మంచిర్యాల అర్బన్, జనవరి 13 : బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 20వ తేదీలోగా రేషన్ దుకాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, ఈ నెలాఖరులోగా తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 423 దుకాణాల్లో అధికారులు తనిఖీ చేపట్టనున్నారు. దుకాణం బోర్డుపై పేరున్న వ్యక్తే నడిపిస్తున్నాడా.. లేక వేరే వ్యక్తికి అప్పగించారా.. డీలర్ మృతి చెందిన చోట ఆయన కుటుంబ సభ్యులు కాకుండా వేరేవారెవరైనా నడిపిస్తున్నారా.. అన్న అంశాలపై సర్వే చేయనున్నారు.
కొందరు రేషన్ డీలర్లు ఇతర పనులు చేసుకుంటుండగా, మరికొందరు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళలకు ఉపాధి మార్గం చూపించాలనే ఉద్దేశంతో జిల్లాలో అనేక మందికి డీలర్ షాపులు మంజూరు చేశారు. ఎవరికి కేటాయించారో వారే దుకాణంలో ఉంటూ నిత్యావసరాలు ప్రజలకు విక్రయించాల్సి ఉండగా, ఎక్కడా మహిళా డీలర్లు షాపుల్లో ఉంటున్న దాఖలాలు లేవు. అనేక గ్రామాల్లో యువతుల పేర్లపై రేషన్ దుకాణాలు తీసుకున్నారు. వారు వివాహాలు చేసుకొని వెళ్లిపోవడంతో ఆయా దుకాణాలను ఇతరులకు అప్పగించారు. అధికారులు నేరుగా రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి చూడడమేగాకుండా ప్రతి నెలా రేషన్ ఎవరు పోస్తున్నారు. ఎవరు నడిపిస్తున్నారు.. ఈ-పాస్ యంత్రాల్లో ఎంత మంది వేలిముద్రలు మారాయి.. ఎవరి ఖాతాల్లోకి కమీషన్ డబ్బులు వెళ్తున్నాయి.. అనే అంశాలను పక్కాగా పరిశీలిస్తేనే బినామీలు ఎవరనేది తెలిసే అవకాశముంది.
చౌకధరల దుకాణాల్లో రేషన్ పోసేందుకు డీలర్లతో పాటు వారి కుటుంబంలో మరో ఇద్దరికి మాత్రమే ఈ – పాస్ మిషన్లో తంబ్ వేసే అవకాశం కల్పించారు. ఒకవేళ డీలర్ అందుబాటులో లేకుంటే ఆయన స్థానంలో వేలిముద్ర వేసి రేషన్ పంపిణీ చేసుకునే వెసలుబాటు కల్పించారు. కానీ కొన్నిచోట్ల రేషన్ దుకాణాల బాధ్యతలను ఇన్చార్జిలకు అప్పగిస్తే.. వారు బినామీలకు అప్పగించారు. తహశీల్దార్ కార్యాలయాల సిబ్బందికి వేలిముద్రలు మార్చే అధికారం ఉంది.
దీంతో ఎవరికి కావాలంటే వారికి వేలిముద్రలు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ. 140 చొప్పున డీలర్ల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా కొందరు బినామీ డీలర్లుగా అవతారం ఎత్తడమేగాకుండా వారి బ్యాంకు ఖాతాలను పౌరసరఫరాల శాఖ వద్ద నమోదు చేయించుకున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ డబ్బులు నేరుగా బినామీల ఖాతాల్లోనే జమవుతున్నాయి. కాగా, అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయం బయటకు పొక్కడంతో సదరు డీలర్లు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు పక్కాగా సర్వే చేయాల్సిన అవసరముంది.
రేషన్ దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. బినామీ డీలర్లు ఉన్నట్లు గుర్తిస్తే అక్కడికక్కడే కేసులు నమోదు చేయాలని సూచించాం. వాస్తవ డీలర్ను సైతం తొలగించాలని ఆదేశించాం. ఈ నెల 20వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలి. తహసీల్దార్లు, ఆర్డీవోలు ఇచ్చే తుది నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తాం.
– వాజీద్ ఆలీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మంచిర్యాల