పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ముక్కు పచ్చలారని పదో తరగతి విద్యార్థులను పావుగా వాడుకోవడం దారుణమని ధ్వజమెత్తుతున్నారు. మానసిక వేదనకు గురిచేస్తూ.. మనసులు గాయపరచే విధంగా వ్యవహరించడం దారుణమని పేర్కొంటున్నారు. విద్యా వ్యవస్థను భారతీయ జనతా పార్టీ భ్రష్టు పట్టిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు విలువ తెలిసినోళ్లు ఇలా చేయరని, రాష్ట్ర సర్కారును బద్నాం చేసే కుట్రగా ఉండడం దారుణమన్నారు. పరీక్షలు అన్ని రద్దు చేస్తే విద్యార్థుల పరిస్థితి ఎంటని ఆందోళన చెందామని పేర్కొంటున్నారు. ఇటువంటి లీకేజీల ఆలోచన మరేవరికి రాకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అధికారం కోసమైతే ఇదంతా చేయాల్సిన అవసరం లేదని, దమ్ముంటే నేరుగా ఫైట్ చేయాలని తెలిపారు. బండి ఢిల్లీ లీడర్లా కాకుండా.. గల్లీ లీడర్లా వ్యవహరిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర సర్కారు గుర్తించబట్టే ఊపిరి పీల్చుకున్నామని, ఎగ్జామ్స్ వాయిదా వేయకపోవడంతో ఊరట చెందామని పేర్కొంటున్నారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ)
బండిపై ఫిర్యాదు..
నేరడిగొండ, ఏప్రిల్ 6 : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేరడిగొండ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, నాయకులతో కలిసి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు నమోదు చేయాలని కోరారు. జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక గల్లీ లీడర్గా వ్యవహరించడం సిగ్గు చేటని అన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ నల్ల అడెల్లు పాల్గొన్నారు.
ఆందోళన చెందాం..
దస్తురాబాద్, ఏప్రిల్ 6 : నా కొడుకు బోనగిరి భూమేశ్. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకొని, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నడు. ఇటీవలే వస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలతో ఆందోళన చెందా. లీకేజీ చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమే. ఈ బీజేపి నాయకులు చేస్తున్న కుట్రతో పరీక్ష రద్దు చేస్తే విద్యార్థులు మళ్లీ కష్టపడి చదివి రాయాలి. మళ్లీ ఎప్పుడు పెడుతరో అని గందరగోళం ఉంటది. ప్రశ్నపత్రాలు లీకేజీ చేస్తే ఏం వస్తది. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయకుండా పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించాలి.
– బోనగిరి తిరుపతి, విద్యార్థి తండ్రి, ఆకొండపేట, దస్తురాబాద్ మండలం.
భవిష్యత్తుతో ఆడుకోవద్దు..
ఉట్నూర్, ఏప్రిల్ 6 ః నేను ఉట్నూర్లో వ్యాపారం చేస్త. నా కూతురు పదో తరగతి పరీక్షలు రాస్తున్నది. ఈ పరీక్షలే భవిష్యత్తుకు తొలిమెట్టు. ఒకవైపు విద్యార్థులు భయపడుకుంటూ పరీక్షలు రాస్తుంటే.. మరోవైపు బీజేపోళ్లు పేపర్లు లీక్ చేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నరు. హిందీ ప్రశ్నపత్రం లీక్ చేసి మనోవేధనకు గురి చేస్తున్నరు. ఇలా గందరగోళానికి గురి చేయడం సమంజసజం కాదు. లీకేజీలో ఎవరున్నా శిక్షపడాలి. ఉద్యోగాలు రావాల్సిన వారు అవకాశాలు కోల్పోతారు. కావున ఎటువంటి రాజకీయనాయకులున్నా, ఉద్యోగులున్నా, పెద్దలున్నా రాజకీయాలు పక్కన పెట్టి చర్యలు తీసుకోవాలె.
– ఆకుల పోశన్న, వ్యాపారి, ఉట్నూర్
ప్రభుత్వం సత్వరమే స్పందించడం భేష్..
మా పాప సుభాష్ రేంగే. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర క్రాస్రోడ్డులోని సేయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నది. కౌఠ(బీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్షలు రాస్తున్నది. మొదటి రోజు తెలుగు పరీక్ష జరుగుతున్న సమయంలో వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని తెలియడంతో బయపడ్డాం. రాసిన పరీక్షతోపాటు మొత్తం పరీక్షలు రద్దయితే ఎట్లాని ఆందోళన చెందాం. రెండో రోజు కూడా మళ్లీ హిందీ పేపర్ లీకైందని వార్తలు రావడంతో ఏం జరుగుతుందోనని కలవర పడ్డాం. ప్రభుత్వం మాత్రం సకాలంలో స్పందించింది. లీకేజీ వ్యహారానికి సంబంధించిన వారిని పట్టుకుంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మూడు పేపర్లు అయిపోయాయి. మిగిలిన వాటిని కూడా పకడ్బందీగా నిర్వహిస్తే మా లాంటి పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు.
– సుభాష్ రేంగే, లఖంపూర్, నేరడిగొండ,ఆదిలాబాద్ జిల్లా
జీవితాలతో చెలగాటం సరికాదు..
పేపర్ లీకేజీ ఘటన బాధాకరం. రాజకీయాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడడం సిగ్గుచేటు. కష్టపడి చదివి రాసిన విద్యార్థికి, ఆ పరీక్ష రైద్దెందని తెలిస్తే ఆందోళనకు గురవుతాడు. ఈ ప్రభావం మిగతా పరీక్షలపై ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు కూడా అసహనానికి గురవుతారు. ఎవరో ఒకరిని బద్నాం చేయాలని రాష్ట్రంలో ఇలాంటి కుట్రలు అందరినీ ఆందోళనలో పడేస్తున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిసేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. కేంద్రాల పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు పారదర్శకంగా వ్యవహరించాలి. బంగారు భవిష్యత్ ఉన్న పిల్లల జీవితాలతో చెలగాటం సరికాదు. పదో తరగతిలో మంచి గ్రేడ్ సాధించాలని ప్రతి విద్యార్థి ఎంతో సాధన చేస్తాడు. ఇలా లీక్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. భవిష్యత్లో ఏ ఒక్కరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠిన చట్టాలు తేవాలి.
– హేమంత్ షిండే, టీఎస్యూటీఎఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు
కఠినంగా శిక్షించాలి..
దిలావర్పూర్, ఏప్రిల్ 6 ః నా కొడుకు నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సదువుతున్నడు. అక్కడనే పరీక్ష రాస్తున్నడు. మంగళారం పరీక్ష రాసినంక ఇంటికచ్చి బాపు హిందీ ప్రశ్నపత్రాలు బయటకచ్చినయని ఏడ్చుకుంటూ చెప్పిండు. రాత్రి వార్తలల్ల గూడా లీకు ఏనుక కుట్ర దాగున్నదని ఇన్న. యాడాదంతా సదువుకొని పరీక్షలు రాస్తున్న పోరగండ్లను ఇబ్బంది పెడుతున్నరని బాధపడ్డ. ఏం సాధిస్తరని మనోవేధన చెందిన. మా పోరడు రాత్రంగా ఏడ్చుకుంటూ ఉన్నడు. రాత్రంతా నిద్రపోలే. పొద్దుగాల పరీక్ష ఉంటదా? ప్రభుత్వం పరీక్షను రద్దు చేస్దదా అని ఆందోళన పడ్డా. మళ్లీ పరీక్ష రాసుడంటే ఎట్లాఅని ఆలోచనలో పడ్డా. తెల్లారీ పరీక్ష ఉన్నదని పోయిండు. పరీక్ష ఎట్ల రాసినవురా కొడుకా అని అడిగితె.. మొన్నటిదే భయం ఉన్నది బాపు అన్నడు. లీకుకు కారణమైనోళ్లను సర్కారు శిక్షించాలె. సర్కారోళ్లు ఎంటనే లీకు చేసినోళ్లను పట్టుకున్నరు. కష్టపడి సదువుకుంటున్న పోరగాండ్ల జీవితం ఖరాబు చేస్తునోళ్లను జీవితంల గుర్తుండేలా శిక్ష వేయాలి. – నర్సయ్య, లోలం, దిలావర్పూర్
బర్తరఫ్ చేయాలి..
బెల్లంపల్లి, ఏప్రిల్ 6 : బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పక్కా ప్లాన్ ప్రకారమే పదో తరగతి ప్రశ్నపత్రాన్ని లీక్ చేశాడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి ఎమ్మెల్యే బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంజయ్ను వెంటనే ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు గోసిక రమేశ్, భుక్యా రామునాయక్, నీలి కృష్ణ, షేక్ ఆస్మా, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సాజిద్, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
చదువులపై రాజకీయాలా..?
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 6: నేను డీసీఎం నడుపుతూ ఇద్దరు కొడుకులను సదివిస్తున్న. ఇప్పుడు నా రెండో కొడుకు పదో తరగతి పరీక్షలు రాస్తుండు. ఎంతో కష్టపడి చదివి ఈ పరీక్షలకు హాజరవుతున్నడు. కొందరు రాజకీయ నాయకులు తీరుతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నరు. పిల్లల భవిష్యత్ను ఆగం చేసేలా పేపర్లు లీక్ చేస్తున్నరు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని మా పిల్లల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ కూర్చోం. అమాయక విద్యార్థులను ఇబ్బంది పెట్టుడైతే సరికాదు. పిల్లలు పరీక్ష రాస్తున్నప్పుడే పేపర్ లీకైందని బయటకు చెప్పిన్రు. మేమైతే ఎంతో ఆందోళనకు గురయ్యాం. మా లాంటి తల్లిదండ్రులెందరో ఆవేదనకు గురైన్రు. అసలు ఒకింత పరీక్షలు రద్దు చేస్తరని భయమైంది. బీజేపీ నాయకుల తీరు సరికాదు. పిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసిన్రు. కోపాలు, పగలు ఉంటే ప్రభుత్వం మీద కొట్లాడాలె. గింత నీచబుద్ధి ఎందుకు.. పోలీసులు ఠక్కును స్పందించిన్రు. లేకుంటే ఇంకా కుట్రలు చేస్తనే ఉందురు. కారకులకు కఠినంగా శిక్ష పడాలె. పిల్లల భవిష్యత్తో ఆడుకున్నోళ్లకు తగిన శాస్తి జరగాలె. పోలీసులు కారకులను పట్టుకున్నమని చెప్పంగనే చాలా సంతోషమేసింది. ఇక టైం ప్రకారమే పరీక్షలు పెడతరని అనుకున్నం. గిట్ల పేపర్ లీక్ చేసేటోళ్లను ఇడిసిపెట్టోద్దు. ప్రజలకు మంచి చేస్తే లీడైర్లెతరు. గిట్ల పిల్లల సదువులు కరాబు చేసేటోళ్లు లీడర్లెట్లయితరు. ఇప్పటికైనా ప్రజలంతా కండ్లు తెరవాలె. వీళ్లు అభివృద్ధి పనులు చెయ్యరు. చేసేటోళ్లకు గిట్ల వంకరలు పెట్టి బద్నాం జెయ్యాలని చూస్తరు. మా పిల్లలు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు జెయ్యాలె.
– ఠాకూర్ రాజేంద్ర సింగ్
రద్దవుతాయని భయపడ్డాం..
మా పాప గంగాజీ అక్షయ. ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర క్రాస్రోడ్డులోని సేయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. మూడు కిలోమీటర్ల దూరంలోని కౌఠ(బీ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాస్తున్నది. వరుసగా రెండు పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో రావడంతో పరీక్షలన్నీ రద్దవుతాయని భయపడ్డాం. యేడాది కాలం చదివిన చదువు వృథా అవుతుందేమోనని ఆందోళన చెందాం. ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఊపిరి పీల్చుకున్నాం. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం గతంలో కంటే భిన్నంగా కనిపిస్తున్నది. కొంత మంది కావాలనే ఈ పని చేస్తున్నట్లుగా జరిగిన ఘటనలను బట్టి అర్థమవుతున్నది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దు.
– గంగాజీ వంశీ, బోథ్, ఆదిలాబాద్ జిల్లా