కాగజ్నగర్, మే 25: నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. శనివారం కాగజ్నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్లో ఎరువులు, విత్తనాల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగుల మందులను అరికట్టేందుకు పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందంతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన విత్తనాల దుకాణాల్లోనే విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేయాలన్నారు. బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయిస్తే వెంటనే పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డీలర్లు షాపుల ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టిక, లైసెన్స్ వివరాలతో బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి కృష్ణారెడ్డి, కాగజ్నగర్ ఆర్డీవో సురేశ్కుమార్, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.