ఉట్నూర్/ఇంద్రవెల్లి, జనవరి 24 : త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించిన గిరిజన దర్బార్కు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నాగోబా జాతర డేరాల కింద నిర్వహించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం రూపురేఖలు మారిపోయాయన్నారు. మెస్రం వంశీయులు రూ.ఐదు కోట్లతో గర్భగుడి పనులు ప్రారంభించారన్నారు. దేవాదాయ శాఖ నుంచి ఒకసారి రూ.50 లక్షలు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించామని, మళ్లీ రూ.50 లక్షలకు ప్రొసిడింగ్ అందజేశామన్నారు. త్వరలో ప్రభుత్వం తరఫున రూ.12.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దీంతో నాగోబా ఆలయ నిర్మాణ పనులు పూర్తయి వచ్చే జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్లో రూ.25 కోట్లతో మ్యూజియం, రూ.15 కోట్లతో రోడ్ల సౌకర్యం కల్పించామన్నారు.
యేటా గిరిజనులు నిర్వహించే దండారీ ఉత్సవాలకు గ్రామానికి రూ.10 వేల చొప్పున వెయ్యి గ్రూపులకు రూ.కోటి ఇస్తున్నామన్నారు. గిరిజన గ్రామాలకు త్రీఫేజ్, సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభించామన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆదివాసీ భవన్, బంజారా భవన్ నిర్మించి ఇచ్చామన్నారు. పది శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ, విద్యలో అవకాశాలు పెంచినట్లు తెలిపారు. ఉట్నూర్ లాంటి గిరిజన ప్రాంతంలో గల 30 పడకల దవాఖానను 100 పడకలకు పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. గతంలో ఏజెన్సీలో విషజ్వరాలతో ప్రబలి మరణాలు సంభవించేవని, ఇప్పుడు ఒక్క మరణం లేకుండా చేశామన్నారు. పల్లెల్లో పారిశుధ్యం, శ్మశాన వాటిక, హరితహారం, క్రీడా మైదానాలతో గ్రామాల రూపురేఖలు మార్చేశామన్నారు.
ఎంపీ ఎక్కడ?
గిరిజన ప్రాంతం నుంచి ఎంపీగా గెలుపొందిన సోయం బాపురావ్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు? ఏ మీటింగ్లలో పాల్గొనడం లేదని, గిరిజనుల సమస్యలు పరిష్కరించే ఇలాంటి దర్బార్లో కూడా పాల్గొనకపోతే ఎంపీ కనబడడం లేదని పేపర్లో వేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి రాజకీయాలే అవసరమని, గిరిజనుల కోసం చేసిందేమి లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
గిరిజనులకు వరం కేసీఆర్ : మంత్రి సత్యవతి
ఏజెన్సీలోని గిరిజనులకు కేసీఆర్ వరంలా దొరికాడని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని భావించిన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 90 గురుకులాలను 185కు పెంచి 60 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం డిగ్రీలో అగ్రికల్చర్ కోర్సును ప్రారంభిస్తామన్నారు. ‘మావ నాటే-మావ రా జ్’ కోసం పోరాడిన వీరుడు కుమ్రం భీం పోరాటాలను కేసీఆర్ గుర్తించా రన్నారు. అందుకే 146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గిరిజన సర్పంచ్లుగా వారికే పగ్గాలు అప్పజెప్పారన్నారు. దీంతో ‘మావ నాటే-మావ రాజ్’ పథకం అమలవుతుందన్నారు. ఆదివాసులు ఎక్కువగా ఉన్న ములుగు ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే కొంత ఫారెస్ట్ భూమి క్లియరెన్స్ ఇచ్చేందుకు కేంద్రం కాలయాపన చేస్తున్నదని విమర్శిం చారు. అదే ఆంధ్రప్రదేశ్లో రెండేండ్ల నుంచి తరగతులు ప్రారంభమయ్యా యన్నారు. ఇది కేంద్రం నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. పోడు భూముల ను వ్యవసాయ భూములుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు విద్య, వైద్య, యువతకు వ్యాపారాల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
పోటెత్తిన భక్తజనం
కేస్లాపూర్కు భక్తజనం పోటెత్తింది. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దారిపొడవునా వెలిసిన దుకాణాలు, హోటళ్లు, రంగులరాట్నాల వద్ద రద్దీ కనిపించింది. గోవాడ్లో మెస్రం వంశీయుల మహిళల ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. 22 పొయ్యిలపై సామూహిక వంటలు చేశారు. జొన్న గట్కా లడ్డూలను కితలవారీగా పంచుకున్నారు.
నాగోబాను దర్శించుకున్న మంత్రులు
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానా యక్, రాథోడ్ బాపురావ్, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్ధన్, కోవ లక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేశ్, అదనపు కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి ప్రజాదర్బార్కు హాజరయ్యారు. అనంతరం నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం నాగోబా ఫొటోలు బహూకరించారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలోని గోవాడ్ను మంత్రులు సందర్శించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేఖానా యక్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మెస్రం మహిళలతో కలిసి జొన్న గట్కా లడ్డూలను తయారు చేశారు.
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి..
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి వెంకట్రావ్ మాట్లాడుతూ.. గిరిజన పిల్లలు చదువుకునేందుకు గిరిజన యూనివర్సిటీ కావాలని, దీపావళి పండుగా పవిత్రమైనదని కావున సెలవులు పెంచాలని కోరారు. ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి మాట్లాడుతూ బీజేపీ గిరిజనులకు చేసిందేమి లేదన్నారు. ఎమ్మెల్సీలు విఠల్, సరోత్తం రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం మ్యూజియం ఏర్పాటు, వర్ధంతి నిర్వహణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు జల్, జంగల్, జమీన్ పథకం అమలు చేస్తుందన్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రెండేండ్లుగా కొవిడ్ కారణంగా నిలిచినప్పటికీ అధికారుల అండతో చాలా గొప్పగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ బందోబస్తు కల్పించడానికి హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి, విద్య, వైద్యానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, రాయి సెంటర్ సర్మేడి, నాయకులు, మెస్రం వంశీయులు, గిరిజనులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.