కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహితను ఆనుకొని ఉన్న చిన్న నియోజకవర్గం సిర్పూర్. సమైక్యపాలన సాగినంత కాలం ఈ ప్రాంతం చీకట్లోనే మగ్గింది. వాగులు, వంకలపై వంతెనల్లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నదుల్లో నాటుపడవలపై ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం. సరైన విద్య, వైద్యం సదుపాయాలు అందుబాటులో లేక కష్టాలను, కన్నీళ్లను ఎదుర్కొన్న నియోజకవర్గం, స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పదేళ్ల కాలంలో సిర్పూర్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి.
కాగజ్నగర్కు దేశంలోనే గుర్తింపు తీసుకువచ్చిన ఎస్పీఎం సమైక్యపాలనలో 2013లో మూతబడి వందలాది మంది కార్మికులు వీధినపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి విడుతలోనే ఎస్పీఎంని పునరుద్ధరించింది. పరిశ్రమ పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా రాయితీలను కల్పించింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1500 కుటుంబాలకు ఉపాధి కలిగింది.
ప్రాణహితపై ప్రభుత్వం కూ. 65 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో మహారాష్ట్రతో మానవ, వ్యాపార సంబంధాలు పెరిగాయి. నాటుపడవల ద్వారా పడుతున్న బాధలు తీరిపోయాయి. నియోకవర్గంలో 2014 నుంచి 34 వంతెనల నిర్మాణం చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ. 200 కోట్లు ఖర్చుచేసింది. వీటితో ఈ నియోజకవర్గంలో 95 శాతం గ్రామాలకు రవాణా వసతి కలిగింది. ఒక బొక్కివాగుపైనే తొమ్మిది చోట్ల 9 వంతెనలు నిర్మించింది. దీనికోసం రూ. 45 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసింది. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్ల తో 200 కి.మీ రోడ్లు ప్రభుత్వం నిర్మించింది. గతంలో లేని వందలాది గ్రామాలకు బీటీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి.
గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఐటీడీఏ ద్వారా ప్రత్యేకంగా రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. ఎన్ఆర్ఈజీఎస్తో రూ. 40 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న కాగజ్నగర్ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ చొరువతో రూ. 50 కోట్లు వెచ్చించి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు రెండు సార్లు నీటిని అందిస్తున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో రూ. 25 కోట్లతో వివిధ పను లు చేపట్టారు. రూ. 5 కోట్లతో కాగజ్నగర్ కేంద్రంలో 50 పడకల దవాఖానను నిర్మించారు. కిడ్నీ రోగుల కోసం కాగజ్నగర్లో డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 10, 300 మందికి లబ్ధి చేకూరగా, దాదాపు రూ. 100 కోట్లు అడపిల్లల పెండ్లిళ్లకు అందించింది. ఇక సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 10 కోట్ల సాయం అందించారు.ఉచిత విద్యుత్ సరఫరా పథకం ద్వారా నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటి వరకు 5వేల విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం కల్పించింది. దీనికోసం రూ. 10 కోట్ల తో 8 సబ్స్టేషన్లు, రూ. 57 కోట్లతో కౌటాల వద్ద 132 కేవీ విద్యుత్ ప్లాంట్ని నిర్మించారు. నియోజకవర్గంలో 34, 900 మందికి ఆసరా పింఛన్ అందుతున్నది. దీనికోసం ఇప్పటి వరకు రూ. 436 కోట్లు అందించింది. రైతు బంధు పథకం నియోజకవర్గంలోని రైతులకు ఇప్పటి వరకు రూ. 648 కోట్లు పెట్టుబడి సాయంగా అందజేసింది. ఇక రైతు బీమా కింద ప్రభుత్వం రూ. 30కోట్లను బాధిత కుటుంబాలకు అందేలా చేసింది. ఇక దళిత బంధు ద్వారా 100 కుటుంబాలకు రూ. 10 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.