ఇచ్చోడ, జనవరి 28 : దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేరే రాష్ట్రం నుంచి దొంగతనం చేసే గ్యాంగ్ వచ్చినట్లు సమాచారం ఉందని, మూడు రోజుల క్రితం జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో దొంగతనం జరిగిందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయిందని వారిని గుర్తించామన్నారు.
బోథ్ మండలం పొచ్చెరలో ద్విచక్రవాహనాన్ని దొంగలించే క్రమంలో ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయిందని అవి వచ్చాయన్నారు. అలాగే ఇచ్చోడలో శుక్రవారం అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో దొంగలు చోరీకి యత్నించారని వెంటనే 100కు ఫోన్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగానే వారు అక్కడి నుంచి పారిపోయారన్నారు. మూడు రోజుల నుంచి పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన వెంట సీఐ నైలు, ఎస్ఐ నీరేశ్ ఉన్నారు.