ఎదులాపురం, మార్చి 3 : పోలీస్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి సూచించారు. శిక్షణలో పాల్గొనే అభ్యర్థులతో స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్స్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇంతకుముందు అధిక సంఖ్యలో జిల్లా అభ్యర్థులే పోలీస్ ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణలో 200 మంది అభ్యర్థులు మెరిట్ ప్రకారం వచ్చినవారు ఉన్నారన్నారు. మిగిలిన 50 మంది పోలీస్ చిల్డ్రన్స్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ ఓకే రకమైన శిక్షణ ఉంటుందన్నారు. అందరూ కష్టపడి చదివి ఎక్కు ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు శిక్షణ ఉంటుందని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇస్తారని చెప్పారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బోధనా సిబ్బంది ద్వారా పాఠ్యాంశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, బీ వినోద్ కుమార్, డీటీసీ సమయ్జాన్రావు, ఆర్ఐలు డీ వెంకటి, జీ వేణు, వంశీకృష్ణ, ఎంటీవో శ్రీపాల్, సిబ్బంది మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిషేదమని పేర్కొన్నారు. డీఎస్పీ గానీ ఆపై అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, అధిక శబ్దం కలిగించే పరికరాలు పూర్తిగా నిషేదించినట్లు చెప్పారు. ఎవరు ఉల్లంఘించినా 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ప్రార్థనా స్థలాలు, అంత్యక్రియల ఊరేగింపులకు విధి నిర్వహణలో ఉన్న హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులను నిబంధనలు నుంచి మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణం దృష్ట్యా, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ నిఘా అధికారులు, టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు ప్రతి మండల కేంద్రంలో నిఘా కొనసాగిస్తూ ఆకస్మిక దాడులు చేపట్టి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.