కాగజ్నగర్, ఆగస్టు 24 : తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి కాగజ్నగర్కు రాగా, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం హైదరాబాద్ నుంచి కాగజ్నగర్కు రైలులో వచ్చిన ఆయనకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పూలమాలలు వేసి, మిఠాయిలో తినిపించి స్వాగతించారు. రైల్వే స్టేషన్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాల వద్దకు చేరుకొని పూలమాలలు వేశారు. అనంతరం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు రుణపడి ఉంటానని, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరోసారి విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, కట్టుకథలు చెప్పి మోసం చేసే నాయకుల మాటలు నమ్మరని తెలిపారు. ఈ ప్రాంతానికి రెండు కైళ్లెన సర్సిల్క్, ఎస్పీఎం మూత పడ్డాయని, ఎస్పీఎంను తెరిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, ఇతర ఏ ప్రభుత్వాలు ఉన్నా మిల్లు తెరవకుండా తుక్కు కింద అమ్ముకునేటివని ఆరోపించారు. మిల్లు తెరిపించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కృషి ఎంతో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గాన్ని వెనుకబడ్డ ప్రాంతంగా గుర్తించి కోట్లాది రూపాయల నిధులు విడుదలు చేసిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని, మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఎస్పీఎం కార్మికులకు అండగా ఉంటా..
కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. కార్మికుల కోసం పనిచేసింది మా ప్రభుత్వమేనని కొనియాడారు. కొన్ని పార్టీలు కావాలని రెచ్చగొడుతున్నాయని, సమన్వయం పాటించాల్సిన అవసరముందని, రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులుపడితే జాడలేని నాయకులంతా.. ఇప్పుడొచ్చి నీతులు మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఓ పార్టీ నాయకుడు కార్మికుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని గొప్పలు చెబుతున్నాడని, వారితో అయ్యేది ఏముండదని, ఇది కార్మికులకు కూడా తెలుసని వివరించారు. ఇక మరో నాయకుడు కరోనా సమయంలో చికిత్స పేరిట లక్షలాది రూపాయలు దోచుకున్నాడని, అతడిని అస్సలే నమ్మొద్దని సూచించారు. కోనప్పను ఓడించడానికి బీజేపీ ప్యాకేజీ దిగిందని, తెర వెనుక ఎన్ని పొత్తులు పెట్టుకున్నా సిర్పూర్ ప్రజల ముందు నిలువరని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.