ఓలా గ్రామ శివారులో 11 ఎకరాల భూమి ఉంది. మొదట రైతుబంధు కింద పెట్టుబడి సాయం కోసం సర్కారోళ్లు ఎకరానికి రూ. 4 వేల చొప్పున ఇచ్చిన్రు. అప్పుడు రెండు పంటలకు రూ. 88 వేలు వచ్చినయ్.ఆ తర్వాత ఎకరానికి రూ.5 వేలకు పెంచిన్రు. 2019 నుంచి రూపాయి అప్పు చేయకుండా రంది లేకుంట పంటలు పండించుకుంటున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు ఢోకా ఉండదు. అట్లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదు.
– మానయిగారి రాధాకృష్ణ, రైతు, కుంటాల