నిర్మల్, జనవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటివెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 19 మండలాలు, 396 పంచాయతీలు, 3 మున్సిపాలిటీల పరిధిలో కంటివెలుగు శిబిరాలు నిర్వహించేందుకు 32 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో రెండు బృందాలు రిజర్వులో ఉండగా, మిగతా 30 టీంలు నిత్యం 30 క్యాంపుల్లో పాల్గొంటాయన్నా రు. ఒక్కో బృందంలో మెడికల్ ఆఫీసర్తో పాటు ఆప్తాల్మజిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు హెల్త్ సూపర్వైజర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గు రు ఆశ వర్కర్లు ఉంటారని వివరించారు.
ప్రతీ టీం కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని కేటాయించామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,94,548 మంది జనాభా ఉండగా, 18 ఏళ్లు దాటిన వారు 5.47లక్షలు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. 16 పీహెచ్సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి ఏ రోజు శిబిరానికి రావాలి అనే విషయాలను ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఈ క్యాంపుల నిర్వహణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించామన్నారు. శిబిరాల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాత కళ్లద్దాలు అవసరమైన వారికి వారంలోగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆయా శిబిరాలు ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు కొనసాగుతాయని, సెలవు దినాలు కాకుండా మొత్త 100 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.
వైద్య సిబ్బంది ప్రతి రోజు ఉదయం 8 గంటల వరకు శిబిరాలకు చేరుకొని, 9 గంటలకు కంటి పరీక్షలు ప్రారంభిస్తారని చెప్పారు. ఒక్కో క్యాంపులో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకూ 300 మంది, పట్టణ ప్రాంతాల్లో400మందికి స్క్రీనింగ్ చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి చేరుకున్నాయని, వీటిని ఆయా బృందాలకు అందజేయనున్నట్లు వివరించారు. ఈ నెల 18న జిల్లా వ్యాప్తం గా 30 ప్రాంతాల్లో పండుగ వాతావరణంలో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఇతర ప్రజా ప్రతినిధులు కంటివెలుగు శిబిరాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శిబిరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కంటివెలుగు నిర్వహణ పై ఇప్పటికే పలు దఫాలుగా బృందాలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు జరిగే కంటివెలుగు శిబిరాల నిర్వహణపై ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్ పాల్గొన్నారు.
విజయవంతం చేద్దాం
ఈ నెల 18 నుంచి జిల్లాలో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేద్దామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో కంటి వెలుగు కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. ప్రతిరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య శిబిరాలు ఉంటాయని వివరించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించే పరికరాలతో అధికారులు అవగాహన కల్పించారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లకు కంటి పరీక్షలు చేశారు.
క్యాలెండర్ విడుదల
మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా శాఖ క్యాలెండర్ను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు విడుదల చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి అజీజ్, నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్గౌడ్, అమీర్ఖాన్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
అంధత్వ నివారణకే కంటి వెలుగు
అంధత్వాన్ని పూర్తి గా దూరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రెండో విడుత కంటి వెలుగును ప్రారంభిస్తున్నదని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడారు. ఇది వరకే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. అధికారులు, ప్రజాపత్రినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. అనంతరం రిటైర్డ్ ఆఫీసర్ దయాకర్ బిల్లు, సీసీలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయసారథి, డీఎంవో ఎం శ్రీధర్, డీటీసీవో మెట్పెల్లివార్ శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.