ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/కడెం, జనవరి 13: మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో మత్స్యకారులు పారిశ్రామిక సంఘంగా ఏర్పడి యూనిట్గా దూర ప్రాంతాల నుంచి చేపపిల్లలను కొనుగోలు చేసుకుంటూ జీవనం సాగించేవారు. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక, తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఏటా వానకాలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు నిండినా గత ప్రభుత్వాల సహకారం లేక చేప పిల్లలను పెంచలేని పరిస్థితి ఉండేది. దీంతో కుటుంబాల పోషణ కోసం వివిధ జిల్లాలు, పట్టణాల్లో కూలీలుగా పనిచేస్తూ ఉపాధి పొందేవారు. సమైక్య రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలకు 50 శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేసేవారు. కేవలం రూ.25వేల యూనిట్ను 50శాతం సబ్సిడీపై రూ.12500కు ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నది. ప్రతి ఏడాది జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేస్తూ, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, గరిష్ఠ నీటి మట్టానికి చేర గా, చెరువులు నిండుకుండలా మారాయి. దీంతో ఈ ఏడాది చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపల పెంపకం చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులతో పాటు 284 చెరువుల్లో 1.28 కోట్ల చేప పిల్లలను మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో 70 మత్స్యకార సంఘాలు ఉండగా, 4200 మంది సభ్యులు ఉన్నారు. చెరువుల్లో నీటి లభ్యత, చేప పిల్లల పెరుగుదలకు అనుగుణంగా కట్ల, రోహు, మృగాల వంటి చేప పిల్లలు వదిలారు. చెరువుల్లో 35-40 ఎంఎం, ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం చేప పిల్లలను వేశారు. సెప్టెంబరు రెండోవారంలో చేపల పంపిణీ ప్రారంభించి లక్ష్యాన్ని పూర్తి చేశా రు. చేపల పెంపకాన్ని పారదర్శకంగా చేపట్టడానికి అధికారులు జీపీఎస్ విధానం అమలు చేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 214 మత్స్యకార సొసైటీలు ఉండగా, 12617 మంది సభ్యులు న్నారు. కాగా, జిల్లాలో 641 చెరువులు ఉన్నాయి. ఇందులో 556 కాలానుగుణ చెరువులు కాగా, 80 శాశ్వత చెరువులు ఉన్నాయి. కాగా, ఇందులో 481 కాలానుగుణ చెరువుల్లో 40.44 లక్షలు, 40 శాశ్వత చెరువుల్లో 2.23 కోట్లు పిల్లల విడుదల చేశారు. 5 రిజర్వాయర్లలో ఇప్పటి వరకు 88.38 లక్షలు విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు చెరువులు, ప్రాజెక్టుల్లో 3.52కోట్లు చేపపిల్లలను విడుదల చేశారు. ఇందులో కడెంలో 15,29,983, ఎస్సారెస్పీలో 39,10,639, స్వర్ణలో 2,54,011, సుద్దవాగులో 27,15,857, గడ్డెన్న వాగులో 4,28,000, మిగతా చెరువుల్లో 2.64 కోట్ల చేప పిల్లలు వదిలారు.
కడెం జలాశయమే కీలకం
కడెం జలాశయం పరిధిలో రెండు సొసైటీలు ఉన్నాయి. వీటి పరిధిలోని మత్స్యకారులు కడెం ప్రాజెక్టులో చేపల వేట సాగిస్తూ ఉపాధి పొందుతారు. ఈ ఏడాది సైతం కడెం ప్రాజెక్టులో 18 లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో రెండు విడుతల వారీగా సగం లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ జలాశయం పరిధిలో కడెంతో పాటు, పెద్దూర్, చుట్టు పక్కల గ్రామాల మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. అయితే కడెం, పెద్దూర్ గ్రామాలు కలిపి మత్స్య పారిశ్రామిక సొసైటీని ఏర్పాటు చేసుకొని గత కొన్నేళ్లుగా వారు ఉపాధి పొందుతున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూట జలాశయానికి వెళ్లి వీరు వేట సాగిస్తారు. పట్టుకొచ్చిన చేపలను సొసైటీ ద్వారానే అమ్ముకుంటారు. ఈ సొసైటీ పరిధిలో 200 కుటుంబాలున్నాయి. వారందరికీ జలాశయమే ప్రధాన జీవనాధారం. కడెం, పెద్దూర్ సొసైటీతో పాటు, ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో కూడా మత్స్యకారుల సొసైటీ ఉంది. ఇక్కడ వదిలిన చేప లు జలాశయం అంతట విస్తరించి తిరుగుతాయి. దీంతో కడెం సొసైటీతో పాటు, బీర్నంది మత్స్యకారులకు కూడా ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో విడుదల చేసిన చేప పిల్లలు ఆరు నెలల్లో కిలో, ఏడాదిలో 2కిలోల బరువు పెరుగుతాయి. అయితే ఏటా ఇలా చేపలను వదలడం వల్ల మత్స్యకారులకు ఉపాధి దొరుకుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోకులవృత్తులకు ఆసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఒక్కోటి దిగ్విజయంగా అమలవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47 సొసైటీలు ఉండగా, 2450 మంది సభ్యులు ఉన్నారు. ఈ యేడాది 270 చెరువులతో పాటు 4 ప్రాజెక్టుల్లో 1.37 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాలో 105 సొసైటీలు ఉండగా, 6266 మంది సభ్యులు ఉన్నారు. 384 చెరువులతో పాటు 6 రిజర్వాయర్లలో 2.20 కోట్ల చేప పిల్లలను వదిలారు.