ఇచ్చోడ(సిరికొండ), మార్చి 20 : ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 400 మందికి వైద్యులు పరీక్షలు చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎస్పీకి ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో పోలీసులు నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి వచ్చిన వైద్యబృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదవాసీ యువత చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. విద్య, వ్యవసాయం వ్యాపారాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్ర రఘురాం, జడ్పీటీసీ చంద్రకళ, డాక్టర్ రవీందర్ రాథోడ్, ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐలు ఎం నైలు , ఐ సైదారావ్, ఎస్ఐలు డీ సునీల్, నీరేశ్, డాక్టర్లు దీపక్ పుష్కర్, వీణ పాల్గొన్నారు.