మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్, జూన్ 23 : సింగరేణి కార్మికులు చీకట్లను చీల్చుతూ నల్లబంగారాన్ని వెలికితీసి లోకానికి వెలుగులు పంచుతున్నారు. బతుకు పోరులో వారి ధీనస్థితికి చలించిన సీఎం కేసీఆర్ వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుంబిగించారు. ఉద్యమ కాలం నుంచి అనేక పర్యాయాలు సింగరేణి ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, స్వరాష్ట్రంలో నేడు కార్మికులకు శాశ్వత పరిష్కారం చూపించారు. సింగరేణి ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జీవో 76ను అమల్లోకి తీసుకొచ్చారు. మహిళల పేరిట తయారు చేయించిన పట్టాలను స్వయంగా వారి చేతికే అందించారు విప్ సుమన్. దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు కార్మిక కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ సుమన్కు కార్మికలోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నది. మే25న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతులమీదుగా పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నెల 10న రెండో విడుత మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీ హోళీకేరితో విప్ సుమన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కాగా, పలు కారణాలతో బెల్లంపల్లిలో ఆలస్యమైంది. బెల్లంపల్లిలో ఎస్ఆర్టీ క్వార్టర్స్లను వివిధ విభాగాలతో జాయింట్గా రీ సర్వే చేయించి నివేదికలు పంపించారు. త్వరలో పట్టాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృషి చేస్తున్నారు.
మొదటి, రెండు విడుతల్లో..
శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సింగరేణి ప్రాంతాల్లో 2,095 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మే 25న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా, ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్య కొనసాగిస్తున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 3,940 మంది ఇండ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇందులో 1,401 మందివి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 710 దరఖాస్తులను ఏజెన్సీ, సింగరేణి తిరస్కరించింది. 749 మంది డీడీలు తీయాల్సి ఉంది. 150 ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కాగా, 830 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ ఏరియాలోని 176 ఎకరాల సింగరేణి స్థలంలో 2,843 మందికి పంపిణీ చేయనుండగా, ఇందులో మొదటి విడుతలో 843 మందికి అందజేశారు. జూన్ 10న రెండో విడుతలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో మంత్రి గంగుల కమలాకర్.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి అందజేశారు. 2014లో సింగరేణి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, జీవో 76 తీసుకొచ్చి ఇండ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు విప్ తెలిపారు. ఇక మూడో విడుత పట్టాల పంపిణీని ఈ నెల 24న మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అస్థిత్వం.. ఆత్మగౌరవం కోసమే..
సింగరేణి తల్లి గర్భం నుంచి ఉద్భవించిన పట్టణాలు కాలగర్భంలో కలిసిపోకుండా తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో పట్టాలు పంపిణీ చేయడం, సొంతింటి కల సాకారమవుతుండడంతో ప్రజలు పట్టలేని ఆనందంలో ఉన్నారు. పట్టణాలు బొందలగడ్డలుగా మారకుండా ఉండాలంటే, పునరుజ్జీవం పోసుకోవాలంటే స్థిర నివాసమే మార్గమని యోచించాం. కార్మికులకు స్థిర నివాసం ఏర్పరచడమే అస్థిత్వానికి ప్రత్యామ్నాయమని గుర్తించాం. ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడంతో దశాబ్దాల కల నెరవేరినందుకు సింగరేణి ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – బాల్క సుమన్, ప్రభుత్వ విప్
చిరు వ్యాపారులకు కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరం
శ్రీరాంపూర్, జూన్ 23 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సింగరేణి స్థలంలోని వాటర్ ట్యాంక్ ఏరియాలో నివాసం ఉంటున్న వారందరికీ, చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలు గొప్పవరంగా భావిస్తున్నాం. తాత్కాలికంగా నిర్మించుకున్న ఇల్ల మరమ్మతులు చేసుకోవాలంటే సింగరేణి ఎస్అండ్పీసీల వేధింపులు ఉండేవి. ఆ కష్టాలు ఇక ఉండవనే సంతోషం ఉంది. గత ప్రభుత్వాలు చేయలేని పని కేసీఆర్ చేశారు. కేసీఆర్ ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు. చిరు వ్యాపారం చేసుకుంటూ ఉపాది పొందుతున్నాను. ఇంటి స్థలం పట్టాలు ఇచ్చారని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారనే సంతోషంగా ఉందని కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి స్థలం పట్టా కల్పించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే దివాకర్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– వంగల అంజళి శ్రీనివాస్, శ్రీరాంపూర్ కాలనీ
కేసీఆర్కు మా కుటుంబం రుణపడి ఉంటుంది
రామకృష్ణాపూర్, జూన్ 23 : నా పేరు కుక్క వసంత. నా భర్త కుక్క దేవయ్య. మా ఆయన 30 ఏండ్లు సింగరేణిలోని ఆర్కే1ఏ గనిలో ఫిట్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యిండు. 20 ఏండ్ల నుంచి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. మాకు కొడుకు ఉదయ్కుమార్, కూతురు మానస ఉన్నారు. ఇద్దరికీ వివాహం ఇక్కడే చేశాం. తెలంగాణ ప్రభుత్వం మాకు 226 గజాల స్థలానికి పట్టా ఇచ్చింది. మా ఇంటి జాగకు పట్టాలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేయలేదు. రెండో వార్డులో నిర్మించుకున్న మా ఇంటి స్థలానికి పట్టా ఇప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు మా కుటుంబం ఎప్పటీకి రుణపడి ఉంటుంది. – కుక్క వసంత-దేవయ్య, 2వ వార్డు, తిలక్నగర్
పట్టాలివ్వడం వల్లే విలువ పెరిగింది
ఇండ్లకు పట్టాలు రావడం వల్ల విలువ పెరిగింది. మా ఆయన పేరు శ్రీనివాస్. ట్రాక్టర్ కూలీగా పనిచేస్తాడు. మాకు ఇద్దరు పిల్లలు సోని, శ్రావణ్ ఉన్నారు. మా అమ్మ తల్లి నాతోనే ఉంటుంది. 30 ఏండ్ల నుంచి ఇక్కడే రేకుల షెడ్డు వేసుకొని ఉంటు న్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి భూమిలో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. పట్టాలు ఇప్పించేందుకు కృషి చేసిన మా వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజుకు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు ఎప్పటికీ రుణ పడి ఉంటాం.
– ఎడ్ల దేవక్క-శ్రీనివాస్, 14వ వార్డు, పోచమ్మ బస్తీ, రామకృష్ణాపూర్
బాల్క సుమన్ వల్లే మేలు..
రామకృష్ణాపూర్, జూన్ 23 : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వల్లే మాకు మేలు జరిగింది. 40 ఏండ్ల నుంచి పోచమ్మ బస్తీలోని సింగరేణి భూమిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. నా భర్త బెక్కం నర్సయ్య ఆర్కే5 గనిలో జనరల్ మజ్దూర్గా పని చేశాడు. 2009లో రిటైర్ట్ అయ్యిండు. 2019లో ఆయన చనిపోయిండు. మాకు ఇద్దరు కొడుకులు. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నరు. 30 ఏండ్ల నుంచి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నరు. ఇప్పటి దాకా మా బాధను ఎవ్వరూ పట్టించుకోలే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్ బాల్క సుమన్ ఇండ్లకు పట్టాలు ఇప్పించిండు. నేను బతికినన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటా.
– బెక్కం దుర్గమ్మ, 14వ వార్డు, పోచమ్మ బస్తీ, రామకృష్ణాపూర్
గుడిసెల స్థానంలో బంగ్లా కట్టుకుంటాం
శ్రీరాంపూర్, జూన్ 23 : శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలో తాము 30 సంవత్సరాలుగా నివాసం ఉంటు న్నాం. ఇక తమకు వచ్చిన పట్టాతో తమ కుటుంబం సంతో షంగా ఉంది. తమ గుడిసె స్థానంలో బంగ్లా కట్టుకుంటాం. ఇంత కాలం సింగరేణి యాజమాన్యం చిన్న ఇల్లు మరమ్మతు చేసుకున్నా వచ్చి అడ్డుకునే వారు. ఇక నుంచి ఆ భయం ఉండదు. స్వేచ్ఛగా మా స్థలం మాకు అంటం. ఎమ్మెల్యే దివాకర్రావు ఎంతో కృషి చేసి మాకు ఇండ్ల స్థలాల పట్టాలు కల్పించారు. – జాతరకొండ లక్ష్మి-లింగయ్య
సింగరేణి ఉపాధి కల్పిస్తే కేసీఆర్ నీడనిస్తున్నారు
శ్రీరాంపూర్, జూన్ 23 : తెలంగాణ నిరుద్యోగ యువతకు సింగరేణి ఉపాధి కల్పిస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ మాకు ఇంటి స్థలానికి పట్టా ఇచ్చి నీడ కల్పించారు. నిరుపేదలకు, కులవృత్తులకు నాలాంటి ప్రైవేట్ డ్రైవర్లు, నిరుద్యోగ యువతకు కేసీఆర్ ఆదేశాలతో నివాసం ఉంటున్న స్థలానికి పట్టా దొరుకడం అదృష్టంగా భావిస్తున్నాం. మాది కరీంనగర్ పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్. పొట్ట చేత్తో పట్టుకొని శ్రీరాంపూర్కు వచ్చాం. 28 సంవత్సరాలుగా నేను జీపు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు ఆస్థలానికి కేసీఆర్ పట్టా కల్పించారు సంతోషంగా ఉంది. మా పిల్లలు మీ స్వంత గ్రామం ఏదంటే శ్రీరాంపూర్ కాలనీ అని చెప్పుతున్నారు. అంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన అభిమానం, ఉపాధి పొందుతున్నామనే భావం ఏర్పడింది. ఇండ్ల స్థలాలకు పట్టాలు కల్పించిన కేసీఆర్కు తామురుణ పడి ఉంటాము. ఎమ్మెల్యే దివాకర్రావు ప్రత్యేక చొరవ తీసుకొని కేసీఆర్ ద్వారా ఇంటి స్థలాలు కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. – నిమ్మతి మణెమ్మ-సమ్మయ్య, శ్రీరాంపూర్
బ్యాంకు రుణాలివ్వాలి
శ్రీరాంపూర్, జూన్ 23 : 30 ఏండ్లుగా సింగరేణిలో పని చేస్తున్నా. ఇప్పటి వరకు మాకు సొంత జాగ లేదు. సింగరేణి స్థలంలోనే ఉంటూ వచ్చినం. మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేముంటున్న స్థలానికి పట్టా ఇప్పించారు. ఇగ ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం. మాకు బ్యాంకు రుణాలివ్వాలి. మా బాధను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఉష్కమల్ల సత్తెమ్మ-నారాయణ, శ్రీరాంపూర్
మా ఇంటి జాగకు హక్కు కల్పించారు
1994 నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు కొడుకు, కూతురు ఉన్నారు. మా ఆయన శ్రీసాయి హెయిర్ ైస్టెల్ షాపు (మంగళిషాపు) నడుపుతడు. ఇంటి జాగ 151 గజాలకు రూ 4 వేలు, మంగళి షాపు 85 గజాల జాగకు రూ.4 వేలు కట్టిన. ఈ రెండు స్థలాలకు సర్కారు పట్టాలు ఇచ్చింది. వీటి విలువ సుమారు రూ. 20 లక్షల దాకా ఉంటుంది. గతంలో ఏ ప్రభుత్వమూ పట్టాలు ఇవ్వలేదు. ఇది వరకు ఇండ్లు కట్టుకోవడానికి ఇసుక, ఇటుకలు వేయించుకుంటే సింగరేణి అధికారులు వచ్చి లాక్కుపోయేవారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మా ఇంటి జాగకు పట్టాలు ఇచ్చి సర్వహక్కులు కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. ఇటీవల మా బిడ్డ పెండ్లి చేసినం. కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకున్నం. నాలుగు నెలలకే కల్యాణ లక్ష్మి కింద రూ.1,01,116 అందించారు. మా హెయిర్ ైస్టెల్ షాపునకు కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా కరంట్ ఇస్తుంది. దీంతో నెలకు రూ. వెయ్యి దాకా మిగులుతున్నయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటాం.
– చిప్పబత్తుల పద్మ రాజమౌళి, 2వ వార్డు, కనుక దుర్గా కాలనీ, రామకృష్ణాపూర్
ఇల్లు కట్టుకుంటాం
శ్రీరాంపూర్, జూన్ 23 : మాది కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామం. సింగరేణిలో 30 ఏండ్లు పని చేశాను. మెడికల్ అన్ఫిట్ అయ్యాను. సీఎం కేసీఆర్ దయ వల్ల నా కొడుకుకు డిపెండెంట్ ఉద్యోగం వచ్చింది. గోలేటిలో ఉద్యోగం మొదలు పెట్టి అక్కడ కిరాయికి ఉన్నా. తర్వాత శ్రీరాంపూర్వాటర్ ట్యాంక్ ఏరియాకు వచ్చాను. అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయ్యాను. వాటర్ ట్యాంక్ కాలనీ శ్రీరాంపూర్లో సింగరేణి స్థలంలో తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాను. ఇప్పుడు పట్టా ఇచ్చారు. ఇగ మంచి ఇల్లు కట్టుకుంటాం. కార్మికులు, కార్మికేతరులు కేసీఆర్కు కృతజ్ఞలుగా ఉంటారు. – గుజ్జ లక్ష్మణ్రావు-సుజాత, శ్రీరాంపూర్
ధన్యవాదాలు
రామకృష్ణాపూర్, జూన్ 23 : ఇండ్ల పట్టాల కోసం 35 ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. మాకు రెండు ఇండ్లు ఉన్నాయి. రెండింటికీ పట్టాలు ఇచ్చారు. విప్ బాల్క సుమన్ పట్టుదల వల్లే మా ఇండ్లకు పట్టాలు వచ్చాయి. సీఎం కేసీఆర్ సింగరేణి ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇకపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంతి కేసీఆర్కు అండగా ఉంటాం. ఇండ్ల పట్టాలు ఇచ్చి మా కుటుంబంలో సంతోషం నింపిన ఎమ్మెల్యే బాల్క సుమన్కు, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. మంచి చేసేవారికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండితీరాలి.
– తంగళ్లపల్లి శ్యామల-శ్రీనివాస్, 3వ వార్డు, ఇందిరానగర్, రామకృష్ణాపూర్