మంచిర్యాలలో రూ.1.25 కోట్లతో నిర్మించిన టీ-డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ హబ్ ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. రెండు అంతస్థుల్లో కార్పొరేట్కు దీటుగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయగా, 134 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వీలుంది. ఇప్పటికే రేడియోగ్రాఫర్, పాథలజిస్ట్, మైక్రోబయోలజిస్ట్, ల్యాబ్ మేనేజర్ తదితర సిబ్బంది విధుల్లో చేరగా, రేడియాలజిస్ట్, బయోకెమిస్ట్ రావాల్సి ఉంది. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే దివాకర్రావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించనుండగా, వైద్య సిబ్బంది అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నది.
– మంచిర్యాల ఏసీసీ, జూన్ 25
మంచిర్యాల ఏసీసీ, జూన్ 25 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్రోడ్డులో సఖీ కేంద్రం పక్కన రూ.1.25 కోట్లతో నిర్మించిన టీ-డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గతేడాది మార్చి 4న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా, యంత్రాంగం శరవేగంగా పనులు పూర్తి చేసింది. త్వరలో మంత్రి హరీశ్రావు ఆన్లైన్ వేదికగా ప్రారంభించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
రెండు అంతస్థుల్లో ఏర్పాటు
టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ను రెండు అంతస్థుల్లోని 17 గదుల్లో ఏర్పాటు చేశారు. ఇందులో మైక్రోబయోలజీ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, పాథలజీ ల్యాబ్, డ్రైస్టోర్, కోల్డ్ స్టోర్, కన్సల్టెంట్ రూం, రేడియాలజిస్టు రూం, టూడీ ఈకో, ఈసీజీ, ల్యాబ్ మేనేజర్ రూం, యూఎస్జీ, సీఆర్ రూం, సీటీ స్కాన్, ఎక్స్రే, మమ్మోగ్రఫీ రూం, కన్సోల్ రూం, స్టోర్ రూంలను ఏర్పాటు చేశారు.
సిబ్బంది నియామకం పూర్తి
నూతనంగా ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లో సిబ్బంది నియామకం పూర్తయ్యింది. రేడియోగ్రాఫర్, పాథలజిస్ట్, మైక్రోబయోలజిస్ట్, ల్యాబ్ మేనేజర్.. తదితర సిబ్బంది ఇప్పటికే విధుల్లో చేరారు. రేడియాలజిస్ట్, బయోకెమిస్ట్ రావాల్సి ఉంది.
134 రకాల పరీక్షలు..
టీ-డయాగ్నోస్టిక్ అందుబాటులోకి వస్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హెచ్చీ 1 ఏసీ, బ్లడ్ గ్రూప్, లిపిడ్ ప్రొఫైల్, డెంగీ, లివర్ ఫంక్షన్ ,క్యాన్సర్, టీబీ, ఐజీఎం ఫర్ హెపటైటిస్-ఏ, ఐజీఎం ఫర్ హెపటైటిస్-ఈ, విటమిన్-బీ12, విటమిన్డీ, బోన్ మేరో ఎగ్జామినేషన్, ఫంగల్ కల్చర్, బ్లడ్ యూరిన్ కల్చర్, హిస్టోఫెథాలజీ, హ్యూమన్ పాపిలోమవైరస్ (హెచ్ పీపీ), టెస్ట్ ఫర్ డ్రగ్ ఓవర్ డోస్, సీడీ-4 కౌంట్, పాప్ స్మియర్, చికెన్ గున్యా, డిప్తీరియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అవయవ పనితీరు, థైరాయిడ్, క్యాల్షియం, సిరమ్ క్రియోటిన్, డీహెచ్టీఎల్, ఎలోక్టోరైట్స్, హెచ్బీఎస్హెచ్జీ తదితర విలువైన వైద్య పరీక్షలతో పాటు ఖర్చుతో కూడుకున్న సిటీస్కాన్, టూడీకో, అల్ట్రాసౌండ్, మ్యామోగ్రఫీలాంటి స్కానింగ్లతో పాటు గర్భిణులు, పిల్లలకు సంబంధించిన పరీక్షలు కూడా ఇక్కడ అందనున్నాయి.
పరీక్షలు ఉచితం..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ సెంటర్లో నిర్వహించే ప్రతి పరీక్ష ఖర్చుతో కూడుకున్నదే. జ్వరం వచ్చి దవాఖానకు వెళ్తే సీబీపీ, ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, షుగర్లాంటి సాధారణ పరీక్షలకు రూ.2 వేల వరకు ఖర్చవుతుంది. అలాగే హెచ్బీఏ-2 పరీక్షకు రూ.600, థైరాయిడ్ టెస్ట్కు రూ.600, హైపటైటిస్కు రూ.400, విటమిన్కు రూ.1500, విటమిన్-డీ-2కు రూ.1000, ఫంగల్ కల్చర్కు రూ.1500, యూరిన్ కల్చర్కు రూ.1000, సిటీస్కాన్లో బ్రెస్ట్కు రూ.2వేలు, చెస్ట్కు రూ.4వేలు, అప్డామన్ స్కానింగ్కు రూ.6వేలు వరకు ప్రైవేట్ దవాఖానల్లో తీసుకుంటారు. ఇక గుండెకు సంబంధించిన టూడీకో పరీక్షకు రూ.2500, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్కు రూ.1000, మ్యామోగ్రఫీ పరీక్షకు రూ.3000ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలన్నీ టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లో పూర్తిగా ఉచితంగా చేయనున్నారు. వైద్యం భారంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా సేవలందిస్తూ అండగా నిలుస్తున్నది.
ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 పీహెచ్సీలు, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు బస్తీ దవాఖానలు, ప్రభుత్వ జనరల్ ఏరియా ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 121 ఉప కేంద్రాల్లో రక్త నమూనాలు అక్కడే సేకరిస్తారు. నాలుగు ప్రత్యేక కోల్డ్ వాహనాల ద్వారా జిల్లా కేంద్రంలోని టీ-డయాగ్నోస్టిక్ సెంటర్కు తరలించి రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తారు. అందుకు బయో కెమిస్ట్రీ, పాథలజిస్టు, మైక్రో బయోలజిస్ట్ ప్రతి రిపోర్టును పరిశీలిస్తారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా రోగి నుంచి సేకరించిన శాంపిల్కు ఒక ప్రత్యేక బార్ కోడ్ కేటాయిస్తారు. అందులో వారికి సంబంధించిన రక్త పరీక్షల వివరాలు, సెల్ నంబర్ను అటాచ్ చేస్తారు. పరీక్షల అనంతరం ఆ సెల్ నంబర్కు బ్లడ్ రిపోర్ట్ మెసేజ్ వెళ్తుంది. అనంతరం మాన్యువల్ రిపోర్టులు అవసరమున్న రోగులు తమ రక్త, మూత్ర నమూనాలు ఇచ్చిన కేంద్రాలకు వెళ్లి సంబంధిత వైద్యుడికి రిపోర్టును చూపించుకునే సదుపాయం కల్పించారు.
త్వరలో ప్రారంభం..
త్వరలో టీ-హబ్ కేంద్రాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆన్లైన్ వేదికగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ హరీశ్చంద్రా రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలోని లెక్షరర్ హాలులో టీ హబ్ ప్రారంభానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అక్కడ మంత్రి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు టీ హబ్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
అత్యాధునిక పరికరాలు..
పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగం గానే టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది.జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీ-హబ్లో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 134 రకాల పరీక్షలు చేసే వీలుంది.త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయి.
– డా.హరీశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన
ఉచితంగా వైద్యమందించడమే లక్ష్యం
పేదలకు పైసా ఖర్చులేకుండా వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో టీ-డయాగ్నోస్టిక్ సేవలు అత్యవ సరం. అందుకే రూ. 1.25 కోట్లతో మంచిర్యాలలో ఏర్పాటు చేశాం. త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కేంద్రంలో 134 రకాల పరీక్షలు చేసే వీలుంది. ఉచితంగా సేవలు అందిస్తారు. గతంలో ఇలాంటి సెంటర్లు హైదరాబాద్, వరంగల్లాంటి పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండేవి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్నారు.
– నడిపల్లి దివాకర్ రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల .