మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘బెల్లంపల్లి యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పేరు తెలియనోళ్లు ఉండరు. సింగరేణి సంస్థ ఇల్లందు తరువాత బొగ్గు గనులను ప్రారంభించిన రెండో ప్రాంతం. ఒకప్పుడు పాత బెలంపల్లి ఏరియాలో చెరుకు తోటలు ఎక్కువగా సాగు చేసి బెల్లం తయారు చేసేవారు. అలా ఇది బెల్లంపల్లి అయ్యింది. ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చిన తొమ్మిదిన్నరేండ్లలో బెల్లంపల్లిలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. రోడ్లు లేని మారుమూల పల్లెలకు రోడ్లు వచ్చాయి.
ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు రూ.200కోట్లతో రోడ్లు వేశారు. ఒకప్పు డు వర్షాకాలంలో వాగులు, కాలువలు పొంగిపొర్లి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నీటిలోనే కొట్టుమిట్టాడిన గ్రామాలకు ఈ రోజు బీటీ రోడ్లు వచ్చాయి. కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి మండలాల్లోని కాలువలు, వాగులపై రికార్డులు స్థా యిలో రూ.77 కోట్లతో 22 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. బెల్లంపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ ఇండ్లకు పట్టాలు చేతికొచ్చారు. ఇప్పటికే దాదాపు 2,500 మందికి ఈ పట్టాలు అం దాయి. విద్య, వైద్య రంగాలు బలోపేతమవడంతోపాటు ని యోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన పెరిగింది. రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతమైన బెల్లంపల్లికి రెండు ఐటీ కంపెనీలు వచ్చాయి. బెల్లంపల్లి శివారులో 350 ఎకరాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు ఇటీవలే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
రోగమో, నొప్పో వస్తే వైద్యానికి దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేకుండా బెల్లంపల్లిలోనే రూ.16 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల దవాఖాన నిర్మించింది. డయాలసిస్ రోగులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాం తంలో ఒకప్పుడు డయాలసిస్ కోసం కరీంనగర్, ఆదిలాబాద్ వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. కానీ.. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొత్త ఆసుపత్రిలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటైంది. దీంతో నిరుపేదలైన డయాలసిస్ రోగులకు వ్యయప్రయాసలు తగ్గాయి.
రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేనివిధంగా రికార్డు స్థాయిలో బెల్లంపల్లిలో బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. బెల్లంపల్లి-వెంకటాపూర్, తాండూర్-భీమిని, తాళ్లగురిజాల-నెన్నెల మండలాల మధ్య డబుల్ రోడ్లు వచ్చాయి. తాండూర్ మండలంలోరూ.1.80 కోట్లతో కొత్తపల్లి-కిష్టంపేట-ద్వారకాపూర్ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. వేమనపల్లి మండలంలో రూ.11 కోట్లతో 4 కిలో మీటర్ల మేర మండల కేంద్రం నుంచి బుయ్యారం వరకు రోడ్డు వేశారు. కాసిపేట మండలంలో పెద్ద ధర్మారంలో రూ.4 కోట్లతో రోడ్డు, దేవాపూర్లో రింగు రోడ్డు నిర్మించారు. నెన్నెల మండలంలో జంగాల్పేట వరకు బీటీ రోడ్డు వచ్చింది. భీమిని మండలంలో వెంకటాపూ ర్, తిమ్మాపూర్ మధ్య రోడ్డు నిర్మాణం పూర్తయింది. కన్నెపల్లి మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి పోలంపల్లికి, వీరాపూర్కు రోడ్లు నిర్మించారు.
నియోజకవర్గంలోని ఎస్టీ గ్రామాలు బీటీ రోడ్లు వచ్చాయి. వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో రూ.77 కోట్లతో విస్తృతంగా బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయి. వేమనపల్లి మండలంలో రూ.8 కోట్లతో నీల్వాయి వంతెన నిర్మించారు. దీంతో 20 గ్రామాల ప్రజలు చెన్నూర్కు వెళ్లడానికి మార్గం సుగుమమైంది. భీమిని మండలం ఎర్రవాగుపై డీఎంఎఫ్టీ నిధులు రూ.4 కోట్లు, పెద్దవాగుపై రూ.4 కోట్లతో పెద్దపేటకు వెళ్లేందుకు బ్రిడ్జిలు నిర్మించారు. తాండూర్ మండలంలో దశాబ్దాల కలగా ఉన్న గంపలపల్లి బ్రిడ్జిని రూ.37 లక్షలతో నిర్మించారు. నెన్నెల మండలంలో కోనంపే ట, కృష్ణపల్లి మార్గంలో మూడు బ్రిడ్జిలు, కాసిపేట మండలం లో దేవాపూర్, చింతగూడ గ్రామాల మధ్య సల్పల వాగుపై, దేవాపూర్, గట్రావ్పల్లిలో రాళ్లవాగుపై బ్రిడ్జిలు నిర్మించారు.
నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రితోపాటు బెల్లంపల్లి పట్టణంలో రెండు చోట్ల బస్తీ దవాఖానలు అందుబాటులోకి వచ్చాయి. కాసిపేట మండలంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో రూ.1.30 కోట్లతో కొత్త భవనం నిర్మించారు. దుబ్బగూడెం, కాసిపేట, లంబడీతండాల్లో హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటితోపాటు నియోజకవర్గంలో మరో 20 హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. బెల్లంపల్లి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ, బాలుర గురుకుల కళాశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ నాలుగేళ్ల క్రితం గుర్తింపు పొందింది. బాలికల గురుకుల కళాశాల ఇంటర్ కళాశాలగా అప్గ్రేడ్ అయ్యింది. కాసిపేట బాలుర గురుకుల కళాశాల బెల్లంపల్లిలోనే ఉండడం, సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ కళాశాల రావడంతో బెల్లంపల్లి ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకుంది.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.31 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేశారు. మూడు వాటర్ హెడ్ ట్యాంకులు, వార్డుల్లో అంతర్గత పైపు లైన్ నిర్మించారు. కాసిపేట మండలంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, పంప్హౌజ్తోపాటు రొట్టపల్లి చౌరస్తాలో పంప్హౌజ్ ఏర్పాటు చేశారు. నెన్నెల మండలంలో 19 గ్రామపంచాయితీల్లో ఓవర్హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాక ముందు ఉన్న బిందెల కొట్లాట తగ్గింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. పట్టణంలోని 34 వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు.
ప్రతి వార్డులో ఎల్ఈడీ లైట్లతో పాటు, రద్దీ ఉండే ప్రదేశాల్లో నాలుగు బస్ షెల్టర్లను కట్టించారు. పోలీసుల ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాంటా చౌరస్తా, మున్సిపాలిటీ చౌరస్తాల్లో వాటర్ ఫౌంటేయిన్లతోపాటు సుందరీకరణ పనులు చేశారు. రూ.5 కోట్లతో బెల్లంపల్లిలో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు వేశారు. సరస్వతీ శిశుమందిర్ నుంచి రవీంద్రనగర్ వరకు రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో బెల్లంపల్లి బంగారమైంది.