ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 19 : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా తుది జాబితా రూపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు.
ఈ నెల 20, 21 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నోటీసులు జారీ చేసి చనిపోయిన, వలస వెళ్లిన వారి వివరాలను తొలగిస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విధులు కేటాయించేందుకు సిబ్బంది వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఆర్డీవోలు కదం సురేష్, కాసబోయిన సురేశ్ పాల్గొన్నారు.