ధ్యేయంపై నిలువెల్ల అంకితభావం కలిగిన వ్యక్తులే సమాజాన్ని ముందుకు నడిపిస్తారు.. అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చూపించిన దారిలో సీఎం కేసీఆర్ పయనిస్తున్నారు. స్వల్ప కాలంలోనే యావత్దేశం తన వైపు చూసి అనుసరించే అని వార్యతలను సృష్టించారు. తెలంగాణ సంక్షేమ పథాన్ని మరో మలుపు తిప్పనున్నారు.
వరినాటు, వరికోత, పవర్ ట్రిల్లర్, ట్రాక్టర్, ఆటోట్రాలీలు, డీసీఎం వ్యాన్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. పాలు, కోళ్ల పరిశ్రమ, ఆయిల్ మిల్లు, స్టీల్, సిమెంట్, బ్రిక్స్, ఫర్నిచర్, బట్టలు, మందులు, ల్యాబ్, మొబైల్స్ దుకాణాలు, హోటల్స్ వంటివి నడిపిస్తున్నారు.
దశాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల జీవితాల్లో దళితబంధు వెలుగు పూలు పూయిస్తున్నది. దళితజాతి సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు, గుణాత్మక మార్పు తీసుకురావడానికి, పేదరికాన్ని శాశ్వతంగా పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం శరవేగంగా అమలవుతున్నది. బ్యాంకు గొడవలు, లంచాలు, కమీషన్ల వంటి బాధలేకుండా అర్హులైన దళితుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా రూ.10 లక్షలు జమ అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ సర్కారు 1000 యూనిట్లకు రూ.100 కోట్లు వెచ్చించి అమలు చేస్తున్నది. అర్హులైన లబ్ధిదారులు ఉమ్మడిగా యూనిట్లు ప్రారంభించుకుంటుండగా.. కొందరు వ్యక్తిగతంగా నడిపిస్తున్నారు. మొదటి విడుతగా మంజూరైన యూనిట్లను లబ్ధిదారులు ఉపయోగించుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు.
ఆదిలాబాద్/నిర్మల్ (నమస్తే తెలంగాణ), నవంబర్ 1 : భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళితుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు అతిపెద్ద నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ దళితబంధు పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శరవేగంగా అమలవుతుండగా.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుండడంతో లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకొని లబ్ధిపొందుతున్నారు. నిన్నటి వరకు పాలేర్లు, డ్రైవర్లు, కూలీలుగా జీవనం సాగించిన వారు నేడు యజమానులుగా, నలుగురికి ఉపాధినిచ్చే వ్యాపారులుగా మారారు. ఇప్పటికే ప్రభుత్వం దళితుల ఆర్థికాభివృద్ధికి దళితబస్తీ, స్కాలర్షిప్స్, స్వయం ఉపాధి శిక్షణ, స్టడీ సర్కిళ్ల నిర్వహణ, విద్యానిధి, కులాంతర వివాహాల ప్రోత్సాహం, ఎస్సీ హాస్టల్స్, గురుకులాలు, నైపుణ్య శిక్షణ వంటి వాటి ద్వారా ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నది.
నచ్చిన వ్యాపారానికి అవకాశం
రైతుబంధు తరహాలోనే దళితుల ఆర్థికాభివృద్ధికి దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. దీని ద్వారా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఇవ్వనుంది. ఎంపిక విధానం పారదర్శకంగా ఉండేందుకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేశారు. దళితబంధు పథకం నుంచి ఆర్థికసాయం పొందిన వారు వారికి నచ్చిన వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారు. వ్యవసాయానికి సంబంధించి వరినాటు యంత్రం, వరికోత మిషన్, పవర్ ట్రిల్లర్, ట్రాక్టర్ వంటివి తీసుకుంటున్నారు. ఆటోట్రాలీలు, డీసీఎం వ్యాన్లు, కార్లు వంటివి కొనుగోలు చేస్తున్నారు. పాలు, కోళ్ల పరిశ్రమ, ఆయిల్ మిల్లు, స్టీల్, సిమెంట్, బ్రిక్స్, ఫర్నిచర్, బట్టలు, మందులు, ల్యాబ్, మొబైల్స్ దుకాణాలు, హోటల్స్ ఇలా ఏదైనా వారి సొంతంగా వ్యాపారం ప్రారంభించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
మంచిర్యాల జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 8,07,037. ఇందులో ఎస్సీ జనాభా (ఎస్కేఎస్ 2014) ప్రకారం 2,13,575 (24.71 శాతం) ఉంది. నియోజకవర్గాల వారీగా.. బెల్లంపల్లి 60,864, చెన్నూర్ 75,394, మంచిర్యాల 62,877, జన్నారం(ఖానాపూర్) 14,440 జనాభా ఉంది. ఎస్సీల గృహాలు మొత్తం 64,455 ఉండగా.. బెల్లంపల్లిలో 18,078, చెన్నూర్లో 22,598, మంచిర్యాలలో 19,287, జన్నారం(ఖానాపూర్)లో 4,492 ఉన్నాయి. కాగా.. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలకు 300, జన్నారం మండలానికి 13 యూనిట్లు మొదటి విడుత మంజూరవగా లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. వ్యవసాయ అనుబంధ 55 (డెయిరీ యూనిట్లు 23, ఫర్టిలైజర్ దుకాణాలు 7, మేకలు, గొర్రెలు 23, ఫౌల్టీ ఫాం 1, ఫిష్ ఫాండ్ 1) యూనిట్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే మ్యానిఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ రంగంలో 24 (సెంట్రింగ్ 20, సిరామిక్స్ 3, పేపర్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ 1) యూనిట్లు, ట్రాన్స్ఫోర్టు సెక్టారులో 185 (గూడ్స్ వెహికిల్స్ 33, జేసీబీ/హార్వెస్టర్స్19, ట్రాక్టర్స్ అండ్ ట్రాలీలు 81, ప్యాసింజర్ వెహికిల్స్ 52)యూనిట్లు, సర్వీసెస్ అండ్ సప్లయిస్ సెక్టార్లో 35(టెంట్హౌస్, డీటీఎస్ సౌండ్ సిస్టం 23,డయాగ్నోస్టిక్స్ 2, ఫొటో, వీడియో, ఫ్లెక్సీ 8, మొబైల్ టిఫిన్ సెంటర్, ఇంటర్నెట్ 2) యూనిట్లు, రిటైల్ దుకాణాలు 14 (కిరాణ, బట్టల, జనరల్, సూపర్బజార్, కంగన్హాల్, చెప్పులు, ఈ-బైక్ షోరూం తదితర) యూనిట్ల ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.
దళితులకు దారి చూపిన బంధువు కేసీఆర్
నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామానికి చెందిన చిర్ర నారాయణ, ముత్తవ్వ, పోసాని కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆరాధ్య దైవంగా మారిన్రు. దళితబంధు పథకం ఆ కుటుంబాల్లో వెలుగులు నింపడమే దీనికి కారణం. వీరికి దళితబంధు కింద ఒక్కొక్కరికి రూ. 10లక్షలు మంజూరయ్యాయి. మొన్నటి వరకు ఎలాంటి ఉపాధి లేక జీవన పోరాటం సాగించిన ఈ కుటుంబాలు… నేడు దళితబంధు పథకం ద్వారా సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నాయి.
దళితబంధు పథకం ద్వారా ఆయా కుటుంబాలకు జేసీబీ యంత్రం మంజూరు కావడంతో, 4 నెలలుగా ఆపరేటర్ను నియమించుకొని వివిధ పనుల కోసం అద్దెకు నడుపుతున్నారు. మొన్నటి వరకు ఇతరుల వద్దకు కూలీలుగా వెళ్లిన వారు నేడు యజమానులుగా మారి మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నరు. వీరికి రూ.33.80లక్షల విలువ గల జేసీబీ యంత్రాన్ని అధికారులు అందజేసిన్రు. ప్రభుత్వం ఇచ్చిన రూ.30 లక్షలు పోను మరో 3.80 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. జేసీబీ ద్వారా వచ్చిన ఆదాయంతో ముందుగా బయట నుంచి తెచ్చిన అప్పును తీర్చేయాలని ఈ ముగ్గురు నిర్ణయించుకున్నరు. అనుకున్నట్లుగానే కేవలం నాలుగు నెలల్లోనే రూ. 3.80 లక్షల బాకీని కట్టేసిన్రు. ఇకపై వచ్చే ఆదాయాన్ని ముగ్గురం పంచుకుంటమని సంతోషంగా చెబుతున్నరు. సగటున రోజుకు 6 నుంచి 8 గంటల పని దొరుకుతున్నదని, గంటకు రూ.1200 తీసుకుంటున్నామని నారాయణ తెలిపాడు. డీజిల్ ఖర్చులు పోను రోజుకు 4వేల నుంచి రూ. 6 వేలు సంపాదిస్తున్నరు. జేసీబీని నడిపేందుకు ఇద్దరు ఆపరేటర్లను నియమించుకోగా, వీరికి నెలకు రూ. 20 వేల జీతాన్ని ఇస్తున్నరు. ఇదిలా ఉంటే ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన ముత్తవ్వ, ఎలాగోలా ఇద్దరు కూతుళ్ల పెండ్లి చేశానని, ఇప్పుడు చిన్న కూతురిది కూడా ఘనంగా చేస్తానని చెబుతున్నది. అలాగే మరో లబ్ధిదారు పోసాని కూడా నిన్న మొన్నటి దాక చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట పోసుకునేది. పోసానికి దళితబంధు పథకం నిజంగా వెలుగు రేఖ అయ్యింది. దళితబంధు ద్వారా మా జీవితాలు బాగుపడ్డాయని ఆ ముగ్గురూ సంతోషంగా చెబుతున్నరు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటమని గర్వంగా చెబుతున్నరు.
నాడు గల్ఫ్ బాట.. నేడు హార్వెస్టర్ యజమాని..
నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకెరకు చెందిన దళిత యువకుడు ద్యావత్ గంగాధర్ పదో తరగతి వరకు చదువుకున్నడు. ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వారు. ఈ క్రమంలో పెద్దకొడుకైన గంగాధర్ 2005లో ఉపాధి కోసం గల్ఫ్కు పోయిండు. ఎనిమిదేళ్ల పాటు అక్కడే ఉన్నా, చేసిన అప్పులు కూడా తీరలేదు. దీంతో 2008లో ఇండియాకు తిరిగి వచ్చిండు. చుట్టు పక్కల గ్రామాల్లో పాలను సేకరించి నిర్మల్లో అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించు కున్నడు. గుంట భూమి కూడా లేని గంగాధర్ వచ్చిన అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్న తరుణంలో దళితబంధు పథకం వరంలా మారింది. సాకెర గ్రామానికే చెందిన మరో లబ్దిదారు మల్లవ్వ, గంగాధర్కు కలిపి దళితబంధు కింద హార్వెస్టర్ను అందజేసిన్రు. యాసంగి సీజన్లో వరి, మక్కజొన్న, సోయా పంటలను కట్టింగ్ చేసి తొలి ఆదాయాన్ని పొందిన్రు. ఇప్పుడు వానకాలం సీజన్కు సంబంధించిన పంటలు మరో వారం, పది రోజుల్లో కోతకు రానున్నాయి. గంటకు రూ.1600 తీసుకుంటు న్నామని, సీజన్లో రోజూ 7 నుంచి 8 గంటల పాటు పని దొరుకుతుందని గంగాధర్ చెబుతున్నడు. ఖర్చులు పోను నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తున్నదని సంతోషపడు తున్రు. ఇక ఇందులో మరో లబ్ధిదారు మల్లవ్వ మొన్నటి వరకు బీడీలు చుడుతూ నెలకు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు సంపాదించేది. ఇప్పుడు హార్వెస్టర్తో రోజూ వేలల్లో ఆదాయం వస్తున్నదని చెబుతున్నది. మల్లవ్వ ఇద్దరు కొడుకులు కూడా గతంలో కూలీ పనులకు వెళ్లే వారు. ప్రస్తుతం వారు హార్వెస్టర్ వెంట వెళ్తూ పంటల కోతల్లో బిజీగా మారారు. ఇలా దళితబంధు పథకం ఆ రెండు కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది.
నెలకు రూ. 30 వేలు సంపాదిస్తున్న..
గతంలో లారీ డ్రైవర్గా పోయేటోన్ని. నెలకు రూ. 10 వేల జీతం వచ్చేది. ఆ తర్వాత ప్రభుత్వం నాకు దళితబంధు పథకం లబ్ధిదారుడిగా ఎంపిక చేసింది. దీంతో మ్యాక్స్ ట్రాలీని తీసుకున్న. ఇప్పుడు నెలకు రూ.30 వేలకుపైనే సంపాదిస్తున్న. ప్రస్తుతం అన్సీజన్ కావడంతో రోజుకు రూ. వెయ్యి దాకా వస్తున్నయ్. ఇగ పత్తి అమ్మకాల సీజన్ ప్రారంభమైతే రోజుకు కనీసం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు సంపాదిస్త. ఇప్పుడు సొంత వాహనంతో ఉపాధి పొందుతున్న. డ్రైవర్గా పనిచేసి ప్రభుత్వం సహకారంతో ఓనర్నయ్యా. మా జీవితాల్లో సీఎం కేసీఆర్ దళిత బంధు ద్వారా వెలుగులు నింపిన్రు. మా గ్రామంలో 9 దళిత కుటుంబాలను ఎంపిక చేసిన్రు. ఇప్పుడు ఆ కుటుంబాలు బాగుపడ్డయ్. దళితుల కోసం ఇంత మంచి పథకం పెట్టిన సీఎం కేసీఆర్ మాకు దేవుడితో సమానం.
– దేవునూరి నర్సయ్య, దళిత బంధు
లబ్ధిదారుడు, మాణిక్యపూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఉద్యోగం రాకున్నా.. ఉపాధి దొరికింది..
మంచిర్యాల అర్బన్, నవంబర్ 1: నేను డిగ్రీ పూర్తి చేసిన. పోలీస్ కావాలని ఉండే. ఆదిల్పేటలో మాకున్న ఎకరంన్నర భూమిలో అమ్మానాన్న తైదల మధునయ్య,లక్ష్మి వ్యవసాయం చేస్తూ నన్ను చదివించిన్రు. రెండు సార్లు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు దగ్గరికి వచ్చినట్లే వచ్చి దూరమయ్యాయి. బాగా కుంగిపోయిన. ఒక్కగానొక్క కొడుకును కావడంతో తల్లిదండ్రులు ధైర్యమిచ్చిన్రు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఇంట్లో దళిత బంధు రూపంలో వెలుగులు నింపిండు. దళితబంధుకు ఎంపికవడంతో డెయిరీ యూనిట్ను ఎంచుకున్న. మాకున్న పొలంలో బర్రెలకు మేత చొప్ప వేసిన. ఇక్కడే షెడ్డు, వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసిన. ఎనిమిది బర్రెలకు తోడు ఆరు దుడ్డెలు ఉన్నయ్. రోజూ 40 లీటర్ల పాలిచ్చినయ్. బిహార్కు చెందిన ఒకరిని కూలీగా పెట్టుకున్న. ఇంటికి కావాల్సిన కూరగాయలు కూడా పండిస్తున్న. పాలను లోకల్గా(గ్రామంలో) అమ్మితే తక్కువ డబ్బులు రావడం, నెల నెలా డబ్బులు రాకపోవడంతో మందమర్రి, మంచిర్యాల పట్టణాలకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న. ఈ సమయంలో బిహార్ కూలి వెళ్లిపోవడం, ఇక్కడ నుంచి పట్టణాలకు రోజూ తీసుకెళ్లడం ఇబ్బంది కావడంతో నా మిత్రుడు (దినేష్) సహకారంతో మంచిర్యాల సమీప గద్దెరాగడి వద్ద అతడి డైరీ ఫారం వద్ద నుంచి ఇద్దరం కలిసి పాలు అమ్మడం మొదలు పెట్టినం. లీటరుకు రూ. 70 వస్తున్నయ్. పాలకు అనుకున్నదానికంటే డిమాండ్ ఎక్కువగానే ఉంది. నెలకు రూ. 50 వేలు మిగులుతున్నయ్. ఇది ఇలాగే కొనసాగి, దుడ్డెలు ఎదిగితే మా ఆర్థిక స్థితిగతులు మారుతాయ్. సార్ (కేసీఆర్) అనుకున్న లక్ష్యం చేరుకుంటది. నాడు దళితులకు అండగా అంబేద్కర్ నిలిస్తే, నేడు మాకు అండగా కేసీఆర్ ఉన్నడు.
– తైదల జంపయ్య, ఆదిల్పేట, మందమర్రి మండలం
12 ఏండ్ల కల నెరవేరింది..- ఆసంపల్లి శంకర్, సారంగపల్లి, మందమర్రి మండలం
మంచిర్యాల అర్బన్, నవంబర్ 1 : నాకు పశువులంటే ఇష్టం. పన్నెండేండ్లుగా డెయిరీ ఫామ్ పెట్టాలన్నది నా కోరిక. మందమర్రిలో ఇంటర్ వరకు చదివి, గోదావరిఖనిలో డిగ్రీ పూర్తి చేసిన. తర్వాత మా ఊరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ గార్డుగా రూ. పది వేలకు పని చేసిన. మాది ఉమ్మడి కుటుంబం. అమ్మానాన్నతో పాటు నలుగురు తమ్ముళ్లు. అందరం ఇప్పటికీ కలిసే ఉంటున్నం. మా ఐదుగురిలో ప్రస్తుతం ఒక తమ్ముడు ప్రైవేటుగా పని చేస్తుండు. మరో ముగ్గురు తమ్ముళ్లు చదువుకుంటున్నరు. అమ్మనాన్నలు మాకున్న మూడెకరాల్లో వరి పంట సాగు చేస్తున్నరు. ఇలా ఎంత చేసినా మాకు ఏం మిగిలేది కాదు. ఈ టైంలనే ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో మొదటి దఫాలో నాకు అదృష్టం వరించింది. దళిత బంధు లబ్ధిదారుడిగా ఎంపికైన. ఇదే నా 12 ఏండ్ల కల నెరవేర్చుకునేందుకు అవకాశం వచ్చింది. ఇంట్లో వారందరితో ఈ విషయం చర్చించగా అందరూ ఓకే అన్నరు. ఇక ఏం వెనుకాడలేదు. వెంటనే ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలిసి డెయిరీ యూనిట్ కావాలని చెప్పిన. అధికారులు ఓకే అనగానే ఏపీలోని భీమవరం సమీపంలో నాకు నచ్చిన 8 బర్రెలను ఎంపిక చేసుకున్న. వీటిలో నాలుగు పాలిచ్చేవి, మరో నాలుగు సూడి బర్రెలను సెలెక్ట్ చేసుకున్న. ప్రస్తుతం ఐదు బర్రెలు రోజుకు 25 నుంచి 30 లీటర్ల వరకు పాలిస్తున్నవి. ఇందులో ఐదు లీటర్ల వరకు స్థానికంగా(ఊర్లోనే) పోస్తున్న. మిగతావి మందమర్రిలోని స్వీటు హౌస్కు పోస్తున్న. లీటరుకు రూ. 70 వస్తున్నవి. నెలకు రూ. 50 వేలకుపైగానే వస్తున్నవి. ఇందులో ఖర్చులు పోను రూ. 40 వేలు నా సంపాదన. నాకు అమ్మానాన్న సహాయపడుతున్నరు. ప్రస్తుతం బర్రెల కోసం ఎకరం భూమిలో గడ్డి విత్తనాలు వేసినం. మరో రెండెకరాల్లో మాకు వరి పండించుకుంటున్నం. నాకు ఇష్టమైన డెయిరీ ఫామ్ను ఎలాంటి పెట్టుబడి లేకుండా కేసీఆర్ పుణ్యమాని ఏర్పాటు చేసుకున్న. పశువైద్యాధికారులు కూడా వారంలో రెండు సార్లు వచ్చి చూస్తుండ్రు. ఫోన్లో కూడా సలహాలు ఇస్తుండ్రు.
మా జీవితాన్ని మార్చేసింది..
దళిత బంధు పథకం మా జీవితాన్ని మార్చేసింది. గతంలో నేను మేస్త్రీల వద్ద ట్రాలీ నడుపుతూ సెంట్రింగ్ సామగ్రి సరఫరా చేసేటోన్ని. నెలకు రూ.10వేల వరకు జీతం వచ్చేది. ఇప్పుడు దళిత బంధుతో సొంతంగా సెంట్రింగ్ యూనిట్ పెట్టిన. ఒక ట్రాలీ ఆటోను తీసుకున్న. ఇప్పుడు రోజుకు రూ.1500 వరకు దొరుకుతున్నయ్. నెలకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు సంపాదిస్తున్న. దళిత బంధు పథకం ద్వారా మా బతుకుల్ని బాగు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– ఒన్న సంతోష్, దళితబంధు లబ్ధిదారుడు, మాణిక్యాపూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
దళితుల అభివృద్ధికే పథకం..
అర్హులైన ఎస్సీలకు దళితబంధు కింద ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి. వైన్షాపులు, మెడికల్, రసాయన దుకాణాలు, రైస్ మిల్లులు వంటి వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కొత్త పథకం దళితబంధు.
– బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్.
త్వరలో రెండో విడుత ఎంపిక..
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న దళితులందరూ ఈ పథకానికి అర్హులే. కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ఎవరికి(దళారులకు) డబ్బులు ఇవ్వరాదు. అర్హులందరూసద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి. దఫ దఫాలుగా అర్హులందరికీ పథకం వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక త్వరలో జరుగనుంది. అందరికీ న్యాయం జరుగుతుంది.
– దుర్గా ప్రసాద్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ, మంచిర్యాల
నిర్మల్ జిల్లాలో 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,09,418. ఇందులో ఎస్సీ జనాభా (ఎస్కేఎస్ 2014) ప్రకారం 1,21,536(17.13 శాతం). నియోజకవర్గాలవారీగా నిర్మల్లో 42,707, ముథోల్లో 56,357, ఖానాపూర్లో 22,472 జనాభా ఉంది. ఎస్సీల గృహాలు మొత్తం 37,481. ఇందులో నిర్మల్లో 16,596, ముథోల్లో 16,973, ఖానాపూర్లో 6,912. మొదటి విడుతగా 261 యూనిట్లకు రూ. 26.10 కోట్లు కేటాయించింది.
ఆదిలాబాద్ జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 7,07,952. ఇందులో షెడ్యూల్డ్ కులాల జనాభా 99,422 (14.02 శాతం). మొదటి విడుత దళితబంధు 249 కుటుంబాలకు అందించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు, బోథ్లో 100, ఖానాపూర్లో 26, ఆసిఫాబాద్లో 23 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.24.90 కోట్లు ఖర్చు చేసింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 5,51,835. ఇందులో ఎస్సీ జనాభా (ఎస్కేఎస్ 2014) లెక్కల ప్రకారం 81,596(15.81శాతం). ఎస్సీల గృహాలు 16,396. మొదటి విడుత మంజూరైన యూనిట్లు 177. ఇందుకుగాను రూ.17.70 కోట్లు కేటాయించారు. గ్రౌండింగ్ అయిన యూనిట్లు 108. రూ.10.69 కోట్లు మంజూరు కాగా.. రూ.17.60 కోట్లు రక్షణ నిధి కింద ఉన్నాయి.