కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వాగులు.. వంకల నుంచి వృథాగా పోతున్న నీటిని పంటలకు మళ్లించే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు చెక్ డ్యామ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ. 22.19 కోట్లతో 6 చెక్ డ్యామ్లు నిర్మించగా, 785 ఎకరా లకు సాగునీరందుతున్నది. అలాగే రెండేళ్ల క్రితం మరో రూ.126.70 కోట్లతో 36 చెక్డ్యామ్ల నిర్మాణం ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 11 చెక్డ్యామ్లు దాదాపు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణం లో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 700 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. ఇటీవల ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3 చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ. 971.00 లక్షలు, సిర్పూర్ నియోజకవర్గంలో 4 చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.1278.50 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు.
యాసంగి పంటలకు వరంగా..
చెక్డ్యామ్ల నిర్మాణాలు యాసంగి పంటలకు వరంగా మారుతున్నాయి. రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకొని వాగుల్లోని నీటిని యాసంగి పంటలకు అందిస్తున్నారు. చెక్డ్యామ్ల నిర్మాణాలతో
సర్కారుకు రుణపడి ఉంటం..
ఇది వరకు వాగులో నీరంతా వృథాగా పోయేది. ఒక్క వానకాలం పంటే వేసేటోళ్లం. చెక్డ్యామ్ నిర్మించినప్పటి నుంచి యేటా రెండు పంటలు సాగు చేస్తున్నం. వాగులో మార్చి, ఏప్రిల్ నెలల వరకు కూడా నీరు ఉంటుంది. చెక్డ్యామ్ నిర్మించి నీటిని పోలాలకు మళ్లించడం గొప్ప విషయం. భూగర్భ జలాలు పెరిగి బోర్లలో కూడా పుష్కలంగా నీళ్లుంటున్నయ్. ఇంత మంచి ఆలోచన చేసిన సర్కారుకు రుణపడి ఉంటాం.
-మహుర్లే బాపూజీ, నార్లపూర్, వాంకిడి
ఇది వరకు పట్టించుకున్నోళ్లు లేరు..
ఖమాన వాగులో వేసవిలో కూడా నీరు ఉంటుంది. చెక్డ్యామ్ నిర్మించక ముందు నీరంతా వృథాగా పోయి పెద్దవాగులో కలిసేది. చెక్డ్యామ్ నిర్మించినప్పటి నుంచి పంటలకు ఢోకా లేకుంటైంది. పుష్కలంగా నీరుంటుంది. మోటర్లు పెట్టుకొని యాసంగి పంటలకు వాడుకుంటున్నం. నేను ఈ సారి జొన్న పంట వేసిన. తెలంగాణ రాకముందు మా బాధలను పట్టించుకున్నోళ్లు లేరు. సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేసే పనులు చేస్తున్నడు.
– వాగుడురే బాపూజీ, నార్లపూర్, వాంకిడి