Pranahita river | కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్ల క్రితం పూర్తికాగా, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఈ వంతెనపై నుంచి ప్రజలు, వ్యాపారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ప్రాణహిత నదిని ఆనుకొని రెండు వైపులా ఉన్న ప్రాంతాల మధ్య ఆత్మీయ, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇరువైపులా ఉన్న తమ బంధువులను కలుసుకునేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మర పడవల్లో నదిని దాటాల్సి వచ్చేది. నదిని దాటుతూ ప్రాణాలు పోతున్నా, నాటి సమైక్యపాలకు లు ఏనాడూ పట్టించుకోలేదు.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అనాధిగా పడుతున్న బాధలను గుర్తించి, భారీ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది.
చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద నిర్మించిన వంతెనతో ప్రాణహిత అవతలి వైపున కనిపించే మహారాష్ట్ర పరిధిలోని వంగెపెల్లికి రహదారి సదుపాయం కలిగింది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మహారాష్ర్టాలోని అహేరి, అల్లెపెల్లి పట్టణాల మీదుగా వెళ్లే హైవే వస్తుంది. వంతెన నిర్మాణం పూర్తి కావడంతో బంధుత్వాలు బలపడడంతోపాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి. చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్లలోపే మహారాష్ట్రలోని హైవే వస్తుంది. దీంతో కుమ్రం భీం ఆసిఫాబాద్తోపాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం కలిగింది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. వంతెన నిర్మాణానికి ముందు రోజు సుమారు 500 మంది నాటు పడవల్లో రాకపోకలు సాగించేవారు. ప్రాణ హితకు అవతలివైపున ఉన్న గ్రామాల్లో సంతలు నిర్వహించే రోజుల్లో అయితే 2 వేల మందికి పైగా రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం వంతెన నిర్మాణంతో వ్యాపారులు, ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించే వీలు కలిగింది.