శ్రీరాంపూర్, ఫిబ్రవరి 2 : రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా ఉంటుందని, అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం సింగరేణి భవన్ నుంచి బొగ్గు ఉత్పత్తి, నూతన ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ దేశ ఇంధన అవసరాలకోసం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా చేయాలని అన్ని ఏరియాల జీఎంలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాల్సిందేనని, మిగిలిన రెండు నెలల్లో 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణా చేయాల్సి ఉందని వివరించారు.
ఇందుకు రోజుకు కనీసం 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి చేయాలని, తద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాలనుకున్న ఒడిశాలోని నైనీ, కొత్తగూడెంలోని వీకే కోల్మైన్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీ, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీల ప్రారంభానికి కావాల్సిన అటవీ, పర్యావరణ అనుమతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మొత్తం 19.80 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాల్సిన రామగుండం-3 ఏరియాలోని ఆర్జీకోల్మైన్, బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీకి సంబంధించిన అనుమతులకు ముమ్మరంగా ప్రయత్నించాలని అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎన్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్రెడ్డి, ఈడీ జే అల్విన్, జీఎం కో ఆర్డినేషన్ సురేశ్, జక్కం రమేశ్, దేవెందర్, శ్రీరాంపూర్ నుంచి జీఎం సంజీవరెడ్డి, పీవోలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.