ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 4 : ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో దియాలిబాయి లాల్ చంద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ దయానంద్ గౌరీ, సభ్యులు మీరా గౌరీ సౌజన్యంతో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్-హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పాటు మెగా న్యాయ అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఉద్యోగుల కోసం వీటిని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి జిల్లా న్యాయమూర్తి ఎంవీ రమేశ్, జిల్లా కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్ కుమార్, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం క్యాన్సర్ ముప్పును ఎదురొంటున్నదని, ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారణ జరిగితే వెంటనే చికిత్స తీసుకొని అరికట్టవచ్చని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా చట్టాలపై కూడా అవగాహన కల్పించారు. కలెక్టర్ హేమంత్ మాట్లాడుతూ ఈ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని శాలువాతో సన్మానించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ జూనియర్ సివిల్ జడ్జి లు యువరాజ్, అజయ్, జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, అదనపు ఎస్పీ అచ్వేశ్వరరావు, ఆసిఫాబాద్, సిర్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్, న్యాయవాదులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.