నస్పూర్, ఏప్రిల్ 10 : మండుతున్న ఎండల దృష్ట్యా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నీటి సరఫరా కోసం మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.
నీరు సరఫరా చేయలేని ప్రాంతాలను గుర్తించి వాటర్ ట్యాంకర్ల ద్వారా అందించాలన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు సంక్షేమంలో భాగంగా మండలానికి 1 చొప్పున కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7149 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా 6678 ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వడదెబ్బకు ప్రజలు గురి కాకుండా పలు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి పనులు చేపట్టే ప్రాంతాల్లో కూలీలకు నీడ, తాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్లు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించిన వడదెబ్బ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీఎంహెచ్వో సుబ్బారాయుడు, డీపీవో వెంకటేశ్వర్రావు, డీఈవో యాదయ్య, డీఆర్డీవో కిషన్, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్,ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర శాఖల కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాఠశాలల మరమ్మతులు, తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లాల్లో కేటాయించిన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వేసవి దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో మరమ్మతులు పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారావు, ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.