ఆదిలాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ):భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. మంత్రి అలోల్ల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డి, మాజీ ఎంపీ నగేశ్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తుండగా.. మహారాష్ట్రవాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. రైతులు, యువతీయువకులు, మహిళలు, వ్యాపారులు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటిస్తున్నారు. తెలంగాణ పథకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మాకూ కూడా కావాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ మా వద్ద సభ ఏర్పాటు చేస్తే జనాలను తరలిస్తామని, బీఆర్ఎస్లో చేరుతామని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. టికెట్ కేటాయిస్తే పోటీ కూడా చేస్తామని తెలుపుతున్నారు.
కేసీఆర్తోనే దేశం బాగు పడుద్ది..
కుభీర్, డిసెంబర్ 25 : తెలంగాణ ఉద్యమధీరుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో దేశం దశదిశ మారుతుందని నమ్ముతున్నాం. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. అక్కడ అమలవుతున్నటు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని భావిస్తున్నా. మా మహారాష్ట్ర వాళ్లు తెలంగాణకు బతుకుదెరువుకు వస్తున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా పథకాలు అమలు చేస్తారు. రైతు సంక్షేమ సర్కారు ఏర్పడుతుంది. నేను బీఆర్ఎస్లో చేరాలని అనుకుంటున్నా. నాతోపాటు చాలా మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ మా జిల్లాలో పర్యటిస్తారని అంటున్నారు. అప్పుడు చేరేందుకు కసరత్తు చేస్తున్నాం.
– జీ.భూమారెడ్డి, సర్పంచ్, కీని గ్రామం, మహారాష్ట్ర.
ఆదిలాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దుగా మహారాష్ట్ర ఉంటుంది. దాదాపు 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మహారాష్ట్రలోని వందలాది గ్రామాల ప్రజలకు ఉమ్మడి జిల్లావాసులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరు రాష్ర్టాలవాసులు దశాబ్దాలుగా పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడంతో రక్తసంబంధం ఏర్పడింది. ఇంకా.. వ్యాపారం, శుభకార్యాలు, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా ఉపాధి, వైద్యం కోసం వస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరు రాష్ట్రాల ప్రజలు సంబంధాలు కలుపుకోవడానికి కొంత వెనుకడుగు వేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక చాలా మార్పు వచ్చింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహారాష్ట్ర వాసులు పిల్లలను ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రముఖంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రూపాయికి కిలో బియ్యం, ఆసరా పింఛన్లు, మూడెకరాల భూమి, కేసీఆర్ కిట్ వంటి పథకాలకు ఆకర్షితులయ్యారు.
ఈ ఎనిమిదేండ్ల కాలంలో వేలాది జంటలు వివాహంతో ఒక్కటయ్యాయి. అధికంగా మహారాష్ట్రవాసులు మహిళలను ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో పురుషులకు అధిక భూములు ఉండడం, ప్రభుత్వ పథకాలు వర్తించడంతో తమ కూతుళ్లు బాగా బతుకుతారనే నమ్మకంతో ఇస్తున్నారు. సంక్షేమ పథకాల ఫలితంగా పేదలు ఆర్థిక ప్రగతి సాధించడంతోపాటు ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు అంతంత మాత్రంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో పేదల జీవితాల్లో మార్పు కనిపించడం లేదు. తెలంగాణ పల్లెల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడడం, ఉపాధి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు తమ పల్లెలను తెలంగాణలో కలుపాలని ఏండ్లుగా కోరుతున్నారు. మహారాష్ట్ర వాసులు కొందరైతే బహిరంగంగానే తెలంగాణకు వచ్చి మంత్రులను కలిసి విన్నవించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
బీఆర్ఎస్కు ఆదరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దుగా మహారాష్ట్రలోని కేళాపూర్, కిన్విట్, యావత్మాల్, నాందేడ్, వణి, చంద్రాపూర్, భోకర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు మహారాష్ర్టలోని పలు నియోజకవర్గాల్లో పది రోజులుగా పర్యటిస్తున్నారు. మహారాష్ట్రవాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. నిర్మల్ జిల్లా బాసర సరిహద్దులో ఉన్న ధర్మాబాద్ తాలూకాకు చెందిన 25 మంచి సర్పంచ్లు తాము ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ నగేశ్, ఇతర ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు సభలు, సమావేశాలకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మా బంధువులు, స్నేహితులు, బాగా అభివృద్ధి చెందారని, తమకు కూడా అలాంటి పథకాలు కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని, బీఆర్ఎస్కు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున తాము పోటీ చేస్తామని ప్రజాప్రతినిధులు బహిరంగంగానే చెబుతున్నారు. మాకు మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా మహారాష్ట్రలో పర్యటించాలని విన్నవిస్తున్నారు.
బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు..
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు మంచి స్పందన వస్తున్నది. మా పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, స్థానికులు సమావేశాలకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. శివసేన, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ నీరు, కేసీఆర్ కిట్, పండుగల కు ప్రభుత్వం అందించే కానుకలు లాంటి పథకాలు తమకు కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్లో చేరడానికి స్థానిక నాయకులు, రైతులు, మహిళలు, యువకులు సిద్ధంగా ఉన్నారు. దేశంలో ప్రజాసంక్షేమానికి పాటు పడే ప్రభుత్వాలు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్తో రైతులు, పేదల అభివృద్ధి సాధ్యమవుతుందని మహారాష్ట్ర వాసులు అంటున్నారు.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి.
చేరడానికి రెడీ మహారాష్ట్రలోని జడ్పీటీసీతోపాటు 15 మంది సర్పంచ్లు సిద్ధం
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆదివారం మహారాష్ట్ర లో పర్యటించారు. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా ప్రచారం చేశారు. నాయకులతో కలిసి చంద్రాపూర్ జిల్లా జీవీటీ తాలుకా సేవదాస్నగర్లో పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించారు. జీవీటీ తాలుకాకు చెందిన జడ్పీటీసీతోపాటు 15 మంది సర్పంచ్లు బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో రైతులు, పేదలకు మేలు జరుగుతుందని మహారాష్ట్ర వాసులు ఆశాభవం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు మర్సుకోల తిరుపతి ఉన్నారు.
స్వచ్ఛందంగా తరలివస్తున్నారు..
బీఆర్ఎస్ ఏర్పాటు మహారాష్ట్రలోని గ్రామాల్లో చర్చనీ యాంశంగా మారిం ది. తమ పర్యటనల సందర్భంగా నిర్వ హించే సమావేశా లకు ప్రజలు స్వచ్ఛం దంగా తరలివస్తున్నారు. మేము చెబుతున్న విషయాలు ఆసక్తిగా వింటున్నారు. మహారాష్ట్రవాసులకు తెలంగాణ పథకాలపై పూర్తి అవగాహన ఉంది. మన ప్రభుత్వం రైతులు, పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయంటూ వాటి పేర్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందని, తాము బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహారాష్ట్ర ప్రజలు ప్రకటిస్తున్నారు.
– జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్.
బీఆర్ఎస్పై చర్చ మొదలైంది..
తెలంగాణ రాష్ట్రంల మాకు బంధువులు, స్నేహితులు ఉన్నరు. అక్కడ సీఎం కేసీఆర్ సార్ రైతులకు మంచి పథకాలు అమలు చేస్తున్నాడని విన్నాం. ఎవుసానికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా 24 గంటల కరంటు ఇవ్వడం బాగుంది. మాకు కూడా ఇస్తే మూడు పంటలు తీస్తుంటిమి. గీ సమయంల టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడం మా మంచికే. కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో ఇచ్చే పథకాలు దేశమంతా అమలు చేస్తడని విన్నం. అట్లయితే మా ఓట్లన్ని ఆయనకే. మాకు కూడా రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి రకరకాల పథకాలు అందుతాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు మా వద్దకు వచ్చి తిరుగుతున్నరు. మాకు ఆశ కలుగుతున్నది. మా ఊరు, వాడా.. ఏ ఇద్దరు, ముగ్గురు కలిసినా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నరు.
– దత్తారావు దేశ్ముఖ్, తూప్టాక్లి, డిగ్రస్ తాలూకా, యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర.
కేసీఆర్ సభకు జనాలను తరలిస్తా..
జనవరి మొదటి వారంలో కేసీఆర్ నాందేడ్లో బహిరంగ సభ ఉంటుందని అంటున్నా రు. ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో జనాలు, ముఖ్యంగా రైతులను భారీ సంఖ్యలో తరలిస్తా. అప్పుడు ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పురుడు పోసుకున్న అనతి కాలంలోనే ప్రజల నుంచి మహారాష్ట్రలో మంచి స్పందన రావడం గొప్ప విషయం. బహిరంగ సభ తర్వాత చాలా మంది పార్టీలో చేరతారు. బార్డర్లో ఉన్న మాకు తెలం గాణ సరిహద్దులో ఉన్న మీకు చాలా తేడా ఉంది. పింఛన్, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, రైతు లకు అన్ని విధాలా ఆదుకునే పథకాలు ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేశాయనడంలో సందేహం లేదు.
– కే. నరేష్రెడ్డి, యువ నాయకుడు,కీని గ్రామం, మహారాష్ట్ర.
బీఆర్ఎస్లో చేరా..
దేశంలోని రైతులం దరికీ ఒకే విధంగా పథకాలు అమలు కావాల న్నది తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్లా ఉంది. అందుకే శుక్రవారం కర్ర వినాయకుడి సన్నిధిలో ఐకే రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నా. తెలంగాణలో రైతుబంధు, రైతు మర ణిస్తే రూ.5 లక్షల భీమా, సాగుకు 24 గంటల నాణ్య మైన ఉచిత కరెంట్, వాణిజ్య పంటల సాగుకు రాయి తీ, అందుబాటులో ఎరువులు విత్తనాలు, రైతులు పండించిన పంటల కొనుగోలు లాంటి అనేక పథకాలతో అన్నదాతలు ఆనందంగా జీవిస్తున్నారు. రైతులకు న్యాయం బీఆర్ఎస్ తోనే సాధ్యం అవుతుంది.
– సంజయ్ రౌత్,నాయకుడు, పాలజ్ గ్రామం, మహారాష్ట్ర.
తెలంగాణ పథకాలు అమలు చేయాలంటున్నారు..
మహారాష్ట్రలో పర్యటించినపుడు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రవాసులు మెచ్చు కుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలో అమలు కావడం లేదని బాధపడుతు న్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడంలేదని చెబుతున్నారు. తెలంగాణ అభివృ ద్ధి తమకు కావాలని, సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమవు తుందని మహారాష్ర్టవాసుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – నగేశ్, మాజీ ఎంపీ, ఆదిలాబాద్.
మహారాష్ట్ర ప్రగతికి బీఆర్ఎస్ రావాల్సిందే..
నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా చెబుతున్నా బీఆర్ఎస్ను తప్పకుండా ప్రజలు ఆదరిస్తరు. కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం మంచి పరిణామం. ఆయన ప్రధాని అయితే దేశ రూపురేఖలే మారిపోతాయి. ప్రధానంగా రైతులు ప్రగతి బాటలో పయనిస్తారు. రైతు సంక్షేమ దేశంగా మారుతుంది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మా ఆడబిడ్డలను తెలంగాణకు ఇస్తున్నం. ఇచ్చిన వారందరూ మంచిగా బతుకుతున్నరు. విద్య, వైద్యానికి ఢోకా లేదు.
– జంగిల్వార్ వివేక్యాదవ్, మాజీ సర్పంచ్(కాంగ్రెస్), సగ్ధ, కేళాపూర్ తాలూకా, యావత్మాల్, మహారాష్ట్ర.