మంచిర్యాల, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువకులు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 587 పోస్టులకుగాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి.. పట్టుబట్టి కొలువులు కొట్టారు. రాత్రీ.. పగలు ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాన్ని చేరుకొని ఆదర్శంగా నిలిచారు. కష్టపడి విజయం సాధించిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగాలకు ఎంపికైన పలువురిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించడమేగాక.. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం విడుదల చేసిన ఎస్ఐ, ఏఎస్ఐ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువకులు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ, తత్సమాన విభాగాల్లో మొత్తం 587 పోస్టులకుగాను 434 మంది యువకులు, 153 మంది యువతులు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పదుల సంఖ్యలో కొలువులు సాధించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి ఆణిముత్యాలుగా మెరిశారు. కష్టపడి చదివి, ఈవెంట్లు ప్రాక్టిస్ చేసి లక్ష్యాన్ని సాధించి ఆదర్శంగా నిలిచారు. మరోవైపు తమ ప్రాంతానికి చెందిన వారు ఉద్యోగాలకు ఎంపికవడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగం సాధించిన పలువురిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, ఉద్యోగ సాధన కోసం వారు పడిన కష్టాన్ని తమ మాటల్లో వ్యక్తం చేశారు.
రెండోసారికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది
నా పేరు పెగడపల్లి కోటేశ్. మాది బెజ్జూర్ మండలం సోమిని గ్రామం. తల్లిదండ్రులు అమృత-శంకర్. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేనే పెద్దోడిని. మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. కానీ అందులో అంతగా పంట పండదు. సోమినిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. గిరిజన ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7 తరగతు లు పూర్తి చేశాను. 8 నుంచి 10వ తరగతి వరకు కాగజ్నగర్లోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో చదివాను. 2009-10లో పదో తరగతిలో టాప్ ర్యాంక్ (497/600) వచ్చింది. హైదరాబాద్లోని నిజాం పేట శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీటు వచ్చింది. ఎంపీసీ గ్రూపు తీసుకొని పూర్తి చేశాను. ఇంటర్లో కూడా మంచి (902/1000 (90.2 శాతం) మార్కులు సాధించాను.
అనంతరం హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశాను. 2018లో ప్రభుత్వం కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండింటికీ ఐప్లె చేశాను. కానీ కోచింగ్ తీసుకోకుండా తప్పుచేశాను. దీంతో అప్పుడు ఏ ఉద్యోగం రాలేదు. 2020-21లో మళ్లీ నోటిఫికేషన్ వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎస్పీ మధుకర్ స్వామి సహకారంతో సిద్దిపేటలోని పురావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అనే సంస్థలో చేరేందుకు ఎంట్రాన్స్ రాశాను. అందులో నాకు తెలంగాణ స్టేట్లో రెండో ర్యాంకు వచ్చింది. అంతలోనే ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికే షన్ రాగా, అప్లయ్ చేశాను. ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. నాకు ఉద్యోగం వచ్చింది. ఎస్పీ మధూకర్స్వామి సహకారం మరువలేనిది. మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నన్ను అభినందించినందుకు ఆనందంగా ఉంది. కష్టపడి చదివించి నన్ను ఇంతటి వాడిని చేసిన నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటా.
ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి..
నా పేరు అడ్డి కృష్ణారెడ్డి. మాది జైనథ్ మండలం కూర గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. తండ్రి చనిపోతే.. తల్లే కష్టపడి చదివించింది. పదో మా ఊరి పాఠశాలలో పదో తరగతి దాకా చదివాను. నిజామాబాద్ కాకతీయ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. హైదరాబాద్లో బీటెక్ చదివాను. ఆ తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వచ్చాను. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరాను. ఎస్ఐ కావాలనేది నా కల. నోటిఫికేషన్ రాగానే సెలవు పెట్టి ప్రిపేర్ అయ్యాను. ప్రస్తుతం సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాను. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా. బాధ్యతగా విధులు నిర్వర్తించి పేరు తెచ్చుకుంటా.
సొంతంగా ప్రిపేర్ అయ్యాను
నా పేరు నవ్నీత్రెడ్డి. మా ఊరు జైనథ్ మండలం మాకోడ గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. తండ్రి ఆశారెడ్డి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి విజయ అన్నీ తానై చూసుకున్నది. నా తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. మాకోడ ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి దాకా చదువుకున్నా. జైనథ్ జడ్పీఎస్ఎస్లో ఆరు నుంచి పదో తరగతి, ఆదిలాబాద్లోని విద్యార్థి కళాశాలలో ఇంటర్, నలంద కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్లో ఎమ్మెస్సీ, బీఈడీ చదివాను. ప్రభుత్వం ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగాఏ హైదరాబాద్లో ఉండి సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల ఫలితాలు వచ్చాయి. సివిల్ ఎస్ఐగా ఎంపికైన. చెప్పలేనంత ఆనందంగా ఉంది.
ఫైర్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించాను
నా పేరు సాదుల సాయి త్రిలోకనాథ్రెడ్డి. మా సొంతూరు సీసీసీ. చెన్నూరులో ఉంటున్నాం. అమ్మ లక్ష్మి, తండ్రి తిరుపతి. చెన్నూర్ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు. రామకృష్ణాపూర్లో ఒకటో తరగతి, చెన్నూర్ పట్టణంలోని సర్సతీ శిశుమందిర్లో రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివాను. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సరస్వతి శిశుమందిర్లో 9, 10 పదో తరగతి పూర్తి చేశాను. గుంటూరులోని శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదివాను. మంథని జేఎన్టీయూలో బీటెక్ మైనింగ్ పూర్తి చేశాను. రాష్ట్ర ప్రభుత్వం 2018లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఐప్లె చేసుకున్నా. 2020లో ఫైర్ కానిస్టేబుల్గా సెలెక్టయ్యాను. మొదటి పోస్టింగ్ చెన్నూర్లో ఇచ్చారు. ఆ తర్వాత కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ 317 జీవోలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాను. అక్కడ ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించాను. 2022లో ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో సీరియస్గా ప్రిపేరయ్యాను. నోటిఫికేషన్ సమయానికి తన ప్రొబెషనరీని కూడా పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతం విడుదలైన ఫలితాల్లో సివిల్ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాను. మా పర్సనల్ కోచ్ మరాఠి శంకర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆయన మంచిర్యాల డీసీపీ వద్ద గన్మెన్గా విధులు నిర్వరిస్తున్నారు. ఆయన వల్లే ఎస్ఐగా సెలెక్టయ్యాను.
టీచర్ ఉద్యోగం చేస్తూనే ఎస్ఐగా ఎంపికైన..
నా పేరు జాడే సుస్మిత. కుభీర్ మండలం నిగ్వ గ్రామం. తల్లిదండ్రులు నాందేవు-మీనాక్షి. ఒకటి నుంచి పదో తరగతి దాకా మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఇంటర్ (961 మార్కులు) పూర్తి చేశాను. ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కాలేజీలో డీఎడ్ చేశాను. 2018లో టీచర్ కొలువు సాధించాను. వశిష్ఠ డిగ్రీ కాలేజీలో (ఎంపీసీఎస్) పూర్తి చేశాను. మా ఊరి పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తూనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ పూర్తి చేశాను. ఇంతలోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చిన్నతనం నుంచే పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అందుకే ఐప్లె చేసి.. కష్టపడి ప్రిపేర్ అయ్యాను. మా కజిన్ కేశవ్.. నేను ఇద్దరం ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యాం. ఎప్పుడూ నా వెన్నంటి ఉంటూ ఎలా ప్రిపేర్ కావాలో నేర్పించారు. ఫిట్నెస్పై తర్ఫీదు ఇచ్చారు. దీంతో నేను గెటాన్ అయ్యాను. నా కోరిక నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వంలో రెండు ఉద్యోగాలను సాధించాను. కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే ఏదైనా సాధించవచ్చు. తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహించారు.