బీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో భూములు కొనుగోలు చేస్తే.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమావంటి స్కీంలు వర్తిస్తాయని భావించి వలస వచ్చి స్థిరపడిపోతున్నారు. ఈ నాలుగైదేళ్లలో సరిహద్దు గ్రామాల్లో 60 ఎకరాల దాకా కొనిపెట్టుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు చేసిందేమీ లేదని, సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్,
కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్ 09 : తెలంగాణ, మహారాష్ట్ర.. ఇవి పక్క పక్కనే ఉన్న రాష్ర్టాలు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలు రైతును రాజును చేస్తున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిరూపించుకుంటున్నది.
కానీ, పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. అక్కడి రైతులను పట్టించుకునేవారు లేకపోవడంతో భూములన్నీ బీడువారుతున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర ప్రజలు, రైతులు కేసీఆర్లాంటి పాలనను కోరుకుంటున్నారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను పొందేందుకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రైతులు వచ్చి వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఈ నాలుగైదేళ్లలో అనేక మంది మహారాష్ట్ర రైతులు ఆసిఫాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారు. కెరమెరి మండలం బోలాపటార్, గౌరి, నారాయణగూడ గ్రామాల్లో సుమారు 20 మంది రైతులు 50 నుంచి 60 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ భూములు కొనుగోలు చేసి ఇక్కడే నివాసముంటే రైతు సంక్షేమ పథకాలు పొందడంతో పాటు పింఛన్లు సైతం అందుకోవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని కెరమెరి, వాంకిడి ఏజెన్సీ ప్రాంతాల్లో మహారాష్ట్రకు చెందిన గిరిజనులు ఇక్కడి గిరిజనుల వద్ద భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన గిరిజన రైతులు ఇక్కడికి వచ్చి భూములు కొంటున్నరు. ఈ ఐదారేళ్లలో సుమారు 20 మంది 50 నుంచి 60 ఎకరాల దాకా కొనుక్కున్నరు. వీరికి పట్టాలు ఇంకా కాలేదు. వీరికి పట్టాలు అయితే తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్వంటి పథకాలు వస్తయని వాళ్ల ఆశ. రైతులే కాదు.. వేరే వాళ్లు కూడా ఇక్కడికి వలస వచ్చి బతుకుతున్నరు. ఇక్కడే స్థిరపడి పోతున్నరు.
– సూర్యవంశీ పరమేశ్వర్,
మాది మహారాష్ట్రలోని కుంభఝరి గ్రామం. నేను, మా బంధువులు ఐదారేళ్ల కింద బోలాపటార్లో 9 ఎకరాలు తీస్కున్నం. ఇక్కడ భూములుంటే మాకు రైతుబంధు, రైతు బీమా పథకాలు వస్తాయనుకుంటున్నం. మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు లేవు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన మస్తు మంచిగున్నది. ఇంతవరకైతే పట్టాలు రాలే. తొందరగా పట్టాలిస్తే బాగుంటుంది.
– పవార్ తుకారం, రైతు, మహారాష్ట్ర