రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే బతుకులు. గిరాకీ కాకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి. ఒక్క రూపాయి ఖర్చు చేయాలంటే వంద సార్లు ఆలోచించే విధానం. వారికి బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల మీద ఆధార పడుతున్నారు. పొద్దంత కష్టపడితే వడ్డీ వ్యాపారులకు చెల్లించగా మిగిలేది అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో వీధి వ్యాపారులకు సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) ద్వారా గతేడాది ఒక్కో వ్యాపారికి రూ.10 వేల రుణం ఇచ్చింది. సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడుతగా రూ.20 వేలు, మూడో విడుతగా రూ.50 వేలు ఇచ్చారు. ఇలా రుణాలను తీసుకోవడంలోనూ, తిరిగి చెల్లించడంలోనూ వ్యాపారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. లోన్స్ ఎంతో ఆసరా అవుతున్నాయని, వ్యాపారాభివృద్ధికి దోహదపడుతున్నాయని వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాలలో ఏడు, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రెండు, నిర్మల్ జిల్లాలో మూడు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని వీధి వ్యాపారులు బిజినెస్ చేసుకోవడానికి సర్కారు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలు అందించింది. 12 బల్దియాల్లో 33,173 మందికి రూ.33.13 కోట్లు రుణంగా ఇచ్చింది. ఈ యేడాది రూ.20 వేల చొప్పున ఇప్పటివరకు 13,038 మందికి రూ.20.07 కోట్లు రుణంగా అందించింది.
రెండో విడుతలో రూ.20 వేల రుణం ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. ఈ లోన్ రీ పేమెంట్లు చేశాక మూడో విడుత కింద రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నారని తెలిసి వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో కొందరు రూ.50 వేల రుణాలు అందుకున్నారు. గత మూడు దఫాలుగా ఈ రుణాలు తమ వ్యాపారానికి ఎంతగానో ఆసరా అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనే నంబర్-1 తెలంగాణ..
దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అమల్లోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ర్టాల కంటే ఎక్కువ రుణాలు ఇవ్వడంలో ముందుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,64,428 మంది వీధి వ్యాపారులను రుణాల కోసం ఎంపిక చేసి రూ.364.42 కోట్లు విడుదల చేసింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలోనూ తెలంగాణ సత్తా చాటుతున్నది. తొలి విడుతలో రుణాలు తీసుకున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా తిరిగి చెల్లించారు. మిగిలిన వారు త్వరలోనే చెల్లించనున్నారు. ఇలా రీ-పేమెంట్ చేసిన వారికి ఇప్పుడు రూ.20 వేల రుణాలు ఇస్తున్నారు. రెండో విడుతగా 13 వేల మందికిపైగా రుణాలు ఇవ్వగా, మరో 10 వేల మంది రుణం పొందేందుకు చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్లు అప్రూవ్ అయ్యాయి.
వడ్డీ వేధింపులకు చెక్..
యేడాది క్రితం వరకు వీధి వ్యాపారులు చేతిలో డబ్బులేక వ్యాపారం చేసుకోడానికి తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. గ్యారంటీ లేని వ్యాపారం పేరిట వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించేవి. దీంతో అధిక వడ్డీకి అప్పు తెచ్చుకునేవారు. రోజు లెక్కన ఉదయం వడ్డీకి అప్పు తెచ్చుకొని వ్యాపారం చేసి సాయంత్రం వడ్డీతో కలిసి చెల్లించేవారు. ఉదాహరణకు రూ.1000 అప్పుగా తీసుకుంటే రూ.100 కట్ చేసుకొని రూ.900 ఇస్తారు. సాయంత్రం వ్యాపారం అయిపోయాక రూ.1000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే పడిన కష్టం మొత్తం వడ్డీ వ్యాపారుల జేబుల్లోకి పోగా, తినేందుకు మాత్రమే డబ్బులు మిగిలేవి. ఈ రుణాల పుణ్యమా అని వీధి వ్యాపారులకు వడ్డీ వేధింపులు తగ్గాయి. బ్యాంక్ లింకేజీ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ లేని రుణాలే పెట్టుబడిగా ఉపయోగపడుతున్నాయి. బిజినెస్ సజావుగా నడిపించే వ్యాపారులకు మంచి ఆదాయం వస్తున్నది. విడుతల వారీగా ఇస్తున్న రుణాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది.
డిజిటల్ బాట పట్టిన వ్యాపారులు..
రుణాలు ఇవ్వడంతోపాటు వ్యాపారులను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రుణాలు తీసుకున్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ చేస్తే ప్రోత్సాహకంగా కొంత మొత్తాన్ని తిరిగి ఇస్తున్నది. రెండు వందల లావాదేవీలు చేస్తే రూ.100 నుంచి రూ.500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నది. ఈ క్యాష్ బ్యాక్ నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతున్నది. దీంతో క్యాష్ లెస్ లావాదేవీలకు అవకాశం పెరగడంతోపాటు చిన్న చిన్న షాపుల్లోనూ ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ట్రాన్జక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది వినియోగదారులకు కూడా ఉపయోగపడుతున్నది.
శ్రమ తగ్గింది.. ఆదాయం పెరిగింది
గతంలో వీధులు తిరుగుతూ కూరగాయలు విక్రయించేటోళ్లం. ప్రభుత్వం అందించిన సాయంతో ఇప్పుడు సొంతంగా షాపు పెట్టుకున్నం. శ్రమ తప్పడంతో పాటు సమయం కూడా మిగులుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 10 గంటల వరకు షాప్ తీస్తున్నం. గిరాకీ మంచిగనే అవుతుంది. ప్రభుత్వం సాయం అందించకపోతే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.
– కనుకుట్ల లక్ష్మి, ఎన్టీఆర్నగర్, కూరగాయల వ్యాపారి, మంచిర్యాల
సంతోషంగా ఉంది
నిర్మల్ అర్బన్, నవంబర్ 24 : ప్రభుత్వం అందించిన రూ. 10 వేలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు ప్రభుత్వం రుణం ఇచ్చి ఆదుకున్నది. నిర్మల్లో టైలరింగ్ నిర్వహిస్తున్న. 11 నెలల పాటు రుణాలు సక్రమంగా చెల్లించడంతో ప్రభుత్వం తిరిగి రూ. 20 వేలు ఇచ్చింది. మాలాంటి పేదలకు ప్రభుత్వం సాయమందించినందుకు సంతోషంగా ఉంది.
– స్రవంతి, టైలర్ యజమాని, నిర్మల్
నెల నెలా డబ్బులు కట్టిన
ఎదులాపురం, నవంబర్ 24 : నేను చాలా ఏండ్ల సంది గాంధీచౌక్ల గీ పండ్ల వ్యాపారం చేస్తున్న. ఒక్కోసారి పైసలు దొరకక మస్తు పరేషాన్ అయ్యేది. సర్కారోళ్లు రూ. 10 వేల లోను ఇచ్చిన్రు. వ్యాపారం కోసం తీసుకున్న. నెలనెలా వాయిదాలు కట్టిన. వడ్డీల రాయితీ కూడా ఇచ్చిన్రు. పూర్తిగా కట్టినంక మళ్లా రూ. 20 వేలు ఇచ్చిన్రు. అవ్వి కూడా వాయిదా ప్రకారం చెల్లిస్తున్న. సర్కారు వీధి వ్యాపారులకు గిట్ల సాయం చేసుడుతోని మా అసొంటోళ్ల వ్యాపారాలు మంచిగున్నయి. – మస్తక్, పండ్ల వ్యాపారీ, గాంధీచౌక్, ఆదిలాబాద్
పెట్టుబడికి రందిలేదు..
నేను చాలా ఏండ్లుగా మంచిర్యాలలో అల్లం, వెల్లుల్లి, మసాలాల షాప్ నడిపిస్తున్నా. ప్రభుత్వం అందించిన సాయంతో సరుకులు కొని తెచ్చుకొని వ్యాపారం చేస్తున్న. పెట్టుబడికి రంది లేకుంటైంది. బయట ఎవరినీ రూపాయి అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. నా లాంటి చిరువ్యాపారికి లోన్ మంజూరు చేసినందుకు ఆనందంగా ఉంది. మొత్తం డబ్బులు కట్టి మరో రూ.50 వేల లోన్ తీసుకుంటా. వ్యాపారాన్ని మరింత పెంచుకుంటా.
– ఎలుక సత్తయ్య, అల్లం, వెల్లిపాయలు, మసాలాల షాప్, మంచిర్యాల
ఆపద సమయంలో సర్కారు ఆదుకున్నది
కాగజ్నగర్, నవంబర్ 24 : ప్రభుత్వం వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడం బాగుంది. కరోనా విజృంభించిన తరుణంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆ సమయంలో ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆదుకున్నది. మొదట రూ.10 వేలు, రెండోసారి రూ.20 వేల రుణం తీసుకున్న. నెల నెలా కిస్తీలు కట్టిన. మొత్తం బాకీ తేరింది. మరో రూ.50 వేలు తీసుకోవాలనుకుంటున్న. నా టీస్టాల్ను మరింత అభివృద్ధి చేసుకుంట.
– బైరి వాసు, టీ స్టాల్ యజమాని, కాగజ్నగర్
రుణపడి ఉంటా..
కాగజ్నగర్, నవంబర్ 24 : ప్రభుత్వం అందించిన రుణంతో వ్యాపారం చేసుకుంటున్న. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొదట రూ.10 వేలు ఇచ్చిన్రు. ఆ తర్వాత మళ్లా రూ.20 వేలు తీసుకున్న. కిరాణం నడిపిస్తున్న. అప్పు తీరుతుంది. మళ్లా రూ. 50 వేల రుణం తీసుకొని మరింత సామాను తెచ్చి పెట్టుకుంట. ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రుణం ఇచ్చి ఆదుకున్న సర్కారుకు రుణపడి ఉంటా.
– జాడి వెంకటేశ్, కిరాణ దుకాణం, కాగజ్నగర్