మందమర్రి, ఫిబ్రవరి 19 : ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి సీఅండ్ఎండీ బలరాం నాయక్ అన్నారు. సింగరేణి మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ప్రాజెక్టును సోమవారం ఏరియా అధికారులతో కలసి సందర్శించారు. గని వ్యూపాయింట్ నుంచి పనులను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని, అన్ని విభాగాల ఉద్యోగులు సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు.
ఏరియా అధికారులు రక్షణపై ప్రధాన దృష్టి పెట్టాలని, ఉద్యోగులు, కార్మికుల రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కేకే ఓసీ అధికారులు సీఅండ్ఎండీని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) శ్రీనివాస్, ఏరియా జనరల్ మేనేజర్ ఏ.మనోహర్, కేకేఓసీ ప్రాజెక్టు అధికారి రమేశ్, సీఎంవోఏఐ అధ్యక్షుడు రమేశ్, మేనేజర్ వీరయ్య పాల్గొన్నారు.
సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలతో పాటు పరిసర గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమర్రి పట్టణంలోని సిమ్టార్స్లో సింగరేణి యాజమాన్యం, సీఎస్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని సీఅండ్ఎండీ బలరాం నాయక్తో కలసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వరల్డ్ క్లాస్ను తలపిస్తుందన్నారు.
పబ్లిక్ సెక్టార్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా సమయం పడుతుందని, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ కృషి ఫలితంగా అనతి కాలంలోనే స్కిల్ డెవలప్సెంటర్ రూపు దిద్దుకుందన్నారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఇక్కడ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్ అండ్ పా) ఎన్వీకే శ్రీనివాస్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బీ. జనక్ప్రసాద్, ఏరియా జనరల్ మేనేజర్ ఏ.మనోహర్, సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, జాయింట్ డైరెక్టర్ విద్యానంద్ పాల్గొన్నారు.