మరోసారి కేంద్ర ప్రభుత్వం కొవిడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పలు దేశాల్లో ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యశాఖకు ఇప్పటికే నియంత్రణ చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సంబంధిత యంత్రాంగం తగు ఏర్పాట్లలో నిమగ్నమైంది. దీనికి సంబంధించి రిమ్స్లో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించగా, అవసరమైన మేరకు ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. రిమ్స్లో 550, మిగతా చోట్ల మరో 20 బెడ్ల వరకు సిద్ధం చేసింది. ఇప్పటికే రెండు విడుతల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవగా, అర్హులైన వారికి బూస్టర్ డోస్ అందిస్తున్నది. ప్రజల అప్రమత్తత, అవగాహనతోనే కరోనాను నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
-ఆదిలాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పలు దేశాల్లో కరోనా మరోసారి తాండవం చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. కొవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్లోని రిమ్స్లో వైద్యాధికారులు మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. గతంలో రెండు విడుతల్లో పకడ్బందీ చర్యలు చేపట్టి, అడ్డుకట్ట వేసిన వైద్యశాఖ అధికారులు, మరోసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నివారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ర్యాపిడ్, పీపీఈ కిట్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్లు పంపిణీ చేయనుండగా, వ్యాధి తీవ్రతను బట్టి మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తరలిస్తారు. జిల్లాలో ఇప్పటికే రెండు విడుతల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, బూస్టర్ డోస్ ప్రక్రియ కొనసాగుతున్నది.
ముందస్తు ఏర్పాట్లు
కరోనా లక్షణాలు కనిపిస్తే, వారికి ముందుగా ర్యాపిడ్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే అవసరమైన సలహాలు ఇవ్వడంతో పాటు మందులను అందజేయనున్నారు. రిమ్స్లో ఐసొలేషన్ వార్డుతో పాటు 550 ఆక్సిజన్ బెడ్లు, బోథ్, ఉట్నూర్ కమ్యూనిటీ దవాఖానల్లో పదేసి మంచాలను అందుబాటులో ఉంచారు. రిమ్స్లో ఆక్సిజన్ తయారీ కేంద్రం అందేబాటులో ఉండగా, నిర్వహణపై పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కరోనా నివారణలో భాగంగా వైద్యశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా నివారణ ప్రణాళికలో భాగంగా అధికారులు, వైద్యులు, సిబ్బందికి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో కరోనా ప్రభావం అంతగా లేనప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 28: కరోనా కొత్త వేరియెంట్ మొదలైన నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ముందస్తుగా కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా వైద్య సిబ్బంది దృష్టి పెట్టారు. మంచిర్యాల దవాఖానలో ప్రస్తుతం 242 ఐసొలేషన్ పడకలు, 233 ఆక్సిజన్ సౌకర్యం, 160 ఐసీయూ పడకలు, 40 వెంటిలేటర్ సదుపాయం ఉన్న పడకలు అందుబాటులో ఉన్నాయి. కాగా 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 11,01,449 పరీక్షలు చేయగా, 57,297 పాజిటివ్ వచ్చాయి. ఇందులో 10,48,491 యాంటిజెన్ టెస్ట్లు కాగా, 52,839 మందికి పాజిటివ్ అని తేలింది. 52839 మందికి అర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, 4458 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో 57,092 మంది కోలుకున్నారు. ఇందులో 205 మంది మృతి చెందారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
విదేశాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవు తున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. కొత్త సంవత్సర వేడుకలను నిబంధనల మేరకు నిర్వహించుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకోని వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్ట్లు, వ్యాక్సిన్, మందులు పంపిణీ చేయడం జరుగుతుంది.
-నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వో, ఆదిలాబాద్
అప్రమత్తతే మందు
ప్రతి ఒక్కరూ మాస్క్ వాడుతూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. కొవిడ్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తప్పకుండా తీసుకోవాలి. విదేశాల్లో కరోనా మళ్లీ ప్రబలుతున్న దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 124, బెలంపల్లి ఏరియా, సింగరేణి ఏరియా దవాఖానలో 150బెడ్లు, ఆర్కేపీలో 30 బెడ్ల వరకు సిద్ధంగా ఉంచాం. ఆక్సిజన్, మానవ వనరులు, ఐసీయూ పడకలు, మందులు సిద్ధంగా ఉంచుకున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీలలో నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నాం. దగ్గు, జలుబు, తదితర సమస్యలు ఉంటే తప్పనిసరిగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
-డా.హరిచంద్రా రెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్