నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న ఆరు ప్రైవేటు దవాఖానలను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సీజ్ చేశారు. ఇటీవల జిల్లా పర్యటకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దవాఖానల్లో ప్రసవాలపై ఆరా తీశారు. సాధారణ ప్రసవాలపై దృష్టిపెట్టాలని కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. కాగా, కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్మల్, భైంసాలోని ప్రైవేటు దవాఖానల్లో మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని జీకే, ఆదిత్య, స్వర్ణ, సూర్య దవాఖానలు, భైంసాలోని సాక్షి, దత్తసాయి ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేస్తున్నట్లు గుర్తించింది. తనిఖీ బృందం నివేదికను కలెక్టర్కు పంపించింది. వెంటనే ఆ దవాఖానలను కలెక్టర్ సీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దవాఖానల్లో అవసరం లేకున్నా సిజేరియన్లు చేయవద్దని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్తో పాటు ఆర్డీవోలు రాథోడ్ రమేశ్, లోకేశ్వర్రావు, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.