ఎదులాపురం, ఆగస్టు 11 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 30 కేసులు నమోదు కాగా, ఆదిలాబాద్ డివిజన్లో 19, ఉట్నూర్లో 11 నమోదై విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు కేసుల వారీగా సంబంధించిన అంశాలను పోలీస్, రెవెన్యూ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీలు సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్త, శ్యామలాదేవి, ఆర్డీవోలు స్రవంతి, ఎల్ జీవాకర్రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్, నాగేందర్, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు సునీతా కుమారి, రాజలింగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు రాజేశ్వర్, ఐటీడీఏ ఏవో రాంబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.