నిర్మల్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం.. తాజాగా ఎంపిక చేసిన పాఠశాలల్లో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించనున్నది. దీంతో పాఠశాలలపై కరెంట్ బిల్లులు చెల్లించే భారం తొలగనున్నది. పాఠశాలల విద్యుత్ అవసరాలు తీరగా.. అదనంగా సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే, దానిని విద్యుత్ సంస్థలకు విక్రయించే అవకాశం ఉంటుంది. నెట్ మీటరింగ్ విధానం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో 117 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రస్తుతం 16 మండలాల్లోని 31 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మిగతా పాఠశాలల్లో త్వరలోనే సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయి. సర్వే అనంతరం ఆయా పాఠశాలలపై సౌర విద్యుత్ పలకలు, ఇతర పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అనంతరం నెట్ మీటర్లను బిగించి నేరుగా ట్రాన్స్కో గ్రిడ్కు అనుసంధానిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 31 ప్రభుత్వ పాఠశాలల్లో రెండు నుంచి నాలుగు కిలో వాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తితో పాఠశాల విద్యుత్ అవసరాలు తీరగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్ను రికార్డు చేసి విక్రయించే సదుపాయం కలుగనున్నది.
31 పాఠశాలల్లో సౌర విద్యుత్ కాంతులు..
నిర్మల్ జిల్లాలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. బాసర మండల కేంద్రంలో రెండు, భైంసా మండలంలోని దేగాంతో పాటు భైంసా పట్టణంలోని వార్డు నం.4, 14, 17లలో ఉన్న పాఠశాలల్లో ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. దిలావర్పూర్లో ఒకటి, కడెం మండలంలోని లింగాపూర్, ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్, ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్లో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కుభీర్ పాఠశాల, కుంటాల మండలంలోని లింబా(కే), లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్, లక్ష్మణచాంద, లోకేశ్వరం, మామడ మండలంలోని కొరిటికల్, పొన్కల్, మామడ పాఠశాలల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
ముథోల్ మండలంలోని ఎడ్బిడ్, ముథోల్, నర్సాపూర్ (జీ) మండల కేంద్రంలో ఉన్న పాఠశాలతో పాటు నిర్మల్ పట్టణంలోని వార్డు నం.14, 18, 29లోని పాఠశాలల్లో, 24వ వార్డులో ఉన్న రెండు పాఠశాలలల్లోనూ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి, పొన్కూర్, సోన్ మండలంలోని న్యూ వెల్మల్, సోన్, తానూర్ మండలంలోని భోసి, తానూర్ పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల పైకప్పు సువిశాలంగా ఉండడంతో సోలార్ విద్యుత్ పలకల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే ఆయా పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
బిల్లుల భారం నుంచి ఉపశమనం..
ప్రభుత్వ పాఠశాలలను విద్యుత్ బిల్లుల భారం నుంచి కాపాడేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయం. సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, టీ-శాట్ ద్వారా జరిగే బోధనకు ఎలాంటి అంతరాయం కలుగవు. తరగతి గదిలో మంచి వెలుతురు, గాలి కోసం ఫ్యాన్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు మంచి వాతావరణంలో చదువులను కొనసాగించే వెసులుబాటు కలుగుతుంది.
– రవీందర్రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, నిర్మల్