ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. దీనిని 85 నుంచి 90 శాతానికి పెంచడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాలను ప్రకటించింది. దవాఖానకు రూ.3 వేలు, వైద్యుడు, స్టాఫ్ నర్సులకు ఒక్కొక్కరికి రూ.1000, ఆయా, పారిశుధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున అందజేయనున్నారు. ఫలితంగా కడుపుకోత తగ్గే అవకాశం ఉంది.
మంచిర్యాల, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ప్రధాన దవాఖానతోపాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు సీహెచ్సీలు, 17 పీహెచ్సీలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం 85 శాతం సాధారణ ప్రసవాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దవాఖానలకు రూ.3 వేల నగదు ప్రోత్సాహం అందజేయనున్నారు. జనరల్ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతినెలా 150 సాధారణ కాన్పులు, సివిల్ ఆస్పత్రుల్లో నెలకు 50 సాధారణ కాన్పులు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెలా పీహెచ్సీలలో పది, యూహెచ్సీలలో ఐదు సహజ కాన్పులు చేయాలని నిబంధనలు విధించారు.
కడుపు కోతకు చెక్..
మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రసవాలు పెంచాలని వైద్యులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. సర్కారు దవాఖానల్లో కాన్పులు చేయించుకునే మహిళలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్టుతోపాటు ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ శిశువుకు రూ. 12 వేలు అందజేస్తున్నది. కడుపు కోత తగ్గించాలని, సాధారణ ప్రసవాలను పెంచాలనే నిర్ణయంతో సర్కారు ముందుకు సాగుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పులే అధికంగా(60 శాతం) జరుగుతుండగా.. ఇంకా.. 80 నుంచి 90 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది.
85 శాతం సహజ కాన్పులకు ప్రోత్సాహకాలు
ప్రభుత్వాసుపత్రుల్లో 85 శాతానికి మించి సాధారణ కాన్పులు చేసిన తరువాత ప్రతీ కాన్పుకు ప్రోత్సాహం అందజేస్తారు. వైద్యుడు, స్టాఫ్ నర్సుకు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున, ఆయా, పారిశుధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్ఎంకు రూ. 250, ఆశ కార్యకర్తకు రూ.250 చొప్పున అందజేస్తారు. గత ఏడాది ప్రైవేటు ఆసుపత్రుల్లో 413(6.76 శాతం) సాధారణ కాన్పులు, 5,695 (93.24 శాతం) సిజేరియన్లు, ఈ ఏడాది ఇప్పటివరకు 205(13.87 శాతం) సాధారణ కాన్పులు జరుగగా, 1273 (86.13 శాతం) సిజేరియన్లు చేయించుకున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ఏడాది 2,774(55.98 శాతం) సాధారణ కాన్పులు జరుగగా, 2,181 (44.02 శాతం) సిజేరియన్లు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 845(48.37 శాతం) సాధారణ కాన్పులు, 902 (51.63 శాతం) సిజేరియన్లు అయ్యాయి. సాధారణ కాన్పులు పెంచడం కోసమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేయాలని నిర్ణయించింది.
ప్రత్యేక ప్రణాళికతో ముందుకు..
సాధారణ కాన్పుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. దీనిపై ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. సాధారణ కాన్పుల వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టేందుకు సాధ్యమవుతుంది. తద్వారా బిడ్డ ఎదుగుదల, తల్లీ ఆరోగ్యం బాగుంటుంది. సాధారణ పనులు చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల